సంగీతం

సంగీతం

దాచుకో నీపాదాలకు - దగ నే జేసినపూజ లివి పూచి నీకీరీతిరూప - పుష్పము లివి యయ్యా || వొక్కసంకీర్తనే చాలు - వొద్దికైమమ్ము రక్షించగ తక్కినవి భాండారాన - దాచి వుండనీ వెక్కసమగునీ నామము - వెలసులభము ఫల మధికము దిక్కై నన్నేలితి విక నవి తీరనినాధనమయ్యా || నానాలికపైనుండి - నానాసంకీర్తనలు పూని నాచే నిన్ను -బొగడించితివి వేనామాలవెన్నుడా -వినుతించ నెంతవాడ కానిమ్మని నా కీపుణ్యము -గట్టితి వింతేయయ్యా || యీమాట గర్వము గాదు - నీ మహిమే కొనియాడితిగాని చేముంచి నాస్వాతంత్ర్యము - చెప్పినవాడగాను నేమాన బాడేవాడను - నేరము లెంచకుమీ శ్రీమధవ నే నీదాసుడ - శ్రీవేంకటేశుడవయ్యా ||దాచు|| అని సవినయంగా కోరుతూ, హరి అవతారమైన అన్నమయ్య దాదాపు 32వేల సంకీర్తనలతో ఆ వేంకటేశ్వరుని అర్చించి ఆ వేంకటాచల వైభవాన్ని, మహాత్మ్యాన్ని సాక్షాత్కరింప చేశాడు. తరచి చూస్తే, ఆయన ఆధ్యాత్మ, శృంగార కీర్తనలలో ఏడుకొండలవాని తత్త్వము, తిరుమల వైశిష్ట్యం, వేంకటాచల వాసుని శోభ మనకు అవగతమవుతాయి. వేదములే శిలలై వెలసిన దీ కొండ యే దెస బుణ్యరాసులే యేరులైన దీ కొండ గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ శ్రీదేవు డుండేటి శేషాద్రి యీ కొండ అంటూ, అన్నమయ్య ఆ శేషాద్రి యొక్క ప్రశస్తిని స్వామివారికి జరిగే సేవలు, అర్చనలు, ఉత్సవాలు, తిరుమల వైభవాన్ని తన సంకీర్తనలలో కీర్తించాడు. ఎన్నెన్నో ఉద్యానవనాలతో, పుణ్య తీర్థాలతో, మణిమయ గోపురాలతో, వెలుగొందే ఆనందనిలయం శోభ వర్ణనాతీతం. సీ. ఘన గోపురములు, ప్రాకార మంటపములు, తేరులు, సత్పుణ్య తీర్ధములును, కమలాప్త కిరణ సంకలితంబులై ప్రకా శించుచుండెడి హేమ శిఖరములును, పావన పరివార దేవతాలయములు, మహిమ నొప్పు విరక్తమఠవరములు, రంగ దుత్తుంగ మాతంగ తురంగముల్, కొమ్మరొప్పు బహుసాధు గోగణములు, తే. ముద్దుగా బల్కు శుకపికములును, నీల కంఠములును, మరాళసంఘములు మఱియు ఫల చయుంలు, తులసికాదళ, సుమములు క్రిక్కిఱిసియుండు వేంకటగిరి పురమున (శ్రీ వేంకటాచల మహాత్మ్యములో తరిగొండ వేంగమాంబ) ఉగ్రవరాహ రూపం దాల్చి ఇలచేరిన విష్ణువు ఇక్కడే నివాసమేర్పర్చుకోవాలని సంకల్పిస్తే, తానిచటికి రాకుండిన, నేచటికినైనను వచ్చి, మహాత్ముని వక్షమున వసముండెదనని, పతిని చేరిన శ్రీ మహాలక్ష్మిని వక్షస్థలంలో నిలుపుకొని స్వయంభువుగా, ‘అరుదైన శంఖచక్రాదులతో, సరిలేని అభయ హస్తంతో’, శతకోటి సూర్యతేజములతో, అనుపమ మణిమయమగు కిరీటముతో వెలసిన శ్రీపతిని కన్నులారా దర్శించి, అతిశయంబైన ఆ శేషాద్రిని అన్నమయ్య నోరారా కీర్తించాడు. ప|| అదెచూడు తిరువేంకటాద్రి నాలుగుయుగము లందు వెలుగొందీ ప్రభ మీరంగాను తగ నూటయివువైయెయిమిది తిరుపతుల గల స్థానికులును చక్రవర్తి పీఠకములును అగణితంబైన దేశాంత్రుల మఠంబులును నధికమై చెలువొందగాను మిగులనున్నతములగు మేగలును మాడుగులు మితిలేనిది దివ్యతపసులున్న గృహములును వొగి నొంగుబెరుమాళవునికి పట్టయి వెలయు దిగువతిరుపతి గడవగాను ||అదె|| పొదలి యరయోజనముపొదవునను బొలుపొంది పదినొండు యోజనంబులపరపునను బరగి చెదర కేవంకచూచిన మహాభూజములు సింహశార్దూలములును కదిసి సువరులు కిన్నరులు కింపురుషులును గరుడగంధర్వ యక్షులును విద్యాధరులు విదితమై విహరించు విశ్రాంత దేశముల వేడుకలు దైవారంగాను ||అదె|| యెక్కువలకెక్కువై యెసగి వెలసిన పెద్ద యెక్కు డతిశయముగా నెక్కినంతటిమీద అక్కజంబైన పల్లవరాయమనిమటము చక్కనేగుచు నవ్వచరి గడచి హరిదలచి మ్రొక్కుచును మోకాళ్లముడుగు గడచినమీద నక్కడక్కడ వేంకటాద్రీశుసంపదలు అంతంతగానరాగాను ||అదె|| బుగులుకొనపరిమళంబులపూవుదోటలును పొందై ననానావిధంబుల వనంబులును నిగిడి కిక్కిరిసి పండిన మహావృక్షముల నీడలను నిలిచి నిలిచి గగనంబు దాకి శృంగారరసభూరితమై కనకమయమైనగోపురములను జెలువొంది జగతీధరునిదివ్యసంపదలు గలనగరు సరుగనను గానరాగాను ||అదె|| ప్రాకటంబైన పాపవినాశనములోని భరితమగుదురితములు పగిలి పారుచునుండ ఆకాశగంగతోయములు సోకిన భవము లంతంత వీడి పారంగను యీకడను గోనేట యతులు బాశుపతుల్ మును లెన్న నగ్గలమైవున్న వైష్ణవులలో యేకమై తిరువేంకటాద్రీశుడా దరిని యేప్రొద్దు విహరించగాను ||అదె|| ఈ బ్రహ్మాండంలోనే సాటిలేని, మేటైన దివ్య క్షేత్రం శ్రీనివాసుడుండేటి తిరుమలకొండ. శేషాద్రి, క్రీడాద్రి, వేంకటగిరి అని ప్రసిద్ధి చెందిన ఈ శిఖరానికి చింతామణి, జ్ఞానాద్రి, తీర్ధాచలము, పుష్కరశైలము, వృషభాద్రి, కనకాచలము, నారాయణాద్రి, శ్రీవైకుంఠాద్రి, నరసింహ గిరీంద్రము, అంజనాద్రి, వరహాద్రి, నీలగిరీంద్రము, శ్రీనివాస పర్వతము, ఆనందాచలము, శ్రీసద్గిరి, క్రీడాచలము, గరుడాద్రి, శేషాచలము, వృషాద్రి, మరియు వేంకటాద్రి అని కూడా పేర్లు కలవు. శ్రీమన్నారయణుడున్న ఈ పర్వత మహాత్మ్యాన్ని వర్ణించటం మానవమాత్రులకు సాధ్యంకాదు. మనోనేత్రంతో దర్శించి కళ్లముందు సాక్షాత్కరింపచేయటం అన్నమయ్య వంటి వాగ్గేయకారులకి మాత్రమే సాధ్యం.

‘‘వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమో దేవో న భూతో నభవిష్యతి’’

సౌమ్యశ్రీ రాళ్లభండి
నాలుగైదు సంవత్సరాల క్రితం అన్నమయ్య సంకీర్తనార్చన అని ఒక కార్యక్రమం చేసి, ఆ వాగ్గేయకారుని కీర్తనలు ఆలపించాం. అప్పుడు ఆరేళ్ల మా అమ్మాయి కూడా నాలుగైదు కీర్తనలు పాడి మా బంధువర్గానికి ముఖ్యంగా మా అత్తమామాలకి కొంచెం ఆశ్చర్యం, కొంచెం సంతోషం, కూసింత గర్వ కల్గించింది. ఆ కార్యక్రమం వీడియో మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కాదనకుండా, వద్దననీయకుండా మా మామ గారు సుత్తివీరభద్రరావు మాదిరి వీడియో అరిగిపోయేదాకా తాము చూసి, ఇతరులకి చూపి ఆనందపడిపోయారు. అక్కడితో ఆగితే ఏమో, ఆ ఊపులో ఇక తాళ్లపాకవారి పలుకులన్ని మా ఇంటనే అంటే మా అమ్మాయి నోటనే పలకాలన్న తాపత్రయంతో బజారులో ఉన్న అన్నమయ్య కీర్తనల క్యాసెట్లన్ని విరివిగా కొని ఆస్ట్రేలియాలో ఉన్న మాకు పంపారు. నేను కూడా శాయశక్తులా మా అమ్మాయి లేచినప్పటినుంచి నిదురపోయేదాక కీర్తనలు విన్పించి, విన్పించి పైసా వసూలు చేసాను. ఇంతలో మా మామగారు తిరుపతి వెళ్లటం తటస్థించింది. అక్కడ దేవస్థానం వారి పుస్తకాల షాపులో అన్నమయ్య కీర్తనల పుస్తకం దొరికింది. షరామామూలే! అది మా ఇంటికి వచ్చి చేరింది. కోతికి కొబ్బరికాయ దొరికనట్టు, నేనైనా నోరుమూసుకోవచ్చా, లేదు. తిరుపతి దేవస్థానం వారు అన్నమయ్య కీర్తనలన్నింటిని సుమారు 40 పుస్తకాల్లో ప్రచురించారని నోరుజారాను. అంతే ఉత్తర క్షణం మా మామగారు తిరుపతికి డిడి పంపి ఆ పుస్తకాలన్ని ఆర్డరిచ్చారు. ఏమాట కా మాటే చెప్పుకోవాలి, దేవస్థానం వారు కూడా ఎంతో శ్రద్ధగా, ఓపికగా ఆ పుస్తకాలన్నింటిని రెండు గోనె సంచీలకెత్తించి (ఇది హాస్యానికి అంటున్నమాటలు కాదండి! వాస్తవం) హైద్రాబాదులో మా మామగారికి పంపారు. అవి తపాల సర్వీసువారి ఆధ్వర్యంలో ఎండకి ఎండి, వానకు తడిసి, ముద్దై, నీరై, కొన్ని పుస్తకాలకు అట్టలు ఊడి, కొన్నింటి పేజీ చిరిగి, మరికొన్నింటి పేజీలు అతుకుల తడకై, బురుద మరకలతో, ముట్టుకుంటే ఊడిపోయేటట్టు తాళ్లపాకవారి కవిత వైభవాన్ని మోసుకుంటూ హైద్రాబాద్ చేరుకున్నాయి. బస్తాల్లో ఎవరు ఏ బాంబు పంపారో అని బెంబేలుపడి, అయినా ధైర్యం తెచ్చుకొని మూటవిప్పి, తమ ఇంటికి నడచి వచ్చిన అన్నమయ్యవారి కవితలను చూసి, ఆ భగవంతుడే, ఆ తిరుమలవాసుడే తమ ఇంటికి నడచి వచ్చాడని సంబరపడి, మళ్లీ ఆ బస్తాని యథాతధంగా మూటగట్టి, నాకో మెయిల్ పెట్టారు. అమ్మాయి, ఇక అన్నమయ్యవారు నీ సొత్తు ఎప్పుడు తీసుకువెడతావు అని. ఆ బస్తా చూసిన మా ఆడపడుచు వదిన పుస్తకాలు తీసుకు వెళ్లదేమో ఎందుకైనా మంచిది వీలునామాలో కూడా రాయి నాన్నా, అవి నా సొత్తని గట్టిగా చెప్పింది. మా అత్తగారు కూడా నాకు ఫోన్ చేసి, ఎలుకలు కొరికి, చెదలు పట్టిన పుస్తకాలు ఇంకా చెడిపోక ముందే సంరక్షించుకో అని హెచ్చరించారు. అది విని మా వారు కారాలు, మిరియాలు మిక్సీ అవసరం లేకుండానే మెత్తగా నూరారు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకి కోపం! నోరుజారిన పాపానికి మావారని బ్రతిమాలి, బామాలి, కాళ్ల,వేళ్లపడి ఆ పుస్తకాల బస్తాలను హనుమంతుడు సంజీవినీ పర్వతాన్ని మోసుకొచ్చినట్టు భద్రంగా, భక్తితో ఆస్ట్రేలియాకు చేర్చాం. బస్తాలు విప్పి ఆ పుస్తకాలు చూస్తుంటే, చెప్పొద్దు, ఎన్నో గంటలు పురిటినొప్పులు అనుభవించి, ప్రసవించిన తర్వాత తన బిడ్డను చూసుకుంటే ఒక తల్లికి ఎంత ఆనందం కల్గుతుందో అంత ఆనందం కల్గింది. ఓర్పుగా ఒక్కొక్క పుస్తకం ఎండలో వేసి బాగా ఎండాయన్న నిర్ధారణకి వచ్చాక, చక్కగా పుస్తకాల బీరువాలో వాటిని అలంకరించి మురిసిపోయాను. ఇంతవరకు బాగానే ఉంది, తెలుగు చదవడం, రాయడం కూడా రాని మా అమ్మాయి అన్ని పుస్తకాలు చూసి మూర్చిల్లి, ఇక రేపటి నుంచి నన్ను తెలుగులో ముంచి, కీర్తనల్లో తేల్చి ఆరేస్తారేమోనని బెంబేలు పడితే దాన్ని ఊరుకోపెట్టి, అధైర్యపడద్దని ధైర్యం చెప్పి, ఏమి చేతురా లింగా అని పాడుకోవడం నా వంతైంది. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానంటే, ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమయ్య ప్రాజెక్టు ద్వారా ఏం సాధించారో నాకైతే తెలియదు గాని, పుస్తకాలని, వాటిలో విలువ కట్టలేని కవితా వైభవాన్ని కనీసం గుర్తించలేని వారు, గౌరవించలేని వారు అక్కడ పనిచేస్తున్నారని మాత్రం తెలుస్తోంది. పుస్తకాలు కొని మీరేం సాధించారని అడుగుతారేమో, అక్కడకే వస్తున్నా. అక్షర, లక్షలు చేసే ఆ పుస్తకాలు నాలుగేళ్లుగా మా బీరువాల్లో మగ్గుతుంటే ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయం కల్గింది. మనకి తెలియని ఆ వేంకటేశ్వరుని వైభవం, తిరుమల ప్రాశస్త్యం అనేక అన్నమయ్య కీర్తలల్లో అడుగడునా మనకి గోచరిస్తాయి. అలాంటి కీర్తనలని వెదికి, తిరుమలరాయునికి అన్వయించి పాఠకులకు పరిచయం చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కల్గింది. కొన్ని వేల కీర్తనల్లోంచి ఏ కొన్నింటిని ఎంపిక చేయాలి. చాలా పెద్ద ప్రయత్నమే. అలాగైనా అన్నమయ్య కీర్తనలను కనీసం ఒక్కసారైనా చదవచ్చన్న ఉద్దేశంతో ఈ పంచవర్ష పథకానికి పూనుకున్నాను. ఒక్కరోజులో ఈ ప్రాజెక్టు పూర్తికాదు. తెలుసు. ఎప్పటికైతే అప్పటికే! రామకోటి ఒక జీవిత కాలంలో పూర్తిచేయగలమా? ఏమో భగవదానుగ్రహం, ఎన్ని కీర్తనలు పాఠకులకి పరిచయం చేయగలిగితే అన్నే! సౌమ్యశ్రీ రాళ్లభండి
‘కావ్యేషు నాటకం రమ్యమ్, నాటకేషు శకుంతలమ్ – అందులో చతుర్ధాంకం అందులో శ్లోకచతుష్టయమ్’, అన్న పంథాలో కావ్యరమ్యత్వాన్ని వెతుకుతున్నారు. అలాగే సంస్కృతీ మహద్భాగ్యాలు వెతుక్కుంటూ పోతే, సందేహంలేని జవాబు త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు సౌభాగ్య నిధులు! అని త్యాగరాజ సంగీతజ్ఞులు ఒకానొక సందర్భంలో శ్రీ టి.వి. సుబ్బారావుగారు పేర్కోన్నారు. త్యాగరాజస్వామివారు రచించిన కీర్తనలన్నీ భక్తి ప్రపూరితాలైన రసగుళికలు; తెలుగు నుడికారంలోని సొంపుల, తీపి తమలో అంతటా నిండేటట్లు సంతరించుకుని భావార్ధ సుశోభితాలైన మధుగుళికలు! వందలకొద్దీ ఉన్న కీర్తనలలో దేనికదే ప్రత్యేక శోభతో రాణించే మణివలె వెలిగిపోయినా, పంచరత్న కీర్తనలని ప్రఖ్యాతి చెందిన ఐదుకీర్తనలు, ప్రత్యేక ప్రతిష్టతో, ఉత్తమోత్తమ స్థానార్హాలుగా ప్రసిద్ధికెక్కాయి. స్వరాలు బిగిలో, కూర్పులో, సంగీతపుటుదాత్తతలో వాటి మహత్త్వత బహుధా ఉగ్గడింపబడింది. కర్ణాటక సంగీత ప్పంచంలో హేమాహేమీలందరూ, త్యాగరాజస్వామి వారి ఆరాధనా క్రమంలో ఈ పంచరత్న కీర్తనలను, మేనులు మరచి, మనసులు లగ్నం చేసుకొని, ముక్త కంఠంతో భక్తిభావం వెల్లివిరిసేటట్లు గానం చేయ్యడమే సద్విధిగా ఎంచుకుంటారు! సంగీతపు విలువలలో ఈ కీర్తనల నాణ్యత సంగీతజ్ఞులకూ, తద్వారా శ్రోతలకు సుపరిచతమే. మిగిలిన కీర్తనలకన్న వీనిలో చరణాల సంఖ్య పెద్దది. ఒక్కొక్క పాటలో పల్లవి, అనుపల్లవిగాక ఎనిమిదిగాని పదిగాని చరణాలుంటాయి. ఒక్కొక్క చరణంలో కూడా సుదీర్ఘమైన కూర్పు; శబ్ధాల సంతరింపులోని విశిష్టత; భావప్రసారంలో నైపుణ్యం; మొదలైన నైజాలు కూడా శ్రోతలకూ, పాఠకులకూ చాలావరకు అవగతం అవుతాయి. ఇంకా విమర్శనా దృష్టితో పఠిస్తే, త్యాగరాజులవారు తన భక్తిబోధనామృతాన్నంతా యీ కీర్తనలలో ఇమిడ్చివైచినట్టు తెలుస్తుంది. అంతేకాదు, ఈ ఐదు రత్నాలనీ ఒక ప్రయోజన సూత్రంతో బంధించి రత్నాలమాలగా సంతరించి సంఘతించినట్లనిపిస్తుంది. వీటిల్లో ఒక క్రమం, ఒక పద్దతి, ఒక సంపుటీకరణం స్పష్టం అవుతుంది. నాట, వరాళి, గౌళ, ఆరభి, శ్రీరాగాలలో యీ కీర్తనలు నిబంధింపబడినాయి. ఈ ఐదింటినీ ఘనరాగాలంటారు. వాటి సర్వసాహిత్య ప్రక్రియ అత్యుత్తమ స్థాయినందుకోవడం వీటిని ఘనరాగాలంటారుట. (ఇరువదిరెండు శ్రుతుల కలయికకు ఆస్కారములు కావడం చేతనూ, వీణలో యీ రాగాలని గానంచేసేటప్పుడు తానవిస్తరణకి ఎంతో అవకాశం ఉండడంచేతనూ వీటిని ఘనరాగాలంటారు.) సంగీతకచేరీల్లో ఆది నాట, అంత్య సురటి అనే సంప్రదాయం కూడా చెప్పుకుంటాం! అటువంటి ఈ ఘనరాగ పంచకంలో త్యాగరాజస్వామి ఐదు సర్వోత్కృష్ట వాక్ర్పబంధాలనదగ్గ పంచరత్న కృతులని రచించారు. ఈ ఐదు పంచరత్న కీర్తనలు:
  • నాటరాగంలో: జగదానంద కారక
  • వరాళి రాగంలో: కనకన రుచిరా
  • గౌళ రాగంలో: దుడుకుగల నన్ను
  • ఆరభి రాగంలో: సాధించెనే, మనసా
  • శ్రీరాగంలో: ఎందరో మహానుభావులు
  వీనిలో మొదటి రెండు పాటలూ వర్ణనాత్మకాలు – సంబోధనాత్మకాలూను. త్యాగరాజస్వామి, ఆ శ్రీరామచంద్రుని అనేక విధాల వర్ణించి ప్రత్యక్షం చేసుకుంటారీ పాటల్లో! ‘జగదానంద కారక’ సంస్కృత సమాసాలతో నిండిపోయింది. పూర్వగాథలనీ, రామాయణంలో అనేక సన్నివేశాల్నీ స్ఫురింప చేసే బహువ్రీహి సమాసాలలో, ఆ జానకీ ప్రాణ నాయకుని జగదానందకారకునిగా ప్రత్యక్షం చేస్తుంది. రాజరాజేశ్వరునిగా, పురాణ పురుషునిగా, నిర్వికారునిగా, అగణిత గుణునిగా సృష్టి స్థిత్యంత కారకునిగా, ఆ దేవదేవుని నిరూపించి, త్యాగరాజస్వామి వారు తన్ను తరింపచేసుకున్నారు. పది చరణాల్లోనూ పదజాలం గుప్పించి, బహువిధాల వర్ణించి, కృతకృత్యులైనారు. చివర మూడు చరణాల్లోనూ శ్రీరామచంద్రుని, త్యాగరాజనుతుని ముమ్మారు స్మరించి (సాధారణంగా మకుటం ప్రతిపాటలో ఒకేసారి ఉంటుంది) తన్ను తాను పునీతుని చేసుకున్నారు. పదప్రయోగంలో త్యాగరాజస్వామివారికున్న ప్రతిభ ఈ కృతిలో బహుళంగా కన్పిస్తుంది. ‘కనకన రుచిరా’ అని మొదలుపెట్టే వరాళి రాగకృతిలో అలా నాటరాగ కృతిలో ప్రత్యక్షమైన దేవదేవుని త్యాగరాజస్వామి సానురాగంగా చూసిచూసి మురిసిపోతారు. ఆ పరమభక్తుడైన, ఆ వనజనయనుని మోము చూచుటే జీవనమని నెనరు గలవాడిని తానని ‘ననుపాలింప’ అనే మోహన రాగకీర్తనలో చెప్పుకున్నారు. అట్టి పరమభక్తుడీ కృతిలో, దినదినమును. చనువుతో, తన మనములో ఆ శ్రీరాముని చూచిన కొద్దీ రుచి హెచ్చుతుందనే సిద్ధాంతాన్ని, ప్రస్తావించారు; ప్రతిపాదించి స్థిరీకరించారు. తాను చూచే రాముడు కనకవసనుడు; పాలుగారు మోమున శ్రీ అపార మహిమతో తనరువాడు; మణిమయ మాలాలంకృతకంధరుడు; సురుచిర కిరీటధరుడు. కాని ఆ సిద్ధాంతానికి బలంగా తానిచ్చిన సాక్ష్యం ఒక్కటే చాలదనుకుంటారేమోనని, రామనామ రసికుడైన కైలాస సదనుడు (శివుడు), పవమాన సుతుడు (ఆంజనేయుడు), నారద, పరాశర, ళుక, శౌనక పురందరులను నగజను (పార్వతి), ధరజను (సీత) సాక్షులుగా పేర్కొంటారు. అటువంటి చూచినకొద్దీ రుచి హెచ్చే శ్రీహరిని ధ్యానించి, మనస్సులో చూసుకుంటూ మురిసిపోయే ధ్యానమనన సౌహార్ధ్రతా ప్రక్రియకి ఫలసిద్ధి, ధ్రువుడు అందుకొన్న సుగతినీ, సుస్థితినీ, సుసౌఖ్యాన్ని జ్ఞాపకం వలచి, సొక్కిన సీతాంజనేయులు సలిపిన సంవాదాన్ని, చర్చనీ పేర్కొని, తెలిసి, ఆ రాముని తాను గూడా అదేపనిగా చూచిచూచి తరించారు. ఈ కృతిలో తెలుగు పదాలే ఎక్కువగా ఉన్నాయి. రెండు చరణాల్లో సంస్కృత సమాసాలు బహుళమైనా మిగిలిన పాటలో సామాన్య పరిభాష అనిపించే తెలుగు పదాలే ఎక్కువగా ఉన్నాయి. (సేకరణ: యువభారతివారి త్యాగరాజస్వామి కవితా వైభవము నుంచి) తేటగీతి
మన తెలుగులో తొలి వాగ్గేయకారునిగా ప్రసిద్ధి చెందిన అన్నమయ్య నందవరవైదిక బ్రాహ్మణ వంశమున నేటి కడప జిల్లా రాజంపేట తాలుకాలోని తాళ్లపాక గ్రామమంలో వైశాఖశుద్ధ పౌర్ణమినాడు (మే 9, 1408) జన్మించాడు. అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు. భారద్వజ గోత్రుడైన అన్నమయ్య తండ్రి పేరు నారాయణసూరి మహాపండితుడు, తల్లి లక్కమాంబ, సంగీత కళానిధి. అన్నమయ్యకు అన్నమయ్యంగారు, అన్నమాచార్యులు, అన్నయగురు, అన్నయార్య, కోనేటి అన్నమయ్యంగారు అనే నామాంతరాలు తాళ్ళపాక సాహిత్యంలోను, శాసనాల్లోను కనిపిస్తాయి. అయితే, "అన్నం బ్రహ్మేతి వ్యజనాత్" అనే శ్రుతి ప్రకారం నారాయణసూరి పరబ్రహ్మ వాచకంగా తన పుత్రునకు అన్నమయ్య అని నామకరణం చేసినట్టు తెలుస్తోంది. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన ‘నందకం’ అంశతో అన్నమయ్య జన్మించాడని ప్రతీతి. కర్ణాటక సంగీత పితామహుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడు. తెలుగునాట పదకవితకు, భజన సాంప్రదాయానికి ఆద్యుడైన అన్నమయ్య దాదాపు 32వేల సంకీర్తనలు రచించాడు. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యంతోపాటుగా తెలుగు సంస్కృతికి ఆలవాలమైన తుమ్మెద, గొబ్బిపాటలు, ఉగ్గుపాటలు, సువ్విపాటలు, జోలపాటు మిళితమై ఉంటాయి. తిరుమల పయనం: తన ఎనిమిదవ ఏట గడ్డికోస్తుండగా దూరంగా గోవిందనామం చేస్తూ యాత్రికుల బృందం వెడుతూ కన్పించింది. వెంటనే ఎవరికీ చెప్పకుండా ఇల్లు విడిచి కాలినడకన తిరుపతికి బయలుదేరి వెళ్లాడు. చిన్నతనం వల్ల అజ్ఞానంతో పాదరక్షలతో కొండ ఎక్క ప్రయత్నించిన అన్నమయ్య కొండ ఎక్కలేక ఆకలితో అలసిసొలసి పడిపోయాడు. అంత అలివేలుమంగ అన్నమయ్య వద్దకు వచ్చి కర్తవ్యభోద చేసి స్వామివారి ప్రసాదాన్ని అందించింది. వెంటనే అన్నమయ్య అమ్మవారిని కీర్తిస్తూ, ఉ|| చొచ్చితి దల్లి నీ మఱుగు సొంపుగ నీ కరుణాకటాక్ష మె ట్లిచ్చెదొ నాకు నేడు పరమేశ్వరి యో యలవేలుమంగ నీ మచ్చిక నంచు నీ తరుణిమన్నన నే నినుగంటి నీకు నా బచ్చెనమాట లేమిటికి బ్రాతివి చూడగ వేంకటేశ్వరా! ఉ|| అమ్మకు దాళ్లపాకఘను డన్నడు పద్యశతంబు జెప్పె గో కొమ్మని వాక్ర్ఫసూనముల గూరిమితో నలవేలుమంగకు నెమ్మది నీవు చేకొని యనేక యుగంబులు బ్రహ్మకల్పముల్ సమ్మద మంది వర్ధిలుము జవ్వనలీలలు వేంకటేశ్వరా! అలివేలుమంగ శతకాన్ని ఆలపించాడు. పద్యాంతంలో వేంకటశ్వరా అని సంబోధించినప్పటికీ, ప్రతి పద్యము అలవేలుమంగను ప్రస్తుతించినదే. అమ్మకు అలమేల్మంగకు పద్యశతకము చెప్పానని తెలిపినందున ఇది అలవేల్మంగాంబికాస్తుతి శతకంగా భావిస్తారు. తిరుమల దర్శనం: కొండనెక్కిన అన్నమయ్య ‘దేవునికి దేనికిని తెప్పల కోనేటమ్మ, వేవేలు మొక్కులు లోకపావని నీ కమ్మా’ అంటూ, స్వామి పుష్కరిణిని దర్శించి అందు స్నానమాచరించాడు. అటుపై పెద్ద గోపురమును, నీడతిరుగనిచింతచెట్టును, గరుడగంభమును, చంపక ప్రదక్షిణమును, దివ్యప్రసాదములొసగు ప్రదేశములను, అక్కడి ప్రసాదములను, నడగోపురమున శ్రీనివాసుని భాష్యకారులను, నరసింహుని, జనార్ధనుని, అలమేలుమంగను, యాగశాలను, ఆనందనిలయమును, కళ్యాణమంటపమును, బంగారుగరుడుని, శేషుని, పునుగుచుట్టలను కాచి తైలము వడియగార్చు ప్రదేశమును, స్వామిని స్తుతించు చిలుకల పంజరములను, శ్రీ భాండారాములను, బంగారు గాదెలను, బంగారు వాకిటిని దర్శించి, స్తుతించి, ‘‘కంటి నఖిలాండకర్త నధికునిగంటి’’ అంటూ, ‘పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్య కోనేటిరాయడా‘ అని వేంకటేశ్వరుని దర్శించుకున్నాడు. తిరుమలగిరివాసుని దర్శించడానికి వెళ్లేముందు అన్నమయ్య పైన ఉదహరించిన స్థలాలను దర్శించాడనడానికి నిదర్శనమైన స్వామిదర్శన వర్ణన.... ‘‘ఆవరణంబుల కాదియై మిగుల గొమరారు వైకుంఠగోపురంబునకు బ్రమదంబుతో మున్ను ప్రణమిల్లి యంత జనుదెంచి గారుడ స్తంభంబు చక్కి వినుతుడై చెంత గ్రొవ్విరిసాల కేగి వలనోప్పు చంపకావరణంబు వేగ వలచుట్టి వచ్చి యా స్వామిపుష్కరిణి తోయంబు లాని యుత్తుంగభాగమున నా యహికులపతి యవతారమగుచు దిరుగని చింతలం దెఱలించు నీడ దిరుగని చింత కెంతే భక్తి మ్రొక్కి రమణ రెండవ గోపురము దాటి లోని కమల మహాసాగార సేవించి నెలకొని యానందనిలయాఖ్య మగుచు నలువొందు మణివిమానంబు సేవించి పటుమహామణిమంటపంబు సేవించి యట వచ్చి తురగతార్ క్ష్యాహినాయకుల సేవించి దనుజేరి సేనానాథు సేవించి నిత్యుల సేవించి కూర్మి నావేళ లోనికి నరుదెంచి యచటి....’’ ఇలా వేంకటేశ్వరుని దర్శించడానికి వెళ్లేదారిలో ఎదురయ్యే ప్రతీదానిని వర్ణిస్తూ మణిమయంబగు కిరీటంబు గలుగు శ్రీవేంకటగ్రావాధినాథుని దర్శించినట్టు చెప్పబడి ఉంది. ఈ సందర్భంలో అన్నమయ్య పాడిన సంకీర్తనలు ---- ‘సేవించి చేకొన్న వారి చేతిభాగ్యము, వేవేగ రారో రక్షించీ విష్ణుడీడను’ ‘నీవేకా చెప్పజూప నీవే నీవేకా, శ్రీవిభుప్రతినిధివి సేవమొదలారి’ ‘మొక్కరో మొక్కరో వాడె ముందర నిలుచున్నాడు, యెక్కువ రామునిబంటు యేకాంగవీరుడు’ ‘ఏ పొద్దు చూచిన దేవుడిట్లానే యారగించు, రూపులతో బదివేలు రుచురై నట్లుండెను’ ‘కంటిగంటి నిలువుచుక్కనిమేను దండలును, నంటుజూపులను జూచే నవ్వుమోముదేవుని’ అన్నమయ్యకు 16వ ఏట స్వామి ప్రత్యక్షమైనట్టు రాగిరేకులలో పొందుపర్చబడి ఉంది. స్వామి తనకు బాల్యంలో దర్శనమిచ్చినట్టు అన్నమయ్య ‘ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు, నప్పుడగు తిరువేంకటాద్రీశుగంటి’ అనే సంకీర్తనలో చెప్పుకున్నాడు. నాటినుండి రోజుకొక్క సంకీర్తనకు తక్కువ కాకుండా సంకీర్తనలు రచించాలని అన్నమయ్య వత్రంపూని చివరి వరకు కొనసాగించాడు. తిరుమలలో ఘనవిష్ణువు అనే ముని స్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞను తెలిపి శంఖ చక్రాదికములతో శ్రీవైష్ణవ సంప్రదాయానుసారముగా పంచ సంస్కారములను నిర్వహించాడు. గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకొంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ, వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడప సాగాడు. గృహస్థాశ్రమం: తిరుమలలో అన్నమయ్య ఉన్నాడని తెలుసుకొని అతని తల్లితండ్రులు వచ్చి అన్నమయ్యను స్వామి పూజకు లోటురాదని తమతో స్వగ్రామానికి రమ్మని కోరారు. అయితే అందుకు మొదట అంగీకరించనకసోయినా, గురువాజ్ఞ మేరకు స్వగ్రామం చేరుకుంటాడు. ఈ సందర్భంగా అన్నమయ్య ఆలపించిన సంకీర్తనలు అన్నమాచార్య చరిత్రలో చిన్నన్న పేర్కొన్నాడు. ‘సర్వోపాయముల జగతి నాకితడే, పుర్వీధరుడు పురుషోత్తముండితడే’ ‘పాడేము నేము పరమాత్మ నిన్నును, వేడుక ముప్పదిరెండువేళల రాగాలను’ ‘దాచుకో నీ పాదాలకు దగనే జేసిన పూజలివి, పూచి నీ కీరితి రూపపుష్పము లివియయ్యా’ ‘ఏలికవు నీవట యింకా దైన్యమేల, తాలిమి నీచేతలకు దగవు గాదనరా’. తదనతరం అన్నమయ్య తిరుమలమ్మ, అక్కలమ్మలను వివాహమాడాడు. అన్నమయ్య భార్య తిరుమలమ్మే తిమ్మక్క. ఈమె ‘సుభద్రా కళ్యాణా’న్ని రచించింది. తాళ్లపాకలో, తిరుమలమీద, అహోబిలమున, ఇంకా అనేక పుణ్యస్థలముల వర్తించుచు, గార్హస్థ్య మనుభవించుచు నవయవ్వనంలోనున్న అన్నమయ్య అనేక శృంగారసంకీర్తనలను ఈ కాలంలో రచించాడు. అన్నమయ్య ప్రథమ భార్యయగు తిరుమలమ్మకు నరసింగన్న, నరసయ్య, నరసింహాచార్యుడు అని పిలవబడిన గొప్పకవీశ్వరుడైన కొడుకుగలడు. ఇక అన్నమయ్య రెండవ భార్యయగు అక్కమ్మ కుమారుడు పెదతిరుమలయ్య. ఇతని కుమారుడే చినతిరువేంగళనాథ లేక చిన్నన్న. చిన్నన్న ‘అన్నమాచార్యచరిత్రము’ అను ద్విపదను రచించాడు. దీని ఆధారంగానే మనకు అన్నమయ్య జీవిత విశేషాలు తెలుస్తున్నాయి. అన్నమయ్య తన భార్యలతో కలిసి తీర్ధయాత్రలు చేశాడు. ఈ సందర్భంగా అనేక పుణ్య క్షేత్రాలు దర్శిస్తూ అహోబిలం చేరుకున్నాడు. అహోబల మఠ స్థాపనాచార్యుడైన ఆదివణ్ శఠకోపయతుల వద్ద అన్నమయ్య సకల వైష్ణవాగమాలను అధ్యయనం చేశాడు. అతని బోధనల ద్వారా పరబ్రహ్మస్వరూపమునర్చించే దివ్యయోగంలో కుల విచక్షణ వంటి అడ్డుగోడలను కూలగొట్టాలని అవగతం చేసుకొన్నాడు. తర్వాత కొద్దికాలం సాళ్వ నరసింగరాయలు (ఇతడు శ్రీ కృష్ణదేవరాయలుకు తాత) ఆస్థానం చేరుకున్నాడు. అయితే సాళ్వరాయునిపై సంకీర్తన చేయడానికి నిరాకరించటంతో రాజప్రాపకం కోల్పోయాడు. ఈ సందర్భంలోనే అన్నమయ్యను సంకెళ్లతో బంధించగా ‘సంకెల లిడువేళ జంపెడు వేళ, నంకిలి రుణదాత లాగెడువేళ’ అనే సంకీర్తన ఆలపించి సంకెల వదిలించుకున్నాడని ప్రతీతి. ఈ సందర్భంలోనే ‘ఆకటివేళల నలపైన వేళలను, వేకువ హరినామమే దిక్కు మఱిలేదు’, ‘నీ దాసుల భంగములు నీవు చూతురా’, ‘దాసవర్గముల కెల్ల దరిదాపు మీరె కాన’ వంటి సంకీర్తనలు అన్నమయ్య రచించాడు. రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు. వేంకటాచలానికి సమీపంలో ఉన్న "మరులుంకు" అనే అగ్రహారంలో నివసించాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు. ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు. అవసానకాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలచి, ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట. "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" అని బిరుదాంకితుడైన అన్నమయ్యకు 95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (ఫిబ్రవరి 23, 1503) పరమపదించాడు. రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తోంది. సౌమ్యశ్రీ రాళ్లభండి
మాయామాళవగౌళ రాగం 3వ అగ్నిచక్రంలో 3వ రాగం. ఫూర్వం దీనిని మాళవగౌళ రాగం అని పిలిచేవారు. కటపయాది సంఖ్య విధానానికి అనువయించడం కోసం ఈ రాగానికి మాయా అనే పదాన్ని చేర్చారు. ఈ రాగం స్వర స్థానాలు షడ్జమం, శుద్ధ రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం (స,రి,గ.మ,ప,ద,ని,స / S R1 G3 M1 P D1 N3 S). ఇది నిర్ధుష్ట రూపం కలిగిన సంపూర్ణ రాగం. అచల స్వరములు, కంపిత స్వరములు కల్గిన రాగం. శాంతి, భక్తి, కరుణ రసాలను పలికించడానికి ఈ రాగం ఉపయుక్తం. అన్నివేళలా పాడుకోవడానికి అనువైనది. ఈ రాగానికి హిందుస్థానీ సంగీతంలో సమానమైన రాగం భైరవ్. ఈ రాగంలో స్వరములు వరస క్రమంలో అనగా సరి, గమ, పద, నిస, కలిగి పూర్వాంగ, ఉత్తరాంగములకు సరియైనసంపూర్ణమైన జవాబు (symmetry) గలదు. అందువల్ల ఈ రాగంలో పాడడం సులభంగా ఉంటుంది. కర్ణాటక పితామహుడు పురుందరదాసు ఈ రాగంలో సరళీవరుసలు, జంట వరుసలు, అలంకారాలను రచించటంతోపాటు, ఈ రాగం జన్య రాగమైన మలహరిలో పిళ్ళారి గీతాలను రచించి తమ శిష్యులకు శిక్షణనిచ్చి బహుళ ప్రచారం చేశారు. ఈ రాగానికి సంవాదాలు, జన్యరాగాలు ఎక్కువ. ఇది మూర్ఛన కారక మేళం. అందవల్ల గ్రహ భేదానికి అనువైనది. మాయామాళవగౌళ రాగంలో రిషభాన్ని గ్రహంచేస్తే 72వ మేళకర్త రసికప్రియ, మధ్యమం గ్రహంచేస్తే 57వ మేళకర్త సింహేంద్రమధ్యమం వస్తాయి. ఈ రాగం నుంచి వెలువడ్డ జన్యరాగాలు అనేకం. అందులో ప్రసిద్ధి చెందింది సావేరి. ఇతర జన్య రాగాలు: రాగ ప్రవాహం దాదాపు 223 జన్య రాగాలు మాయామాళవగౌళ రాగానికి ఉన్నట్టు తెలుపుతోంది. అయితే వీటిలో కేవలం 41 మాత్రమే పూర్తి రాగాలుగా అభివృద్ధి చెంది ప్రచారంలో ఉన్నాయి. ఉదాహరణకు, గౌళ, భౌళి, మలహరి, సారంగనాట, నాదనామక్రియ, మేచభౌళి, గుమ్మకాంభోజి, లలిత పంచమం, మారువ, శుద్ధ క్రియ, మేఘరంజి, పాడి, గౌళిపంతు, ఘనసింధు, మూర్జరి, గుండక్రియ, సౌరాష్ట్రము, కమలామనోహరి, జగన్మోహిని, రేగుప్తి, మంగళకైశిక, సాళంగనాట, పూర్ణపంచమం, సురసింధు, దేశ్యగౌళ, సింధురామక్రియ, ఆర్ధ్రదేశిక, ఫరజు మరియు గౌరి. ఈ రాగమందు పేరెన్నికగన్న రచనలు: 1. మాయాతీత స్వరూపిణీ –– తంజావూరు పొన్నయ్య 2. మేరు సమాన ధీర, విదులకు మ్రొక్కెద, తులసీ దళములచే, ముదమున శంకరకృత –– త్యాగరాజు 3. శ్రీనాథ గురుగుహోజయతి –– ముత్తుస్వామి దీక్షితార్ (ఇది ముత్తుస్వామి మొదటి కృతి) 4. నీలాయతాక్షీ నీవే జగత్సాక్షి –– శ్యామశాస్త్రి 5. లక్షణగీతం, రవికోటితేజ –– వెంకటమఖి 6. సరసిజనాభా మురారే (వర్ణం), దేవ దేవ కళాయామి –– స్వాతి తిరునాళ్ 7. దేవాదిదేవ నను –– మైసూర్ సదాశివం సినిమా సంగీతంలో కూడా ఈ రాగంలో అనేక ప్రయోగాలు, పాటలున్నాయి. ఉదాహరణకు రుద్రవీణ సినిమాలో కెవి మహదేవన్ ఏసుదాసు చేత త్యాగరాజు రచన తులసీ దళములచే సంతోషముగా పూజింతు పాడించారు. ఇక కీలుగుర్రంలో ఎవరు చేసిన కర్మవారనుభవింపక ఎవరికైనను తప్పదన్నా, లవకుశలో ఏనిమిషానికి ఏమిజరుగునో, బాలరాజులో గూటిలో చిలకేదిరా, ఓరన్న గూడు చినబోయెరా, సిరిసిరిమువ్వలో ఎవరికెవరు ఈ లోకంలో, చంటి సినిమాలో పావురానికి పంజరానికి పెళ్ళిచేసేలోకం, లైలా మజ్నులో రావో, ననుమరిచితివో, ఆలాపనలో కలిసే ప్రతి, చెట్టు కింద ప్లీడర్ లో జిగి, జిగి, జగదేకవీరుడు అతిలోక సుందరిలో యమహా నీ యమ ఇలా అనేక పాటలను సంగీత దర్శకులు స్వరపరిచారు. హిందీ సినిమాల్లో కూడా ఈ రాగం సమానమైన భైరవ్ రాగాన్ని విరివిగా ఉపయోగించారు. రంగీలాలోని హైరామా యే క్యా హువా, జాగతే రహోలో జాగో మోహన్ ప్యారే జాగో, ఏక్ దూజే కేలియేలో సోలా బర్సకీ బాలీ ఉమర్ కో సలాం, రాం తేరీ గంగా మైలీ లో టైటిల్ పాట రాం తేరీ గంగా మైలీ హోగయీ, హమ్ దిల్ దేచుకే సనం లో అల్ బేలా సాజన్ ఆయోరే, బిజు బావరాలో మెహే భూల్ గయే సావరియా మరియు ఆష్కీలో అబ్ తేరే బినా జీ లేంగే హమ్ ఇలా అనేకం. సౌమ్యశ్రీ రాళ్లభండి
రాగ స్వరశ్చ, తాళశ్చ త్రిభిస్సంగీత ముచ్చతే .... రాగం, తాళం, స్వరం కలిస్తే సంగీతమవుతుంది. వీటిలో ప్రతీ దానికి ఒక విశిష్టత ఉంది. అలాగే ప్రతీదీ మరో దానిపై ఆధారపడి ఉంటాయి. మనకు గల షోడశ స్వరస్థానాల సమ్మేళనమే రాగం. కొన్ని పాటలు వినగానే ఎక్కడో విన్నట్టుగా ఉందని అన్పిస్తుంది. అందుకు కారణం ఆయా పాటలన్నీ ఒకే రాగంలో ఉండటం కావచ్చు. ఏ భాషలో నైనా సరే మనం ఇట్టే ఆ పాటని గుర్తుపట్టేస్తాం. కొన్ని గీతాల వల్ల కొన్ని రాగాలకు విశిష్టత చేకూరుతుంది. కొందరు వాగ్గేయకారుల రచనలు రాగాలకు పేరు తెచ్చి పట్టాయి. ఇలా ప్రజారంజకం పొందిన పాటలను, రాగాలను వాటి లక్షణాలను మా ఈ ‘రాగగీతిక’ శీర్షకలో పాఠకులకు అందిస్తున్నాం. కర్ణాటక సంగీతంలో ఉన్న రాగాలను వాటికి సమాంతరమైన హిందుస్తానీ రాగాలను వాటిలో వాగ్గేయకారులు చేసిన అద్భుత రచనలతో పాటు, బహుళ ప్రాచుర్యం పొందిన చలనచిత్రాల గీతాలను కూడా పొందుపర్చటానికి ప్రయత్నిస్తాం. ఈ ప్రయత్నంలో మా వల్ల ఏమైనా పొరపాట్లు జరిగితే సహృదయంతో అర్ధంచేసుకొని క్షమించగలరని ఆశిస్తున్నాం. ముందుగా రాగం అంటే ఏమిటి? వాటి లక్షణాలు, రాగ వర్గీకరణ మొదలైన అంశాలను పరిశీలిద్దాం. రాగం అంటే ఏమిటి? శ్లో: యోయంధ్వని విశేషస్తు స్వరవర్ణ విభూషితః | రంజకోజన చిత్తానాం సరాగః కధితోబుధైః|| రాగమనగా, స్వరవర్ణములచే అలంకరింబడి, జనుల చిత్తమును ఆనందింపచేయునట్టి ధ్వని. రాగము మన భారతీయ సంగీతంలో తప్ప మరే సంగీతంలోనూ లేదు. పాశ్చ్యాత సంగీతకారులకు రాగము అను పేరు తెలియదు. రాగము స్థాయి, ఆరోహి, అవరోహి, సంచారి అని నాలుగు విధాలు. ఒక్కోక్క స్వరాన్ని నిలిపి ఉంచడాన్ని స్థాయని, స్వరాలు హెచ్చు క్రమాన్ని ఆరోహణ, అలాగే తగ్గుక్రమాన్ని అవరోహణ అంటారు. ఇక ఈ మూడింటి కలయికే సంచారి. రాగములు ముఖ్యంగా మూడు రకాలు. షాడవము, ఔడవము, సంపూర్ణము. అందు ఔడవము ఐదు స్వరములను, షాడవము ఆరు స్వరములను, సంపూర్ణము సప్త స్వరములను కలిగి ఉంటాయి. ప్రతీ పాటకీ స్వరమున్నట్టే, స్వరస్థానాలను బట్టి రాగాలుంటాయి. కనీసం ఐదు స్వరాలైనా లేకపోతే అది రాగం కాదని ప్రాచీన సంగీతకారుల అభిప్రాయం. ఈ స్వరాల ఆరోహణ, అవరోహణల నుబట్టి రాగాలను రెండు రకాలుగా విభజించారు. జనక రాగాలు, జన్య రాగాలు. మేళకర్త రాగాలు: జనక రాగాలనే ‘మేళకర్త ‘రాగాలని కూడా అంటారు. వీటికే మాతృక (parental), ఆధార (fundamental), మూల (root), ప్రాతిపదిక (primary) రాగములని కూడా పేర్లు. మేళకర్త రాగాలకి ముఖ్యంగా రెండు లక్షణాలుండాలి. మొదటిది ఈ రాగ ఆరోహణ, అవరోహణలలో సప్తస్వరాలుండాలి. అంటే అది సంపూర్ణరాగమైయుండాలి. ఇక రెండవ ముఖ్య లక్షణం, ఆరోహణ, అవరోహణలో సప్తస్వరాలు వరుసక్రమంలో ఉండాలి. జనక రాగాల మరో లక్షణం ఆరోహణావరోహణము లందు ఒకే జాతి స్వరములుండుట. అలాంటి మేళకర్తరాగాలు 72 ఉన్నాయి. ఈ 72 మేళకర్త రాగాల్లో, ఆరేసి రాగాలను కలిపి ‘చక్రం’ అంటారు. అలా ఒక్కొక్కదానిలో ఆరేసి రాగాల చోప్పున మొత్తం 12 చక్రాలు ఏర్పడ్డాయి. ఈ 12 చక్రాల పట్టిక:
చక్రం మేళకర్త రాగాల సంఖ్య
ఇందు 1వ మేళకర్త నుంచి 6వ మేళకర్త వరకు
నేత్ర 7వ మేళకర్త నుంచి 12వ మేళకర్త వరకు
అగ్ని 13వ మేళకర్త నుంచి 18వ మేళకర్త వరకు
వేద 19వ మేళకర్త నుంచి 24వ మేళకర్త వరకు
బాణ 25వ మేళకర్త నుంచి 30వ మేళకర్త వరకు
ఋతు 31వ మేళకర్త నుంచి 36వ మేళకర్త వరకు
ఋషి 37వ మేళకర్త నుంచి 42వ మేళకర్త వరకు
వసు 43వ మేళకర్త నుంచి 48వ మేళకర్త వరకు
బ్రహ్మ 49వ మేళకర్త నుంచి 54వ మేళకర్త వరకు
దిశి 55వ మేళకర్త నుంచి 60వ మేళకర్త వరకు
రుద్ర 61వ మేళకర్త నుంచి 66వ మేళకర్త వరకు
ఆదిత్య 67వ మేళకర్త నుంచి 72వ మేళకర్త వరకు
  1 నుంచి 36 వరకు వచ్చే అన్ని మేళకర్త రాగాలలోనూ శుద్ధమధ్యమం ఉంటుంది. అదే 37 నుంచి 72 వరకు గల రాగాలలో ప్రతి మధ్యమం ఉంటుంది. ఈ లక్షణ ఆధారంగా జనక రాగాలను శుద్ధమధ్యమ రాగాలు లేక పూర్వమేళములు, ఉత్తర మేళములు లేక ప్రతి మధ్యమ రాగాలని రెండు రకాలుగా విభజించారు. జన్యరాగాలు: ఇక ఈ మేళకర్త రాగాల్లోని స్వరాలలో మార్పులు చేయగా అనేక రాగాలు పుట్టకొచ్చాయి. వీటిని జన్యరాగాలంటారు. ఉదాహరణకు ‘మాయామాళవగౌళ రాగం ‘15వ మేళకర్త రాగం. ఈ రాగంలోని ఆరోహణలో గాంధారాన్ని (గస్వరాన్ని), నిషాదాన్ని (ని స్వరాన్ని), అవరోహణలో నిషాదాన్ని వదిలేస్తే, ఒక కొత్త రాగం పుడుతుంది. అదే ‘మలహరి రాగం’. ఈ విధంగా మేళకర్త రాగాల్లోన్ని కొన్ని రాగాలను వదిలివేయడాన్ని వర్జించడమని అంటారు. ఇలా స్వరాలను వర్జించడం వల్ల పుట్టిన జన్యరాగాలను వర్జ్య రాగాలని అంటారు. ఈ వర్జరాగాల్లో ఉన్న స్వరాల సంఖ్యని బట్టి షాడవ సంపూర్ణరాగం, సంపూర్ణ షాడవ రాగం, ఔడవ సంపూర్ణరాగం, సంపూర్ణ ఔడవ రాగం, షాడవ షాడవ, షాడవ ఔడవ లేక ఔడవ షాడవ ఇలా అనేక రకాలు వర్జ్యరాగాల్లో ఉన్నాయి. అలాగే మేళకర్తరాగంలోని స్వరాలను వక్రగతి పట్టిస్తే, అంటే స్వర క్రమాలన్ని మారిస్తే కూడా కొత్త రాగాలు పుడతాయి. అలా పుట్టిన రాగాలను వక్ర రాగాలంటారు. ఉదాహభరణకు 28వ మేళకర్త రాగం హరికాంభోజి. ఇందులో ఆరోహణ: సరిచగఅంమశుపదచనికైనిస, అవరోహణ: సనీదపమగరిస. ఈ రాగాలను ఆరో: సరిగమపమదానిస, అవ: సనీదపమగమరీగరి అని వక్రం చేయగా పుట్టిన రాగాన్ని‘శహన ‘ అంటారు. వర్జ్య రాగాల్లో ఉన్నట్టే, వక్రరాగాల్లో కూడా స్వరాల వక్రగతిని బట్టి అంటే ఆరోహణలో స్వరాలు వక్రగతిలో ఉన్నాయా లేక అవరోహణలోనా అన్నదాని బట్టి అనేక రాగాలున్నాయి. ఆరోహణ, అవరోహణలో స్వరాలు వక్రగతిలో ఉంటే వాటిని ఉభయ వక్రరాగాలంటారు. ఉపాంగ రాగాలు, భాషాంగ రాగాలు: సాధారణంగా మేళకర్త రాగ స్వరస్థానాలే, జన్యరాగంలో కూడా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఈ రాగ లక్షణానికి విరుద్ధంగా రాగాలుంటాయి. ఉదాహరణకు బిలహరి రాగం ధీరశంకరాభరణమనే మేళకర్త రాగం నుంచి పుట్టుంది. అయితే మేళకర్త రాగ స్వరాలకు విరుద్ధంగా అన్యస్వరమైన కైశికి నిషాదం వస్తుంది. ఇలా అన్య స్వరరాగాలు కనుక జన్యరాగంలో వస్తే ఆ రాగాలను భాషాంగ రాగాలంటారు. కాంభోజి, ఖమాస్, భైరవి, ముఖారి, ఆనందభైరవి మొదలైన రాగాలన్ని భాషాంగరాగాలే. అన్యస్వరం రాకుండా, కేవలం జన్యరాగ స్వరస్థానాలే వస్తే అలాంటి రాగాలను ఉపాంగరాగాలంటారు. ఇలాంటి రాగాలే ఎక్కువ. ఉదాహరణకు మోహన, హిందోళ, హంసధ్వని, శుద్ధ సావేరి, ఆరభి, దర్పారు మొదలైనవి ఉపాంగరాగాలు. నిషాదాంత్య, దైవతాంత్య , పంచమాత్య రాగాలు: కర్ణాటక సంగీతంలో కొన్ని రాగాలు నిషాదముతో ముగుస్తాయి. అంటే ఈ రాగాల యొక్క సంచారము కేవలం మంద్రస్థాయి నిషాదము నుండి మధ్యస్థాయి నిషాదము వరకే. నిషాదముతో అంతమవునుగనుక వీటినకి “నిషాదాంత్యములని” పేరు. ఉదాహరణ నాదనామక్రియ. అదే విధంగా దైవతముతో అంతమయ్యే రాగాలను “దైవతాంత్యము”లంటారు. ఉదాహరణ కురంజి. ఇక రాగములు మధ్యస్థాయి పంచమముతో అంత్యమయిన వాటిని “పంచమాంత్య” రాగాలంటారు. ఉదాహరణ నవరోజు.   ఎన్ని రాగాలున్నాయి? ఒక జనకరాగం నుంచి పైన చెప్పిన లక్షణాలను పాటిస్తూ దాదాపుగా 483 జన్య రాగాలు పుట్టవచ్చు. ఇలా 72 మేళకర్తల నుంచి 34, 847 వర్జ్యరాగాలు పుట్టే అవకాశం ఉంది. ఇక వక్రరాగాలు, భాషాంగరాగాలు లెక్కించుకుంటూ పోతే వాటికి అంతే ఉండదేమో! అందుకే రాగాలు అనంతాలంటారు. రాగం అంటే కేవలం ఆరోహణ, అవరోహణలు కాదు. అవి కేవలం ఆధారం మాత్రమే. రాగంలో ఉపయోగించవల్సిన గమకాలు, ఒక రాగంలో తరచూ ఉపయోగించవల్సిన స్వరాలు ఇలా వివిధ లక్షణాలను రాగాలకు ఆపాదించినప్పుడే రాగానికి ఒక స్వరూపం ఏర్పడి అది ప్రజాదరణ పొందుతుంది. ఇది క్లుప్తంగా రాగం గురించిన విషయాలు. ఇక మీదట ఒక్కొక్క రాగాన్ని తీసుకుని దాని లక్షణాలు వాటిలో ప్రముఖ వాగ్గేయకారులు స్వరపర్చిన కీర్తనలు, ప్రజాదరణ పొందిన సినీ గీతాలను విశ్లేషిద్దాం. రాగ గీతిక రెండవ భాగంలో ఆది రాగమైన మాయామాళవగౌళ రాగం గురించి తెలుసుకుందాం. సౌమ్యశ్రీ రాళ్లభండి