సంగీతం

సంగీతం

అంతారామమయం ఈ జగమంతా రామమయం అంటూ అవతారమూర్తులైన సీతారాములపై ఆత్మీయ భావాన్ని తెలుగువారికి కలిగించటంలో రామదాసు కీర్తనలు, ఆయన రచించిన దాశరథీ శతకంతోపాటు ఉన్నత పాత్ర వహించాయి అనడంలో సందేహంలేదు. చిక్కని పాలపై మిసిమి చెందిన మీగడ పంచదారతో మెక్కిన భంగి, శ్రీ రాముని విమల రూప సుధా రసమును రామదాసుతోపాటు తెలుగు పలక నేర్చిన, విన నేర్చిన భక్తులందరు ఆస్వాదించి తరించారు. ‘గీతం వాద్యం తథా నృత్యం త్రయం సంగీత ముచ్చతే’. సంగీతమంటే గీత, వాద్య, నృత్యాల మేటి సమ్మేళనమని సంగీత రత్నాకరమందు చెప్పబడింది. అయితే కాలక్రమేణా గీత, వాద్యముల కలయిక సంగీతంగా రూపాంతరం చెందిది. నేడు కేవలం గానమే సంగీతమని వ్యవహారిస్తున్నారు. అయితే శృతి, లయ, స్వరములతో కూడిన సంగీతము రెండు విధాలు ఒకటి గాత్ర గానము రెండు వాద్యగానము. ప్రాచీన సంగీత సాంప్రదాయాలకు అద్దంపట్టే విధంగా గాత్ర, వాద్య గానాలను పెర్త్ మహానగరంలోని తెలుగువారికి అందించాలని మా ‘తేటగీతి’ సంకల్పించింది. ఆ సంకల్పనకు రూపకల్పనే ‘భక్తరామదాసు వాగామృతవర్షిణి’. రామదాసు కృతులలోని నవరత్న కీర్తనలకు దీటైన దాశరథీ శతకంలోని పద్యాలను ఎన్నుకొని, సమన్వయించి కీర్తనలతోపాటు శతక సౌరభాన్ని మార్చి 1, 2014న తేటగీతి తెలుగు సంగీతాభిమానులకు అందించింది ఈ కార్యక్రమానికి పెర్త్ లో దౌత్యకార్యాలయానికి కాన్సుల్ జనరల్ గా వ్యవహరిస్తున్న శ్రీ సుబ్బారాయుడుగారు ముఖ్యఅతిధిగా విచ్చేస్తారు. వారి సతీమణి శ్రీమతి హేమగారు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సుబ్బారాయుడుగారు మాట్లాడుతూ, ‘తాను ఎన్నో దేశాల సందర్శించినప్పట్టికీ, పెర్త్ లో తెలుగువారు భాషపట్ల చూపుతున్న అభిమానం, జరుపుతున్న కార్యక్రమాలు మరెక్కడా చూడలేదన్నారు.’ ప్రత్యేకంగా తేటగీతి ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ, ఇటువంటి సంగీత కార్యక్రమాలు భావితరాలవారికి మన భాష పట్ల, సాహతీ, సంస్కృతుల పట్ల అవగాహన కల్పిస్తాయన్నారు సంగీతాభిమానలను రజింపచేసిన ఈ కార్యక్రమం తేటగీతి వెబ్ సైట్ పాఠకులకు కూడా శ్రవణానందం కల్గిస్తుందని ఆశిస్తూ, పూర్తి కార్యక్రమం ఆడియో మీకోసం.. భక్తరామదాసు వాగామృతవర్షిణి-1 భక్తరామదాసు వాగామృతవర్షిణి-2 తేటగీతి, మార్చి 13, 2014
ఒకనాడు హనుమ శ్రీ రాముని పాదాల చెంత చేరి, నారద,తుంబురులను తమ గానాన్ని విన్పించమని కోరాడు. ఇద్దరు వీణెలు సారించారు. గమక యుక్తంగా అలంకారాలు, గీతాలు మధురంగా పలికించారు. స్వర సందర్భం, శ్రుతులు, ఆలాపన, గమకాలూ గీత సరణి, ముక్తాయింపు భలేగా, అమోఘంగా వున్నాయని హనుమ మెచ్చుకున్నాడు. ఇంతటి ఉద్దండ పండితుల గానంలో లోటుపాట్లను విమర్శించటం తనకు సాధ్యం కాదేమో అని సవినయంగా విన్నవించుకున్నాడు. తాను నేర్చిన కొన్ని గీతాలను సీతా రాములకు వినిపిస్తానని, వారిద్దరిని కూడా వినమని హనుమ ప్రార్ధించాడు. తమ గానాన్ని అంతగా మెచ్చిన హనుమ తన గానాన్ని వినమనటంలో అర్ధమేమిటో నారద, తుంబురలకు అర్ధం కాలేదు. ”కోతులు సంగీత సభ చేస్తే కొండముచ్చు అగ్రాసనం మీద కూర్చున్నట్లు ఉంటుంది హనుమ గానమని”, ఎగతాళి చేశారు. అంత గొప్ప సంగీతాన్ని తాము వినిపిస్తే, ఇంకా హనుమకు ఏం మిగిలింది విని పించాటానికి అని విసుక్కున్నారు. తమ గానం ముందు ఇంకెవరి గానమైనా బలాదూరే అని వారి గర్వం. రామ సన్నిధానంలో ఏమీ చేయడానికి పాలుపోక తమ,తమ వీణలను హనుమకు అందించారు. నారదుని వీణను తీసుకొని హనుమ ఓంకారం పలికించాడు. ఓంకారం త్రిగునాత్మకము, త్రి మూర్త్యాత్మకము దీనినే ప్రణవం అంటారు. ఇందులో అ, ఉ, మ ఉన్నాయి. ఆకారం రజో గుణాత్మకం -బ్రహ్మ. ఉ కారం సత్వ గుణాత్మకం -విష్ణువు. మ కారం తమో గుణాత్మకం -రుద్రుడు. అ కారం ఎడమ నాసిక పుట -ఇడ. ఉ కారం కుడి నాసా పుట. పింగళ. మ కారం వాటి మధ్య లో వున్న సుషుమ్న. ఈ విధం గా ఓంకారం మూడు నాడుల సమాహారం. ఇడా నాడి-చంద్రుడు. పింగళ నాడి -సూర్యుడు . సుషుమ్న నాడియే అగ్ని. ఈ విధం గా ఓంకారం త్రయాగ్న మైంది. ఓంకారంలో దశ విధ నాదాలు జన్మించాయి. నాభి, ఉదర, కంత, స్ధానాలు వాటి ఉత్పత్తి స్థానాలు. ఆ నాదాలే వాయు చలనం వల్ల హృదయ, కంత, శిరః స్ధానాల నుండి అభి వ్యక్తమై, మందార, మధ్యమ, తారకం అనే మూడు స్వర భేదాలను పొందాయి. ఆ స్వరాల నుండి ” స,రి ,గ ,మ ,ప ,ద ,ని ” అనే సప్త స్వరాలు క్రమంగా శివుని యొక్క ”పరమశివ, ఈశ్వర, సద్యోజాత, వామ దేవ, అఘోర, తత్పురుష, ఈశాన” అనే ఏడు ముఖాల నుండి పుట్టి, ”షడ్జ, రిషభ, గాంధార, మధ్యమ, పంచమ, దైవత, నిషాద ”అన బడే పేర్లతో వ్యాప్తి చెందాయి. వాటి జన్మ స్థానాలు క్రమంగా కంత, శిర, నాస, హృదయ, ముఖ, నాలుక, పూర్వాంగాలు. మయూర,రిషభ, అజ, సింహ,కోకిల, అశ్వ, మదగజ ధ్వనులే షడ్జం మొదలైన స్వర ధ్వని భేదాలు. షడ్జ స్వరం నుంచి నాలుగు శ్రుతులు, రిషభం నుంచి మూడు, గాంధారం నుండి రెండు, మధ్యమ నుంచి నాలుగు, పంచమం నుండి నాలుగు దైవతం నుంచి మూడు, నిషాదం నుంచి రెండు - సప్త స్వరాలనుండి ఇరవై రెండు శృతి భేదాలు ఏర్పడ్డాయి. ఈ శ్రుతులకు ఇరవై రెండు శృతి గమకాలూ, ఏడు దేశీ గమకాలున్నాయి. ఈ స్వర శృతి గమకాలలో ఆరు లక్షణాలు గల గీతాలు, ఆ రాగాలకు గ్రామ త్రయం, దాని వల్ల పదిహేను రాగాలు -వాటికి ఆరు జాతులు, వాటికి ముప్ఫై ఆరు రాగాలు, - వాటికి నాలుగు అంగాలు, వాటికి నూటఆరు రాగాలు పుట్టి అనంత కోటి రాగాలుగా విస్త రించింది. ఇన్నిటిలో ముప్ఫై రెండు రాగాలు మాత్రమే లోకంలో ప్రసిద్ధ మైనవి. వాద్యాలలో తథా, ఆనద్ధ, సుషిర, ఘన అనే నాలుగు వున్నాయి. కాహల, పటహ, శంఖ, భేరి జయ, ఘంటికలు అనేవి అయిదు మహా వాద్యాలు. వీణా మొదలైనవి ఇరవై రెండు రకాలు. త కారం రుద్రుడు. ల కారం పార్వతి. ఆ రెండిటి సంపుటినే తాళం అంటారు. తాళానికి కాల, మార్గ, క్రియ, అంగ, జాతి, గ్రహ కళ, లయ, యతి, ప్రస్తారం అనేవి పది ప్రాణాలు. హనుమ భరత శాస్త్రంలో కూడా నిష్ణాతుడు. ప్రవర్త కుడు, దర్శన కారుడు కూడా. భ అంటే భావం. ర అంటే రాగం. త అంటే తాళం. భావ ,రాగ ,తాళాలు అంటే సాహిత్య, సంగీత, నాట్యాల ఉపయోగం ఇందులో వుంది కనుక ”భరతం” అని పేరు వచ్చింది. రసాలు, భావాలు, అభినయాలు, ధర్ములు, వృత్తులు, ప్రవృత్తులు, సిద్ధులు, స్వరాలు, ఆతోద్యమములు, గానాలు, రంగాలు అనే పద కొండు విషయాల స్వరూపమే ”నాట్య వేదం ”. అలాంటినాట్య వేదానికి ప్రవర్తకుడు హనుమయే. గాన్ధర్వాన్ని సూర్యుని నుంచి హనుమ నేర్చుకొన్నాడు. శ్రీ రాముని కొలువులో తన గాంధర్వ విద్యను మనో ధర్మంగా అమోఘంగా ప్రదర్శించాడు హనుమ. ఆ గానానికి హృదయాలు పద్మాల్లా వికశించాయి. చంద్ర కాంత శిలలు కరిగాయి. మ్రోడులు చిగిర్చాయి. లోకం సమ్మెహ మైంది. అతని వల్లకీ (వీణ) వాద్యానికి రాళ్ళే కరిగి పోయాయి. సభాసదులు పరవశించి పోయారు. బొమ్మల్లా అచేతను లైనారు. వీణ పై హనుమ” మేఘ రంజని ”రాగాన్ని సమ్మోహనం గా విని పించాడు. అతను ప్రదర్శించిన మెళకువలు, ప్రౌఢిమ, రాగాలాపన, గ్రామ స్ఫూర్తి, తారలో అంతర స్ఫురిత నాద ప్రౌఢి, మీటు, కంపితం, ఆన్దోలితం, మూర్చన, శ్రుతులు, డాలు, అనేక మైన తాళ మానాలు విని జనం మైమరచి పోయారు. ఆకాశం మేఘాలతో నిండి పోయింది. కొంగలు బారులు తీరాయి. చాతక పక్షులు నోళ్ళు తెరిచి ఆకాశం వైపు చూశాయి. నీటి చుక్క కోసం నెమళ్లు పురి విప్పి నాట్యం చేశాయి. పాతాళం లోని పాములు పడగ లెత్తి నర్తించాయి. వర్షం పుష్ప వర్షంగా కురిసింది. సభ్యుల దివ్య ఆభరణాలన్నీ కరిగి పోయాయి. శశి కాంత వేదికలు కరిగి శ్రవించాయి. దంతపు బొమ్మలకు ప్రాణాలు వచ్చాయి. హనుమ గానం చేస్తున్నంత సేపు శ్రీ రాముడు మెచ్చికోలుగా ”ఓహ్, ఔరా, భళా, మజ్జ్హారే, బాపురే ”అని అభినందిస్తూనే వున్నాడు. హనుమ వీణా నాదానికి దగ్గర లో వున్న పెద్ద రాయి కరిగి పోయింది. సభలోని వారంతా ఆశ్చర్యంతో ముక్కున వేలు వేసుకున్నారు. నారద ,తుంబురుల తాళపు చిప్పలు తీసుకొని హనుమ ”గుండా క్రియ ”రాగాన్నివీణా పై పలికించాడు. మళ్ళీ ఆ రాయి కఠిన శిలగా మారి పోయింది. తన చేతి లోని వీణను నారదునికి ఇచ్చి ఆ రాయిని మళ్ళీ కరిగించ గలవాడే విద్యా ధికుడని, ఈ తాళాలను తీసుకోవాటానికి అర్హుడు అని చెప్పాడు. నారద, తుంబురులిద్దరు విశ్వ ప్రయత్నం చేశారు. రాయి కరగ లేదు. వీణలను నెలపై పెట్టి తలలు వంచుకొని అహంకారం పోగొట్టుకొని సిగ్గుతో నిలబడ్డారు. ”మీలో ఎవరో ఒకరు రాయిని కరిగించక పొతే ఎవరు అధికులో నిర్ణయించ లేము కదా. తాళాలు కూడా నా దగ్గరే విడిచి పెట్టాల్సి వస్తుంది మీరు. అది వాగ్గేయకారులైన మీకు ఆవమానం కదా”, అన్నాడు హనుమ. పాపం వారిద్దరూ మరింత సిగ్గుపడి ”గాయక సార్వభౌమా! హనుమా! మా గర్వం అణగి పోయింది. మేము మా చేష్టలకు సిగ్గు పడుతున్నాము. మీ ముందు మా గానం ఎంత. పద్నాలుగు లోకాల్లో మీ వంటి గాయకుడు లేడు. కఠిన శిలను కరిగించే నేర్పు ఎక్కడా మేము చూడ లేదు. మా తాళాలు మాకు ఇప్పించి మమ్మల్ల్ని కనికరించండ”, ని పశ్చాత్తాపం తో హనుమను వేడుకున్నారు నారద, తుంబురులు. దయామయుడైన హనుమ వారిద్దరిని శ్రీ రాముని అనుగ్రహంతో క్షమించి, వారివీణలు, తాళాలు తిరిగి ఇచ్చి వేశాడు. హనుమ కీర్తి గానం చేసుకొంటు, వాళ్ళిద్దరూ శలవు తీసుకొని వెళ్లి పోయారు. హనుమ సీతా రాముల వద్ద సెలవు తీసుకొని గంధ మాదనం చేరాడు.
తెలుగు సాహిత్యమందు విశేష ప్రజ్ఞగల ముత్తుస్వామి దీక్షితార్ తెలుగు కావ్యశిల్పాననుసరించి కృతులను రచించినట్టుగా మనకు గోచరిస్తుంది. అనగా విభక్తిపరంగా కృతులను రచించుట. ముత్తుస్వామి దీక్షితులు శైవ, వైష్ణవ, దేవీ, సుబ్రహ్మణ్య, గణపతి ఇలా అందరి ఆలయాలను దర్శించి వారిపై కృతులను రచించారు. ఆయన కృతులలో కాశీదేవతలైన విశ్వేశ్వర, విశాలాక్షి, అన్నపూర్ణ, కాలభైరవ, గంగాది మూర్తుల ప్రస్తుతేకాక నేపాలులోని పశుపతినాధుని ప్రస్తుతి, బదరీలోని నారాయణుని ప్రస్తుతి మనకు కన్పిస్తుంది. ఆయన విష్ణ్వీశభేద మెరుగని అద్వైత, స్వార్త మతస్ధుడు. శ్రీశంకరభగవత్పాదమతావలంబి, ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తనలలో భక్తి, జ్ఞాన, వైరాగ్య భావముల సమ్మేళనము సుందరముగా సమ్మిళితమై ఉంది. రామాష్టపది అనే సంగీతరూపకాన్ని రచించిన ఉపనిషద్బ్రహ్మేంద్ర సరస్వతిల వారి వద్ద వేదాంతగ్రంథ అధ్యయనము చేయటం వల్ల ముత్తుస్వామివారిపై రామభక్తి ప్రభావం ప్రస్ఫుటం. మాంజిరాగంలోని ‘రామచంద్రేన సంరక్షితోహం’ అనే కీర్తనలో ఆయన శ్రీరాముడు త్రిమూర్తుల సమిష్టిరూపమని (రమా భారతి గౌరీరమణ స్వరూపేణ రామచంద్రేణ సంరక్షితోహం) వర్ణించారు. అలాగే శ్రీరాముని పరబ్రహ్మతత్త్వాన్ని మాహురి రాగంలో ‘మామవ రఘువీరా’ అనే కృతిలో తెలిపారు. ఈ కృతిలో శ్రీరాముని పామరపండిత పావనకర నామధేయుడని, గురుగుహనుతుడని ముత్తుస్వామి స్తుతించారు. క్షేత్రదేవతా కీర్తనలు: ముత్తుస్వామి తన జీతకాలమంతా క్షేత్రాటన చేస్తూ తత్తద్దేవతా సంకీర్తనలు చేస్తూ కాలం గడిపారు. ఆయన దర్శించిన ప్రతీ క్షేత్రానికున్న విశిష్టత ఆయన చేసిన ప్రతీ కృతీలో ఇనుమడించింది. దీక్షితారు వారు ఆయా క్షేత్ర దేవతలపై చేసిన కీర్తనలలో కొన్ని మచ్చుతునకలు. తిరుపతి వేంకటేశ్వరునిపై వరాళి రాగంలో ‘శేషాచల నాయకం భజామి’ అనే కీర్తన, కంచి కామాక్షిపై చేసిన అనేక కీర్తనలో కమలా మనోహరి రాగంలో ‘కంజదళాయతాక్షి’, హిందోళ రాగంలో ‘నీరజాక్షి కామాక్షి’, శుద్ధసావేరి రాగంలో ‘ఏకామ్రేశనాయకీ’ ప్రసిద్ధాలు. కాంచీపురంలోని కైలాసనాథునిపై కూడా దీక్షితార్ పెక్కు కృతులు రచించారు. వీటిలో వేగవాహిని రాగంలోని ‘కైలాసనాథం’, కాంభోజి రాగంలో ‘కైలాసనాథేన’ ప్రసిద్ధమైనవి. చిదంబర సమీపంలోని గోవిందరాస్వామిపై ఆయన చేసిన కృతులకు ఒక విశిష్టత ఉంది. ముఖ్యంగా మేచబౌళి రాగంలో రచించిన ‘గోవింద రాజేన’ అనే కృతి కర్ణాటక సంగీత సముద్రంలో ఈ రాగంలో రాసిన ఏకైక కృతని సంగీతజ్ఞలు అభిప్రాయం. అయతే, ఈ రాగంలో వేంకటముఖి రచించిన కొన్ని గీతాలు మాత్రం లేకపోలేదు. అలాగే చిదంబరం సమీపంలోని వైదీశ్వరన్ దేవాలయ దేవతలపై చేసిన పెక్కు కృతులలో బాలాంబికాదేవిపై రాసిన ‘భజరేరే చిత్త బాలాంబికాం’ అనే కల్యాణరాగ కృతి, వైద్యనాథస్వామిపై కూర్చిన అఠాణ రాగంలోని ‘శ్రీ వైథ్యనాథం’ బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. పంచలింగ స్థల కీర్తనలు: ఆకాశాది పంచభూతముల ప్రత్యేకాంశలతో పంచలింగ క్షేత్రములు దక్షిణభారతంలో ప్రసిద్ధిగాంచాయి. వీటిలో శ్రీకాళహస్తిలోని లింగం స్వాయంభువు, వాయులింగము. ఇక కాంచీపురంలోని ఏకామ్రనాథుడు పృథ్వీలింగము, శ్రీరంగ సమీపంలోని జంబుకేశ్వరుడు ఆపోలింగం, తిరువన్నామలైలోని అరుణాచలేశ్వరుడు తేజోలింగం, చివరగా చిదంబరంలోని శివలింగం ఆకాశలింగమని ప్రసిద్ధి. శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరుని స్తుతిస్తూ, ‘శ్రీ కాళహస్తీశ’ అని, కాంచీపురంలోని ఏకామ్రనాధుని ప్రస్తుతిస్తూ, అనేక కీర్తనలు రచించినా భైరవి రాగంలోని ‘చింతయ మాకంద’ అనే కృతి పంచలింగకృతులలో ఒకటి. ‘అరుణాచలనాథం స్మరామ్మనిశ’, ‘జంబూపతే మాంపాహి’, ‘ఆనందనటన ప్రకాశం చిత్సభేశం’ మిగిలిన మూడు పంచలింగ కృతులు. చిదంబర నటరాజస్వామిపై ముత్తుస్వామివారు రచించిన కేదార రాగంలో ‘ఆనందనటన ప్రకాశం’ కృతి నటరాజు ఆనందనృత్యానికి సంబంధించినదై ఎంతో రమణీయంగా నాట్యమునకు పనికివచ్చునట్టు సొల్లుకట్లు ఈ కృతికి అనుబంధంగా ఉండటం ఈ కృతి విశిష్టత. అభయాంబ కృతులు: వైదీశ్వరన్ దేవాలయ అధిష్టాన దేవన అభయాంబపై రాగప్రస్తార సౌలభ్యమునందేకాక, తాంత్రిక విషయస్ఫురణమునందు కూడా గణ్యమైనవి. ‘అంబికాయాః అభయంబికాయాః’ అనే కేదార రాగ కృతియందు కుండలినీశక్తి నిగూఢమై ఉన్నది. అభయాంబపై దీక్షితార్ అన్ని విభక్తులందు కృతులు రచించారు. 1. అభయంబ జగదాంబ – కల్యాణి రాగం – ప్రథమా విభక్తి 2. ఆర్యామభయాంబాం – భైరవి రాగం – ద్వితీయా విభక్తి 3. గిరిజయా అపజయ – శంకరాభరణ రాగం – తృతీయా విభక్తి 4. అభయాంబికాయై – యదుకుల కాంభోజి రాగం – చతుర్థీ విభక్తి 5. అభయాంబికాయాః – కేదారగౌళ రాగం – పంచమీ విభక్తి 6. అంబికాయాః అభయంబికాయాః – కేదార రాగం – షష్ఠీ విభక్తి 7. అభయాంబికాయాం – శహనా రాగం – సప్తమీ విభక్తి 8. దాక్షాయణి – తోడి రాగం – సంబోధన ప్రథమా విభక్తి ఈ కృతులకు చివరగా మంగళహారతిగా పాడే ముగింపు కృతి ‘శ్రీ అభయాంబ నిన్ను’ అనునది తెలుగు పల్లవితో శ్రీరాగంలో రచించారు. అయితే తర్వాత కాలంలో సంస్కృత, తమిళ భాషలలో ఈ మంగళహారతి ప్రాముఖ్యం పొందింది. ఈ కృతి ముత్తుస్వామివారు రచించిన మణిప్రవాళ శైలిలో రచించిన అనేకానేక కృతులలో ఒకటి. మణిప్రవాళ శైలి కృతులలో బహుళప్రాచుర్యం పొందిన కృతి కాఫీరాగంలోని ‘శ్రీ వేంకటాచలపతే నిన్ను నమ్మితి’. ఈ మణిప్రవాళి శైలి కృతులలో ఆంధ్ర, తమిళ, సంస్కృత భాషలను ముత్తుస్వామి దీక్షితార్ వారు విశిష్టంగా వినియోగించినప్పటికీ, పల్లవికి మాత్రం తెలుగు భాషనే ఉపయోగించటం విశేషం. రాగప్రస్తారమునకు, పల్లవికున్న ప్రాముఖ్యాన్ని బట్టి సహజ సంగీత మాధుర్యయుక్త ప్రవాహమునకు తెలుగుభాషే అధికయోగ్యత కలదని పండితులు స్పష్టీకరించారు. (తదుపరి భాగంలో తిరువారూరు క్షేత్రంపై, త్యాగరాజస్వామివారిపై ముత్తుస్వామి వారు చేసిన కీర్తనలను గురించి తెలుసుకుందాం.) సౌమ్యశ్రీ రాళ్లభండి
సంగీతరత్నాకరంలో పేర్కొన్న ఎంతో ప్రాచీనమైన ఈ సంపూర్ణ జనకరాగం 5వ బాణ చక్రంలో 5వ రాగం. చతుర్దండి ప్రకాశిక ఈ రాగాన్ని ‘రాగ రాజస్య మేళకః’ అని, పార్శవదేవ ‘రాగాంగ రాగ’ అని కొనియాడారు. కటపయాది సంఖ్యానియమంలో ఇమడ్చడానికి ఈ రాగం ముందు ‘ధీర’ అనే పదాన్ని చేర్చటం ద్వారా ఈ రాగం ‘ధీర శంకరాభరణం’గా ప్రసిద్ధి కెక్కింది. ఇది సంపూర్ణ, సర్వస్వరగమక వరిక రాగము. ఈ రాగ స్వర స్థానములు షడ్జమము, చతుశృతి రిషభము, అంతర గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, చతుశృతి దైవతము, కాకలి నిషాదము (సరిగమపదనిస / SR2G3M1PD2N3S). ఇందు అన్ని స్వరములు రాగచ్ఛయా స్వరములు. షడ్జము గ్రహ స్వరము. స,గలు న్యాస స్వరములు. ని,గ,మ,పలు జీవ స్వరములు. అన్నివేళలా పాడుకోగల రక్తి రాగము. శ్లోకములు, పద్యములు పాడటంతోపాటు రాగాలాపనకు కూడా చాలా అనువైన రాగం. స,ప,మలతో ఈ రాగంలో రచనలు ప్రారంభమవుతాయి. ఈ రాగానికి అన్ని స్వరాలు మూలస్తంభాలై నిలచి రాగాన్ని రక్తి కట్టిస్తాయని సుబ్బరామ దీక్షితార్ అభిప్రాయపడ్డారు. ప్రతి రెండో స్వరము ఇందు కంపిత స్వరము. అలాగే మధ్యమము ఇందు కొన్నిసార్లు అర్ధ కంపితం. జంట స్వర, దాటు స్వర ప్రయోగాలు ఈ రాగానికి అందాన్ని చేకూరస్తాయి. హిందుస్థానీ యందు దీని సరిసమానమైన రాగం ‘బిలావల్’. దీనినే పూర్వం వేళావళి అని కూడా అనేవారు. సిక్కుల పవిత్ర గ్రంధం ‘గురు గంథ్ర సాహెబ్’లో కూడా ఈ రాగం ప్రస్తావన ఉంది. గురునానక్, గురు తేజ్ బహదుర్, గురు అర్జున్లు ఈ రాగంలో రచనలు చేశారు. పాశ్చాత్య సంగీతంలో సి-మేజర్ స్కేల్ దీనికి సమానము. ఈ రాగాన్ని ఔపోసన పట్టిన సంగీతకారునిగా తంజావూర్ ఆస్థానానికి చెందిన నరసయ్యను చెప్పుకోవచ్చు. శంకరాభరణ రాగ, భావాలను ఎంతో అద్భుతంగా గానం చేయగల నేర్పరితనం, ఆ రాగమందు ఆయనకు గల ప్రతిభను గుర్తించి తంజావూరు ఆస్ధానాధీశుడు శరభోజీ ఈయనను ‘శంకరాభరణం నరసయ్య’గా గౌరవించారు. నాటినుండి శంకరాభరణం ఆయన ఇంటి పేరైంది. ఎక్కడ నరసయ్యగారు సంగీత కచేరీలు చేసినా శంకరాభరణ రాగంలో తప్పక ఒక కృతిని ఆలపించేవారు. ఒకసారి పాడిన సంగతిని మరోసారి పాడకుండా గంటల తరబడి ఆయన శంకరాభరణ రాగంలో పాడేవారట. చాలా జన్యరాగ సంతతిగల ఈ జనకరాగంలోని ప్రసిద్ధ జన్యరాగాలు: ఆరభి, బిలహరి, హంసధ్వని, శుద్ధ సావేరి, కదనకుతూహలం, దేవగాంధారి, కానడ, కురుంజి, అఠాణా, కేదారం, బేగడ, పూర్ణచంద్రిక, జనరంజని, దర్బార్, బేహాగ్, వసంత, పూర్వగౌళ, నారాయణి, నీలాంబరి, నారాయణ దేశాక్షి, కోలాహలము, శుద్ధవసంతం మరియు సహన మొదలగునవి.
  • సామినిన్నే (వర్ణము)
  • చలమేల (వర్ణము)
  • మనవి చేకొనరాదా (వర్ణము)
  • వీణ కుప్పయ్య
  • స్వాతి తిరునాళ్
  • పొన్నయ పిళ్లై
  • దశరధరామ గోవింద నన్ను- దయజూడు పాహి ముకుంద
  • ఇతడేనా ఈ లోకములో గల
  • తగునయ్య దశరథ రామచంద్ర దయ తలుపవేమి నీవు
  • రక్షింపు మిది యేమొ రాచకార్యము పుట్టె
  • ఎంతో మహానుభావుడవు నీవు
  • నారాయణ నారాయణ జయ గోపాల హరే కృష్ణ
  • రామభద్ర రారా శ్రీ రామచంద్ర రారా
  • రామదాసు
  • మరియాద
  • ఎదుట నిలచితే
  • మనసు స్వాధీనమైన
  • స్వరరాగ సుధ
  • ఎందుకు పెద్దలవలె బుద్ధినీయవు
  • బాగు మీరగను (వేంకటేశ పంచరత్రాలలో ఒకటి)
  • త్యాగయ్య
  • అక్షయలింగ విభో
  • శక్తిసహిత గణపతిం
  • సదాశివం ముపాస్మహే
  • దక్షిణామూర్తే
  • ముత్తుస్వామి దీక్షితార్
  • సరోజదళ నేత్ర, దేవి మీన నేత్రి
  • పశ్యతి దిశ్యతి (అష్టపది)
  • హిమ తెలియ తరమా
  • దేవీ జగజ్జననీ (నవరాత్రి కృతి)
  • అలరులు కురియగ
  • శంకరాచార్యం
  • అష్టాంగయోగ
  • శారదే సదాస్రయే
  • శంభో జగదీశ
  • శ్యామశాస్త్రి
  • జయదేవుడు
  • ఆనయ్య
  • స్వాతి తిరునాళ్
  • అన్నమాచార్య
  • సుబ్బరాయ దీక్షితార్
  • ఎట్టప్ప మహారాజు
  • కృష్ణస్వామి అయ్యర్
  • రామస్వామి దీక్షితార్
ఈ రాగంలో ప్రసిద్ధికెక్కిన రచనలు: త్యాగయ్య ఈ రాగమందు దాదాపు 20 కృతులను రచించారు. ముత్తయ్య దీక్షితార్ శంకరాభరణంలో రచించిన నవావర్ణ కృతి, పాశ్చాత్య ప్రక్రియలో రచించిన చింతాయ ఆంజనేయం, గురుగుహ సరసిజ, పాహి దుర్గే, రామ జనార్ధన, పార్వతీపతే, సామగానప్రియ, వందే మీనాక్షి, సకలసుర వినుత మొదలగు 40 నొట్టు స్వర రచనలు ఈ రాగానికి ప్రసిద్ధిని చేకూర్చాయి. సినీ సంగీతం: పాశ్చాత్యలు ఈ రాగాన్ని ఎంతగానో అభిమానించారు. సౌండ్ ఆఫ్ మ్యూజిక్ చిత్రంలో జూలియా అండ్రూస్ పాడిన ఈ రాగానికి చెందిన ‘డో ఎ డియర్, ఫీమ్యేల్ డియర్’ పాట బహుళ ప్రాచుర్యాన్ని పొందింది. ఇక తెలుగులో శంకరాభరణం రాగము కె.విశ్వనాథ్ తీసిన శంకరాభరణం సినిమా తెలియనివారుండరు. ఆ సినిమాలోని ‘ఓంకార నాదానుసంధానమౌ గానమే’ అన్న పాట ఈ రాగంలోనిదే. అలాగే రోజా సినిమాలోని ‘చిన్ని, చిన్ని ఆశ’ పాట. భార్యాభర్తలలోని ‘జోరుగా, హుషారుగా షికారుపోదమా’, సితారలోని ‘వెన్నెల్లో గోదారి అందం’, బొంబాయిలోని ‘ఉరికే చిలకా, వేచి ఉన్నాను కడవరకు’, ఆరాధనలో ‘నా హృదయంలో నిదురించే చెలి’, విప్రనారాయణలో ‘బుద్ధేనాంజలి నమామి’ చెప్పుకోదగ్గవి. ఇక భారతీయుల జాతీయగీతం ‘జనగణమణ’ బిలావల్ లోనే రూపకల్పన చేసుకుంది. హిందీ సినిమా పరిచయ్ లోని ‘సారె కె సారే గామాకొలేకేర్ గాతే చలే’, బావర్చీలోని ‘భోర్ ఆయి, గయా అంధియారా’ మొదలగు పాటలున్నాయి. సౌమ్యశ్రీ రాళ్లభండి
ఎవ్వడే ఎవ్వడే ఓ భామ వీడెవ్వడే ఎవ్వడే నేను పవ్వళించిన వేళ పువ్వుబాణము వేసి రవ్వ చేసిపోయె || మొలక నవ్వుల వాడే-ముద్దు మాటల వాడే తళుకారు చెక్కు-టద్దముల వాడే తలిరాకు జిగి దెగడ-దగు జిగి మోవి వాడే తలిదమ్మి రేకు క-న్నుల నమరు వాడే || ఎలమావి తోటలో - నింపొంద నొకనాడు యెలమి గౌరిపూజ - సలుపుచుండగా అల మువ్వగోపాలుడగు వేంకటేశుడు కలువల శయ్యపై - గలసే మన్నది నిజమై || అంటూ సరళమైన అచ్చతెనుగు పదాలతో పండితపామరులను రజింపచేసిన పదాలను రచించిన వాగ్గేయకారుడు క్షేత్రయ్య. క్షేత్రయ్యగా ప్రసిద్ధి చెందిన ఈయన అసలు పేరు వరదయ్య. కృష్ణాజిల్లాకు చెందిన మొవ్వ గ్రామానికి చెందినవాడు. ఈ మొవ్వని మువ్వ, మూవ, మవ్వ అని కూడా అంటారు. క్షేత్రయ్య జీవితానికి సంబంధించి స్ఫష్టమైన వివరాలు తెలియదు. అయితే ఈయన పదిహేడవ శతాబ్ధకాలంలో జీవించి ఉండి ఉంటాడని చారిత్రకారుల అభిప్రాయం. కాగా, వివిధ పుణ్య క్షేత్రాలను దర్శించి, ఆయా దైవాలపేర మువ్వగోపాల పదాలను రచించటం ద్వారా ఆయనకు క్షేత్రయ్య అన్నపేరు వచ్చిందని కథనం. క్షేత్రయ్య వరహూరు (వరయూర్ వరాహస్వామి), చిదంబరం (తిల్లై గోవిందుడు), కడప (వెంకటేశుడు), కంచి (వరదరాజస్వామి), వేదపురి (వేదనారాయణుడు), హేమాద్రి (సామి), యదుగిరి (చెలువరాయుడు), ఇనపురి (సామి), పాలగిరి (చెన్నడు), తిరుమల (వేంకటేశుడు), తిరవళ్ళూరు (వీరరాఘవుడు), శ్రీరంగం (రంగేశుడు), మధుర (మధురాపురీశుడు), సత్యపురి (వాసుదేవుడు), శ్రీనాగశైలము (మల్లికార్జునుడు), చలువ చక్కెరపురి, కోవళ్ళూరు మున్నగు క్షేత్రాలను దర్శించి ఆయా దేవుళ్లపేర్ల పదాలను రచించాడు. సుమారు నాలుగువేలకు పైగా క్షేత్రయ్య పదాలను రచించగా అందు నేడు మనకు లభ్యమవుతున్న పదాలు, మువ్వగోపాల ముద్రతో ఉన్నవి 372, రాజాంకితాలు, ముద్ర లేనివి 25 మాత్రమే. అలాగే, క్షేత్రయ్య మధుర తిరుమలనాయకుని (1623-59), తంజావూరు విజయరాఘవుని (1633-73), గోలకొండ పాదుషా (1622-72) ఆస్థానాలలో అగ్రకవిగా విరాజిల్లాడని ఆయన పదాల ద్వారా వెల్లడవుతోంది. భాగవతా భక్తినిరూపకమైన క్షేత్రయ్య పదాలలో అష్టవిధనాయికా శృంగారంతోపాటు మధురభక్తి కూడా నిక్షిప్తమైవుంది. ముఖ్యంగా క్షేత్రయ్య తానే నాయిక అయి మువ్వగోపాలుని ప్రియునిగా భావించి వర్ణించిన మధురభక్తి అనన్యసామాన్యం. ''చూడరె అది నడిచే హోయలు సుదతి చేయు జాడలు; ఆడది కులకాంత అత్తింటి కోడలు, అలగోపాలునిని ఉదికి వెడలెను'' అనే పదంలో భాగవతులని గోపికా మధురభక్తిని స్పష్టం చేశాడు క్షేత్రయ్య. క్షేత్రయ్య ఒకనాడు ‘సావిరహే తవ దీన కృష్ణా’ అనే జయదేవుని సంస్కృత అష్టపదికి నర్తకీమణులు చేసిన నృత్యాన్ని చూసి ప్రభావితమై తేనెలొలికే తెలుగులో అటువంటి పాటలు ఉంటే అందరికీ అర్ధమై మరింత రక్తికడతాయన్న భావన ఏర్పడింది. అచ్చ తెలుగులో అందరికి అర్ధమయ్యే పదాలు రాయాలన్న తపన పెరిగింది, అలాగే తెలుగు భాష ఉన్నంతకాలం తన పదాలు, పాటలు జీవించి ఉండాలని మువ్వగోపాలుని పేరు ప్రతినోట విన్పించాలన్న సంకల్పం ప్రభలమైంది. అందుకు అనుగుణంగా క్షేత్రయ్య సంగీత, సాహిత్యాలను, అభినయరీతులను ఆకళింపు చేసుకున్నాడు. ఆయన సంగీత, రాగ,తాళ విన్యాసాలలో, ఛందస్సు, వ్యాకరణాలలో పటిమ ఉన్నదనడానికి ఆయన పదాలే తర్కాణాలు. తంజావూరు రఘునాథరాయలను చూడటానికి వెళ్లినపుడు ఆయన చెప్పిన ఈ కందపద్యం అందుకు నిదర్శనం – తము దామె వత్తురర్ధులు క్రమ మెరిగిన దాతకడకు రమ్మన్నారా కమలంబులున్న చోటికి భ్రమరంబుల యచ్యుతేంద్ర రఘనాథనృపా క్షేత్రయ్య మొట్టమొదట రాసిన పదం ఆనందభైరవిరాగం, ఆదితాళంలో ‘శ్రీపతి సుతుబారికి నేనోపలేక నిను వేడితే కోపాలా? మువ్వగోపాలా.’ క్షేత్రయ్య రచనలు పదాలుగా ప్రసిద్ధి చెందాయి. పదం కూడా కీర్తనవంటిందే. అయితే ఇందు కవి తన భావాలను నాయికా-నాయకుల మధుర, శృంగార భావాలుగా వర్ణించి దేవునికి అంకితం చేస్తాడు. సంగీత, సాహిత్యాలు సమపాళ్లలో కల్గి, పల్లవి, అనుపల్లవి, చరణాలతో ఇది కూడి ఉంటుంది. క్షేత్రయ్య రాసిన ఈ మొదటి పదంలో మాత్రం మనకు పల్లవి, అనుపల్లవులు కన్పించవు. క్షేత్రయ్య పదములలో ముఖ్యమైన రసము రసరాజమైన శృంగారము. సంభోగ, విప్రలంభాదులను గురించి అష్టవిధ నాయికలు పడే అనుభావలు ఇందు కథా వస్తువు. ఉదాహరణకు కంచి వరదరాజస్వామి వారి కేళమందిరంనుంచి మీనాక్షీ అమ్మవారు తెలతెలవారే వేళలో శృంగారాంచిత చిహ్నాలతో సుప్రభాత సేవకంటే ముందుగా చెలులతో కలిసి చెలువం మీరేలా వచ్చే సొగసులన్నీ కళ్ళారా దర్శించి క్షేత్రయ్య రాసిన అద్భుత పదమిది - ప: మగువ తనకేళికా మందిరము వెడలెన్ అను: వగకాడ మా కంచివరద తెల్లవారెననుచు చ1: విడజారు గొజ్జంగి విరిదండ జడతోను కడు చిక్కపడి పెనగు కంట సరితోను నిడుద కన్నుల దేరు నిదుర మబ్బుతోను తొదరి పదయుగమున దడబడెదు నడతోను చ2: సొగసి సొగయని వలపు సొలపు జూపు తోను నగవగల ఘనసార వాసనలతోను జిగమించి కెమ్మోవి చిగురు కెంపులతోను సగము కూచముల విదియ చందురుల తోను చ3: తరిదీపు సీయు సమసురతి బడలికతోను యిరుగడల కైదండలిచ్చు తరుణులతోను పరమాత్మ మువ్వగోపాల తెల్లవారెనునుచు మగువ తనకేళికా మందిరము వెడలెన్. (మోహన – ఝంప) పై పదము అన్నమాచార్యులవారి ‘పలుకు దేనెల తల్లి పవళించెను కలికి తనమున విభుని గలసినది గాన’ అన కీర్తనను పోలి ఉండడం కాకతాళీయమే. జయదేవుని అష్టపదులు సంస్కృతాన ఎంత అందంగా పొదగాయో, క్షేత్రయ్య పదాలు తెలుగు సొగసులను, సొబగులను అదేవిధంగా పొదవుకున్నాయని అనేకమంది పరిశోధకులు కొనియాడారు. ప్రాసలు, అనుప్రాసలు, ఎంచుకున్న అచ్చ తెనుగు పదాలు క్షేత్రయ్య కవితా సౌందర్యానికి ప్రతీకలు. మచ్చుకు కొన్ని -- మోనిపానక మిచ్చునా? కొసరి కొసరి ముద్దులాడ నిచ్చునా” తావి పువ్వులు దెచ్చునా? తన సొగసుకు తగినవాడని మెచ్చునా? మన సిచ్చునా? దేవరే మొగడు గావలెనని భావజుని పూజలొనరించిన యా వనిత పేరేమి సెలవీరా, సిగ్గేలరా? పడతి నే నొకచోట ప్రాణేశుడొకచోట నెడబాసి మరునిచే నిడుములకు లోనై కడలేని విరహాగ్ని గ్రాగి వేగితి చాల పుడమిలో వేరె జన్మము లేదె సుదతి నల్లని మేని వాడట ఓయమ్మ! వాడు – నయము లెన్నో చేసునట! చల్లగా మాటాడు నట! – సరసము వాని సొమ్మట! కల్లగాదట వాడు – కళలంట నేర్చునట! తెలుగు భాషలో పదకేళిక చేయడం సాధ్యం కాదనే అభిప్రాయమానాడు ఉండేది. సంస్కృత ప్రభావం అటువంటిది. ఆ దశలో అభినయానికి అనుగుణమైన పదాలను తెలుగలో రచించి పండితులు ముక్కుమీద వేలేసుకొనేటట్టు చేశాడు క్షేత్రయ్య. అయితే రావే, పోవే, ఒసే, ఏమే వంటి పదాలు కవిత్వమేమిటని విమర్శించిన వారూ లేకపోలేదు. తంజావూరు విజయరాఘవ నాయకుల అస్థానంలో ఇటువంటి విమర్శలే ఎదురైనపుడు, కాంభోజి రాగం, త్రిపుట తాళంలో ఈ కింది పదం పల్లవి, అనుపల్లవి, రెండు చరణాలు రాసి వారి ఆస్థాన కవులను పూర్తిచేయమని అభ్యర్ధించగా, వారి వల్ల సాధ్యం కాలేదు. ‘‘వదరక పోపోవే వాడేల వచ్చీని వద్దూ రావద్దనవే అది యొక్క యుగము, వేరే జన్మమిపుడు అతడెవ్వరో, నేనెవ్వరో ఓ చెలియా నిచ్చ నిచ్చలు, నేదో వచ్చీని రేపైన వచ్చిననచు మదిలో నిచ్చగా బరు వేడి, నిట్పూర్పుల చేత నింతిరో పెదవులెండి హెచ్చైన, వెన్నల చిచ్చుల రాత్రులు యెన్నెన్నో గడిపితిని నేటి మాటలే’’, అంటూ ఈ పదం సాగుతుంది. తన పదాలలో స్త్రీ అనే పదాన్ని తరుణీ, ముదిత, కొమ్మ, అక్కరో, సుదతి, పడుపగత్తి, మానిని, జవ్వని, ఎలనాగ, ఉవిద, ముచ్చు, మొలక, కంజాక్షి అంటూ దాదాపు 100 పర్యాయ పదాల్లో సంబోధించాడు. అలాగే నాయకులను అన్నెకాడు, చిన్నెలవాడు, నళినాక్ష, ఎమ్మెకాడు అంటూ అనేక పర్యాయ పదాలతో సంబోధించి తెలుగు భాషా విస్తృతను చాటిచెప్పాడు. క్షేత్రయ్య పదాలలో దృశ్యాలను సాహితీవేత్తలొక మాదిరిగా, చిత్రకళాకారులోక మాదిరిగా, సంగీతజ్ఞులొక మాదిరిగా, నృత్యకళాకారులు మరోకమాదిరిగా, సంగీతాన్ని, సాహిత్యాన్ని, భాష అలంకార, ఛందస్సులను అధ్యయనం చేస్తారు. సంగీత, రాగతాళాలతోపాటు సాహిత్య భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యమిస్తేనే క్షేత్రయ్య పదాల సోయగం, మాధుర్యం, మృదుత్వం, లాలిత్యం, గాంభీర్యం, క్షేత్రయ్య నాయికా, నాయకులను మలిచిన తీరును, వారి భావాలను అర్ధం చేసుకోగలరని పద్మశ్రీ నటరాజ రామకృష్ణ అంటారు. క్షేత్రయ 49 రాగాలలో పదాలను అల్లినట్టు పరిశోధకులు తెలుపుతున్నారు. ఎక్కువగా కాంభోజి, పంతువరాళి, కేదారగౌళ, కల్యాణి, హుసేని, ముఖారి, తోడి, భైరవి, ఆనందభైరవి, మోహన, మధ్యమావతి, బిలహరి, శంకరాభరణం వాడారు. అయితే, కాంభోజి, కల్యాణి, హుసేని రాగాలను శృంగార రసాన్ని ఆవిష్కరించడానికి, ముఖారి, భైరవిలను శోకరసానికి, మోహన రాగాన్ని సంతోషాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగించారు. క్షేత్రయ్య ఎక్కువగా భాషాంగరాగాలానే వాడారని మంచాళ జగన్నాథరావుగారు చెప్పారు. అలాగే క్షేత్రయ్య ఎక్కువగా త్రిపుట తాళంలో పదాలను పొందుపర్చాడు. సాంప్రదాయానికి విరుద్ధంగా క్షేత్రయ్య పదాలను పాడేటప్పుడు మొదట అనుపల్లవినీ, తర్వాత పల్లవిని పాడుతారు. క్షేత్రయ్య పదాలను భరతనాట్యం, కూచిపూడి పద్దతులలో సొగసుగా అభినయించి, బోధించినవారిలో ప్రముఖులు బాలసరస్వతి, వెంపటి సత్యం, నటరాజు రామకృష్ణ, కలానిధి నారాయణన్ గార్లు. సౌమ్యశ్రీ రాళ్లభండి
ఆధునికాంధ్ర కవిత్వంలో 1920 సంవత్సరంలో వచ్చిన సరిక్రొత్త మలుపు భావ కవిత్వ రంగప్రవేశం. 1910-20 మధ్య భావ కవిత్వ ఉద్యమానికి రాయప్రోలు, అబ్బూరి ప్రారంభకులు అయితే అఖిలాంధ్ర ప్రాచుర్యం తెచ్చినవారు కృష్ణశాస్త్రి. ఆనాటి యువతరాన్ని తన కవితాగానంతో ఆకట్టుకున్నారు. బి.ఎన్. రెడ్డిగారి ప్రోత్సాహంతో 1942లో కవిగా చలనచిత్రరంగంలో ప్రవేశించి మళ్లీ ఇల్లాంటి సాహిత్యం పుట్టదన్నట్టుగా మల్లీశ్వరి పాటలు వ్రాశారు. ఆనాటి నుండి తుదిఘడియ వరకు కొన్ని వందల పాటలను వందకుపై చిలుకు చిత్రాలకు అందించి, సినీ సాహిత్యానికి సాహిత్య జగత్తులో ఉన్నతస్థానాన్ని కల్పించారు. సినీ గీతాలలో కూడా ఉదాత్త కవిత్వ పరిమళాలను వెదజల్లిన, కృష్ణశాస్త్రి పాటలు వింటుంటే మన హృదయాలు దేనికోరకో వెదుకుతాయి. ఏఏకాంత సీమలోనో మేలుకొంటాయి. కొసరి కొసరి వీచే చిరుగాలి వీచికల్లా మేలుకొంటాయి. ప్రకృతిలో ఎంత సౌందర్య సంపద ఉన్నా తనంత తానుగా సుకృతి కాలేదు. రససిద్దిని ఆయత్తం చేసుకున్న కవి వాక్కు అందుకు సంసిద్ధంగా ఉండాలి. అక్షర సౌందర్యం గుభాళించాలి. ‘‘చల్లగాలి తాకనిదే నల్లమబ్బు కురియదు, వేలి కొసలు తాకనిదే వీణపాట పాడదు’’ (మంచిరోజులొచ్చాయి) అంటూ చల్లని వానజల్లులా యెద లోతుల్లో పాటలు జాలువారితే కవికి మంచిరోజు. మందారినికి, మధుపానానికి ఉన్న సంబంధం ఎట్లాంటిదో కవికి, ప్రకృతికి గల సంబంధము కూడా అట్లాంటిదే. కవిత్వంలోని విలక్షణతను సినీగీతాలలో స్పష్టంగా భాసిస్తూ కృష్ణశాస్త్రిగారి ప్రత్యేక వాణీని, బాణీనీ ప్రస్ఫుటం చేస్తుంది. నాగరికతని, సభ్యతా సంస్కారాన్ని హార్ధక సౌకుమార్యాన్ని విశృంఖల శృంగారం కోసం ఆయన ఎప్పుడూ బలిపెట్టలేదు. ‘‘పెరటిలోని పూలపాన్పు త్వరగా రమ్మంది, పొగడనీడ పొదరిల్లో దిగులు దిగులుగా ఉంది’’ (బలిపీఠం) అన్న పంక్తులలోని ఆర్ధ్ర శృంగారం భావుక హృదయాలకు తెలుస్తుంది. అందుకే ఆయన రచించిన ప్రతిగీతం శ్రోతల హృదయాలలోనికి చొచ్చుకు పోయి నాలుకలపై నర్తిస్తుంటాయి. వాటికి పాటబడడమంటూ ఉండదు. మల్లీశ్వరి గీతాలే ఇందుకు నిదర్శనం. ఆయన పాటలన్నీ రసగుళికలే. ‘‘ఆకాశ వీధిలో హాయిగా ఎగిరే, అందాల చందాల, నీలాల రాగాల, మమత లెరిగిన – మనసు తెలిసిన జాలిగుండెల మేఘమాల’’గా మేఘమాలను వర్ణించిన తీరు అత్యున్నత భావాంబర వీధుల్లో విహరించే కవి భావుకతకి సంకేతంగా నిలుస్తుంది. ఈ మేఘమాల మాటతో మరో మేఘసందేశాన్ని సృష్టించిన అపర కాళిదాసుగా కృష్ణశాస్త్రిగారు పలువురి ప్రశంసలందుకున్నారు. వీరి సినీగేయాల్లో ప్రకృతి సౌందర్యం వర్ణనాత్మకమైనవి. లలిత పరిహాసాత్మకమైనవి. భక్తి, మధుర భక్తి భావనా విలసితమైనవి. సంయోగ, శృంగార మాధర్యోపేతమైనవి. వియోగ వేదనాభరితమైనవి, విషాదాత్మకమైనవి, మానవత, సామాజిక స్పృహలతో కూడు కున్నవి. జాతీయ భావనిర్భరమైనవిగా గోచరిస్తాయి. కృష్ణశాస్త్రి పాటలు అనంత తరంగాలుగా అనంతరం మన హృదయాల్ని తట్టితట్టి పిలుస్తాయి. తెలుగు నుడి బ్రతికినంత కాలం మనలను సాదరంగా పలకరిస్తాయి. ‘కుశలమా, నీకు కుశలమేనా’ (బలిపీఠం) అని అంటూ ప్రతి మనిషిని అడుగు తూనే ఉంటాయి. ‘మనసు నిలుపుకోలేక మరీమరీ అడిగే’, కరుణార్ధ్ర కంఠస్వరంలో తెలుగు జాతికి వెలుతురు వలయాలందిస్తాయి. ‘ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం, చేరనీ నీ పాదపీఠం కర్పూర దీపం’ అంటూ తెలుగు చెవినిల్లుకట్టకొని హెచ్చరిస్తూనే ఉంటాయి. కృష్ణశాస్త్రి పుట్టి పెరిగిన కాలం యుగసంధి. పెనుచీకటిలో లోకం కునారిల్లిపోవడం తాను కన్నులారా చూశారు. చీకటిని కొండలు దాటివెళ్లి పోమ్మని శాసించారు. వెలుగు వెండిరేకులను ఆహ్వానించారు. ఐనా చీకటి పూర్తిగా వైదొలగలేదు. వెలుతురు పూర్తిగా పునరాక్రమించనూలేదు. ఉన్న యదార్ధాన్ని ఆర్త హృదయంతో ఆక్రోశిస్తూ కూర్చోక సౌందర్య ప్రతీకగా మలచుకొని, ‘చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకు వన్నెల’ను (చీకటి వెలుగులు) ఆహ్లాదించారు. లోకపు మెడచుట్టూ గులాబీలు నవసౌకుమార్యాలను భావించారు. ఐనా చీకటి సిగపాయల ఎర్రని మందారాల కాంతి గుచ్ఛాల నవలోకించారు. సౌందర్యం ఏకాకి కాదు, దాని కాంతులు దూరదూరాల వ్యాపిస్తుంది. శివసుందరమయంగా సత్యమయ ధ్యానంగా, ఆనందధామంగా సాగుతుంది. అలాంటపుడు, ‘‘గల గల మనకూడదు ఆకులలో గారీ జలజల మనరాదు అలలో కొండవాగూ, నిదురోయే కొలను నీరు కదపగూడదు ఒదిగుండె పూలతీగ ఊపరాదు’’ (చీకటి వెలుగులు) నిజమే మరి, ఊరకనే తీగను కదిలించడమెందుకు? తీగకదిలితే స్వరమా ఊడిపోతుంది. తొడిమలపై కులికే పూలబాలలు కూలిపోతాయి. అది కృష్ణశాస్త్రి భావుకత, ఆర్ధ్ర మనస్కత. అలవోకగా కనులార మోడ్చిన కవికి ప్రతి పులుగు ఎందుకో ఏదో చెప్పబోతుంది. రామచంద్రోదయ సమయంలో చెట్టుచెట్టూ కనులు విప్పి చూస్తుంది. తెలియని ఆర్తిలోనూ, ఆశల పెను కడలిలోనూ అర్రట్లాడిపోతున్న సమయంలో ఆ రాముని దివ్యసుందర రూపం చూసేసరికి తోచి తోచని సందిగ్ధంలో కొట్టుమిట్టాడిన శబరిని మనముందు సాక్షాత్కరింప చేసిన దృశ్యము అపూర్వము. ‘‘అసలే ఆనదు చూపు, ఆపై కన్నీరు తీరా దయచేసిన నీ రూపు తోచదయ్యయ్యో ఎలాగో నా రామా! ఏదీ? ఏదీ? ఏదీ? నీలమేఘ మోహనము నీ మంగళరూపము’’ (సంపూర్ణ రామాయణం) స్వీయానుభవాన్ని అనుభూతిగా మార్చుకొని పాత్రలపరం చేయగల నేర్పు ఉంటే శబరినే కాదు, మందర అయినా కనులముందు నిలబడుతుంది. కృష్ణశాస్త్రి పాటలు మన సంఘాన్ని పునఃనిర్మించే బాధ్యతలతో స్పర్శంచని తావులేదు. మన హృదయాలలో సకల మాలిన్యాన్ని క్షాళనం చేస్తూ చీకటి కోణాలన్నింటిపైనా సూర్యరశ్మి ప్రసరింప చేస్తాయి. ఎవరూ అంటుకోని పనిని మాతృహృదయంతో నెరవేర్చే సంఘసేవకులు ఈ దేశానికి అంటరానివారు. దూరదూరంగా తరమబడుతున్నారు. భారంగా బ్రతుకులీడుస్తూ, బ్రతకడానికేనా వారు జన్మించారు అని కృష్ణశాస్త్రి గారిని కలవరపర్చింది. అందుకే ఆయన, ‘‘కలువపాపాయికి కొలను ఒడి ఉంది చిలుక పాపాయికి చిగురు ఒడి ఉంది ప్రాణములేని ఒక శిలకు గుడి ఉంది’’ (కాలం మారింది) ఆదయనీయులకు మాత్రం ఏమీలేదు. వారి బ్రతుకలపై ఎవ్వరికి జాలిలేదు. అంటరానితనాన్ని, ఒంటరితనాన్ని అనాదిగా పదిలపర్చుకొన్న జాతి తన హృదయాలను మడిగా జాడీలలో దాచుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. అస్పృత్యతపై ధ్వజమెత్తారు. ‘‘అందాల మనదేశము, అందచందాల మన దేశము పెంపొందాలి కలకాలం’ అంటూ జాతీయాభిమానాన్ని వ్యక్తం చేశారు. మాతృభాషా మాధుర్యానికి పరవశించిన కవి ‘పాడనా తెలుగు పాట, మంచి ముత్యాలపేట, మధురామృతాల తేట’ (అమెరికా అమ్మాయి) అంటూ తెలుగు వైశిష్ట్యాన్ని కొనియాడారు. ‘ఒళ్లంతా ఒయ్యారి కోక, కళ్లకి కాటుక రేఖ, మెళ్లోతాళీ, కాళ్లకు పారాణి, మెరిసే కుంకుమబొట్టు’ అంటూ తెలుగు ఆడపడుచుని మనోహరంగా వర్ణించారు. కృష్ణశాస్త్రి ప్రకృతి కవి. అందుకే ఆకులో ఆకు, పూవులో పూవు, రెమ్మలో రెమ్మైనారు. ‘పచ్చని తోటల విచ్చిన పూవులు, ఊగేగాలుల తూగే తీగలు, కొమ్మల మోగే కోయిల జంట’లను స్తుతించారు. ‘మనసున మల్లెలూగించారు. కన్నుల వెన్నెల డోలలూగించారు.’ ‘సడిసేయకే గాలి, సడిసేయ బోకే, బడలి ఒడిలో రాజు పవ్వళించేనే’ (రాజమకుటం) అంటూ తన రాజుకు నిద్రాభంగం కలగరాదని వేడుకుంటున్న ప్రియురాలి ముగ్ధప్రణమాన్ని రూపకల్పన చేశారు. పురులు విప్పిన నెమళ్లు నాట్యమాడినట్లు, కృష్ణశాస్త్రిగారి పాటలలో మృదువైన తెలుగు పదాలు దొర్లాయి. ఆయన పాటలు నవీన రసహృదయాలకు ఒయాసిస్సులై దప్పికతీరుస్తూనే తీరని పిపాసను కలిగించాయి. శేషభార్గవి దేవులపల్లి
మలహరి అనగా మలినం పోగొట్టునది అని అర్ధం. శుభప్రదమైన రాగం. ఇది ఔడవ,షాడవ ఉపాంగరాగం. ఈ రాగం స్వర స్థానాలు షడ్జమం, పంచమం కాక శుద్ధ రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, (స,రి,గ.మ,ప,ద,స / S R1 G3 M1 P D1 S). ఆరోహణ, అవరోహణలు: సరిమపదస, సదపమగరిస. దీనిని భక్తిరస ప్రధాన రాగంగా పేర్కొనవచ్చు. ఇది ప్రభాత రాగం. ఇందు మ,ప,దలు జీవ స్వరాలు. ఈ రాగం గురించిన ప్రస్తావన సంగీతరత్నాకర, సంగీతమార్తాండ, రాగతాళ చింతామణి మొదలైన ప్రాచీన సంగీత పుస్తకాలందు మనకు కన్పిస్తుంది. ఇది పూర్వం వాడుకలో ఉన్నా ఇప్పుడు మరుగున పడిపోయింది. అయితే, ఈ రాగమందు కర్ణాటక సంగీతపితామహుడు పురందరదాసు అభ్యాసగానానికి అనువుగా నాలుగు పిళ్ళారి గీతాలు – శ్రీ గణనాథ, కుందగౌర, కెరయనీరను మరియు పదుమనాభా – రచించారు. మలహరి రాగంలో ప్రసిద్ధ రచనలు: 1. పంచమాతాంగముఖ – ముత్తుస్వామి దీక్షితార్ 2. అనంతపద్మనాభం – ముత్తయ్య భాగవతార్ 3. ఇన్నిటిమూలంబీశ్వరుడాతని – అన్నమయ్య మలహరి స్థానే నేడు సావేరి రాగం ప్రసిద్ధి చెందింది. ఈ రెండు రాగములకు అవరోహణ యందు నిషాదము మాత్రమే భేదము. ఈ రాగ ఆరోహణ, అవరోహణలు: సరిమపదస, సనిదపమగరిస. ఇది ఔడవ, సంపూర్ణరాగం. ఇందు రి,మ,దలు రాగా ఛాయా స్వరాలు. ఈ స్వరాలు సావేరి రాగ లక్షణాన్ని వెలికి తీస్తాయి. ఈ స్వరంలో మధ్యమానికున్న ప్రత్యేకత దృష్ఠ్యా దీనిని ‘సావేరి మధ్యమం’ అని కూడా పిలుస్తారు. ఇది కరుణ, శోకరసాలు పలికించే రాగం. సూర్యోదయ, సూర్యాస్తమయాలలో పాడుకోడానికి అనువైన రాగం. సంగీత త్రిమూర్తులు ముగ్గురూ మొత్తం 28 రాగాలలో కనీసం ఒక కృతైనా రచించారు. ఆ రాగాలలో ఒకటి సావేరి రాగం. ఈ రాగంలో త్రిమూర్తులు ముగ్గురూ కలిసి 26 రచనలు చేశారు. అందు 19 కేవలం త్యాగరాజే చేశాడు. ఈ రాగాన్ని భాషాంగ రాగంగా సంగీత రత్నాకర పేర్కొంది. ‘‘కావేరి స్నానం, సావేరి రాగం’’గా బహుళ ప్రచారం చెందిన ఈ రాగం కర్ణాటక సంగీతంలోనే ప్రత్యేక స్థానాన్ని ఆపాదించుకుంది. ఎంతో ప్రాచీనమైన ఈ రాగ ప్రస్తావన సంగీత రత్నాకర, సంగీత సమయసారగౌడ మేళానికి జన్యరాగమని బృహధర్మ పురాణం పేర్కొంది. ఈ రాగం సాలంగనాథ మేళ జన్యమని, గౌళ మేళజన్యమని, మల్లారి జన్యమని కూడా ప్రచారంలో ఉంది. సావేరి రాగంలో ప్రసిద్ధ రచనలు: 1. సరసుడా (వర్ణం) – వెంకటరామ అయ్యర్ 2. శంకరి శంకురు, దురుసుగా కృప జూచి, జనని నతజనపరిపాలిని – శ్యామశాస్త్రి 3. ఆంజనేయ, పరిపాహి గణాధిప (నవరాత్రి కృతి) – స్వాతి తిరునాళ్ 4. శ్రీ రాజగోపాల, కరికళభ ముఖం – ముత్తుస్వామి దీక్షితార్ 5. పరాశక్తి మను, రామబాణ త్రాణ, తులసీ జగజ్జననీ – త్యాగరాజస్వామి 6. ఎంతనేర్చినా – పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ 7. శ్రీ కామకోఠి పీఠ – మైసూర్ సదాశివ బ్రహ్మం 8. మురుగా, మురుగా – పెరియస్వామి తూరన్ 9. మెచ్చోనక రాగంబు – అన్నమయ్య 10. మాధవా మధుసూదన, హరియే సర్వోత్తమ – పురందరదాసు 11. సీతారామస్వామి, దినమే సుదినము - రామదాసు సౌమ్యశ్రీ రాళ్లభండి
సంగీతం పాడటమే ఒక కళ అంటే, పాటలను రాసి వాటికి స్వరాలను కూర్చటం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. నేడు పాటలు రాసే కవులు, ఆ పాటలకు బాణీలు అంటే స్వరాలని కూర్చే సంగీత విద్వాంసులు వేరు, వేరుగా ఉన్నారు. కానీ సంగీతం ప్రాణం పోసుకున్ననాటి నుండి ఈ రెండు ప్రక్రియలను చేయలగలిగే వారే సంగీతకారులుగా ప్రసిద్ధి కెక్కారు. ఇలా సంగీతం, కవిత్వం రెండింటిపై పట్టుగలిగి ఆశువుగా గానం చేసే కళాకారులని వాగ్గేయకారులు అంటారు. జయదేవుడు, అన్నమయ్య, రామదాసు, క్షేత్రయ్య, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్ర్తివంటి మహానుభావులు ఈ కోవకు చెందినవారే. సంగీత ప్రపంచంలో తమకంటూ ఒక స్థానాన్ని కల్పించుకున్న అలాంటి మహానుభావుల జీవిత విశేషాలను తెలుసుకుందాం. జయదేవుడు జయదేవుడు క్రీ.శ. 1098లో రమాదేవి, భోజదేవుల దంపతులకు జన్మించాడు. ఒరిస్సాలోని పూరీకి దగ్గరలోని ‘కిందుబిల్వం’ ఈయన స్వగ్రామం. జయదేవుడు గోవర్ధనాచార్యుల వద్ద శిష్యరికం చేసి సంస్కృతం, సంగీతం అభ్యసించాడు. జయదేవుడు క్రీ.శ. 1116లో బెంగాల్ లో నవద్వీపం రాజు లక్ష్మణసేనుడి ఆస్థానంలో ఆస్ధానకవిగా ఉండేవాడని చరిత్రకారులు భావిస్తున్నారు. జయదేవుడు కృష్ణ భక్తుడు. భార్య పద్మావతి నృత్యం, కృష్ణభక్తి ప్రేరణలతో జయదేవుడు రాధా, కృష్ణుల ప్రణయగాథను, భక్తితత్వ్తాన్ని సంస్కృతంలో అష్టపదుల రూపంలో రచించాడు. సంస్కృతంలో అష్ట అంటే ఎనిమిది. ఎనిమిది చరణాలు గల పాటలు, శ్లోకాలు రచించటం వల్ల వీటికి అష్టపదులు అని పేరు. ఈ అష్టపదుల సంకలనమే ‘శ్రీ గీతగోవిందం’. జయదేవుడు రాధాకృత, గోపికా కృత, గీత గోవిందం అని అర్ధం వచ్చేవిధంగా, శ్రీ గీతగోవిందం అని పేరుపట్టాడు. కానీ కాల క్రమేణా ఇది గీతగోవిందంగా ప్రసిద్ధి కెక్కింది. శ్రీ గీతగోవిందం గీతగోవిందంగా మారినట్టే శ్రీ జయదేవ నామం కూడా జయదేవగా రూపాంతరం చెందినట్టు విమర్శకులు భావిస్తున్నారు. జయదేవుడు తన పేరునే ముద్రగా అష్టపదులలో పొందుపర్చాడు. అనేక అష్టపదులలో చివరి చరణంలో శ్రీ జయదేవ శబ్దమే ప్రయోగితమవడమే ఇందుకు తర్కాణం. సరళమైన పదాలతో, పాటలతో రాసిన గీతగోవిందం భారతీయ సాహిత్యంలో మొట్టమొదటి యక్షగానమని చెప్పవచ్చు. శృంగార వర్ణనలతో కూడిన శ్రీ గీతగోవిందంలో మొత్తం 12 సర్గాలు, 95 వివిధ వృత్త రచనలు, 78 శ్లోకాలు, 24 పాటలున్నాయి. గీత గోవిందంలోని 12 సర్గాలు భాగవతోంని 12 స్కంధాలకు మారురూపమని ఒక నమ్మకం. సకల వేదసారం గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలలో నిక్షిప్తమయినట్టు, గీత గోవిందలో కూడా 24 ప్రంబంధాలుండటం కాకతాళీయం కాదని గీతగోవిందం భాగవత స్వరూపమని మరో నమ్మిక. అందుకు తగినట్టుగానే అష్టపదులలో మొదటిది దశావతార అష్టపది కావటం విశేషం. 11 చరణాలు గల ఈ అష్టపదిలో జయదేవుడు విష్ణుమూర్తి దశావతారాలను వర్ణించాడు. జయదేవుని గీతగోవిందం గురించిన ఒక కథ బహుళ ప్రాచుర్యంలో ఉంది. ఒకనాడు జయదేవుడు 19వ అష్టపది రాస్తుండగా ఒక పంక్తి సరిగ్గా కుదరక రాసినదానిని కొట్టివేసి, స్నానానికి వెళ్లాడట. కొద్దిసేపటి తర్వాత వచ్చి చూస్తే అదే పంక్తి తిరిగి రాసి ఉన్నదట. ఆశ్చర్యంతో భార్య పద్మావతిని పిలిచి ప్రశ్నించగా మీరే వచ్చి రాశారని ఆమె బదులిచ్చిందట. సాక్షాత్తు కృష్ణభగవానుడే వచ్చి పంక్తిని పూర్తిచేశాడని జయదేవుడు గ్రహించాడు. పద్మావతికి కృష్ణదర్శనం లభించినందున ఈ అష్టపదిని దర్శన అష్టపది అని అంటారు. అంతేకాకా పద్మావతికి లభించిన భాగ్యానికి గుర్తింపు అన్నట్టు జయదేవుడు ఈ అష్టపది చివరి పంక్తిని ‘జయతు పద్మావతీ రమణ జయదేవకవి’ అని పూర్తిచేశాడు. జయదేవుని అష్టపదులలో బహుళ ప్రాచుర్యం పొందినవి ... ‘హరిరిహముగ్ధవధూనికరే’, ‘చందన చర్చిత నీల కళేబర’ మరియు ‘సావిరహేతవదీనా రాధా’ మొదలగునవి. జయదేవునికి ముందు రాగ, తాళాలతో పాటలు పాడినవారుకానీ, పాటలు రచించినవారుకానీ ఉన్నట్టు దాఖలాలు లేవు. కావున జయదేవుడే మొదటి వాగ్గేయకారుడని చరిత్రకారులు అభిప్రాయం. జయదేవుని గీతగోవిందం సంగీతరత్నాకరం రాయటానికి దాదాపు రెండు, మూడు శతాబ్దాల ముందు పుట్టింది. గీతగోవిందాన్ని ఏఏ రాగాలలో పాడాలి అన్న మార్గదర్శకత్వం లేనందున సంగీతకారులు తమకు తోచిన రాగ, తాళాలలో అష్టపదులను ఆలపించారు, ఆలపిస్తున్నారు. సంగీతజ్ఙులు శ్రీ మంచాల జగన్నాథరావుగారు జయదేవుని అష్టపదులకు రాగతాళస్వరకల్పన చేస్తూ, తాళములకు సంబంధించి కొన్ని విషయాలను ప్రస్తావించారు. సాహిత్యము నందలి పదపొందిక గమనించినచో వాని ఛందస్సు స్పష్టంగా తెలుసుకోవచ్చని, దాని ఆధారంగా తాళములు కట్టవచ్చని వివరించారు. ఉదాహరణకు ఆరు మాత్రలు గల ’శ్రితకమలా కుచమండల’ అనే అష్టపదిని రూపక తాళంలోనూ, ‘రదసి యది కించిదపి’ అనే అష్టపదిని ఐదు మాత్రలు గల జంపెతాళంలోనూ, ‘మామియంచలితా విలోక్యా వృతం’అనే అష్టపదిని యేడు మాత్రలు గల త్రిపుట లేదా సాకు తాళంలోనూ, ‘లలిత లవంగ లతాపరిశీలన’ అనే అష్టపదిని ఆది తాళంలోనూ పాడుకోవలెనని తెలిపారు. ఖశ్చితంగా ఈఈ రాగాలలో పాడాలన్న నిబంధన లేకపోయినా, జయదేవుడు మంగళ గుర్జరి, బారడి, దేశీ బారడి, గుజ్జరి, భారబి, వసంత, రామఖేరి, గుండఖేరి, దేశాఖ్య వంటి రాగాలలో గీతగోవిందాని గానం చేశాడని అంటారు. ఎప్పుడో 12వ శతాబ్ధ కాలంలో పుట్టిన అష్టపదులు నేటికి ప్రచారంలో ఉన్నాయి. భజనల్లో, నాట్య ప్రదర్శనల్లో మనకు ఈ అష్టపదులు విన్పిస్తుంటియి. ఒడిస్సి, భరతనాట్యం, మణిపూరి, కూచిపూడి, కథక్ వంటి భారతీయ నృత్య రీతుల్లో అష్టపదులను ప్రదర్శింస్తుంటారు. నేటికి పూరిలో జగన్నాథస్వామికి పూజలు నిర్వహించేటప్పుడు, తిరుపతిలో అన్నమయ్య కీర్తనలు పాడినట్టు, జయదేవుని అష్టపదులు ఆలపిస్తుంటారు. పూరీ జగన్నాథ రథోత్సవ సందర్భంలో 19వ అష్టపదిని ఆలపిస్తారు. కేవలం పూరీలోనే కాకా కేరళలోని గురువాయూరు దేవాలయంలో కూడా అష్టపదులను సోపాన పద్దతిలో గానంచేస్తారు. జయదేవుడు గీతగోవిందమేకాక, యీసత్కవిచంద్రాలోకం, రతిమంజరి, కారకవాదం, తత్త్వచింతామణి అనే గ్రంధాలను విరచించాడు. కృష్ణ భక్తితత్త్వాన్ని కళ్లకు కట్టినట్టుగా విరచించిన జయదేవుడు క్రీ.శ. 1153లో పరమపదించాడు. సౌమ్యశ్రీ రాళ్లభండి
జగదానందకారక, కనకన రుచిరా కృతుల్లో ప్రత్యక్షం చేసుకున్న పరమాత్మ తనను రక్షించి దయతో బ్రోచునా అనే సందేహాన్ని, గౌళరాగంలో ‘‘దుడుకు గల’’ అనే కృతిలో ప్రస్తావిస్తారు త్యాగరాజస్వామి. ‘కనకనరుచిరా’ అన్నపాటలో చివర ఉదహరించుకున్న ధ్రువుడు సజ్జనుడు, సాపత్నిమాతయైన సురుచి కర్ణశూలములైన మాటలు, వీనులచురుక్కుమనిపించినా, పల్లెత్తుమాటైనా తిరిగి అనకుండా కార్యశూరుడైన, వినయకవచుడై కృతకృత్యుడైన ప్రయోజకుడు ఆ ధ్రువుడు! అలా ధ్రువోపాఖ్యానం జ్ఞాపకం తెచ్చుకున్నా ప్రస్తుతః తాను ఆ ధ్రువునికి సమానుడను కానన్న కించవల్ల తన కాతని మల్లె సమానఫలసిద్ధి అబ్బదేమో అనే సందేహం కలిగింది. తనకు దుడుకు ఉన్నదని ఆలోచించుకుంటారు. తన స్థితిని పూర్తిగా వివరించుకునే ప్రయత్నంచేసి, ఆ ప్రయత్నంలో పదేపదే తన్ను కించపరచుకుంటారు ఈ గౌళకృతిలో. సౌఖ్యపుజీవనం కోసమే కాలం గడుపుతూ, దుర్విషయములను దురాశలను విసర్జించలేక, పరధనముల నాశించి, వానికొరకు ఇతరులను పొగడి, మది కరుగ యాచించి పలికి, కుతర్కుడై, రసవిహీనుడై, కులభ్రష్టుడై కాలము గడిపే దుడుకు మానవతను సాధింపక, చపలచిత్తుడై, మదమత్సర కామలోభమోహములకు దాసుడై, చిరుతప్రాయమునాడే భజనామృతసారవిహీనుడై, సతతమపరాధియైనట్టి వాని దుడుకు సతులకై కొన్నాళ్లు, ఆస్తికై కొన్నాళ్లు, ధనతతులకై కొన్నాళ్లు, తిరిగి శ్రమిస్తూ, పరస్త్రీలను, నీచ స్త్రీలను కామించి అనుభవించి, శ్రీహరిపదాబ్జభజన మరచి, సకలభూతలములయందూ తానైయున్న ఆ దేవుని తన మదిలో మాత్రమే లేకుండ చేసుకున్న దుడుకు ఈ రీతిగ అనేక రకముల దుడుకులు గల ‘తన్ను’ నికృష్ణుని, ‘బ్రోచే దొరకాడు’ వారసత్వపు ప్రభుత్వంగల వాడెవ్వడూ అని ప్పచ్ఛ చేస్తారు. ఈ ప్రశ్నకు జవాబు ఈ పాటలో లేదు. కాని నాలుగువ పంచరత్న కీర్తన, ఆరభిరాగంలో ‘‘సాధించెనే మనసా’’ అనే కృతిలో సంతరించారు త్యాగరాజస్వామి. ఈ గౌళ కీర్తన యొక్క ప్రయోజనం అంతముఖ్యమైన ప్రశ్నను రేకెత్తించడమే. త్యాగరాజు స్వకీయనిందమాత్రం కాదు. ఆ పరమ భాగవతుడు తన్నంతగా కించపరచుకుని తిట్టుకోవడం సమంజసమూ కాదు. అటువంటి దుడుకాయనకున్నదనడం సత్యమూ కాదు. స్వామివారి సత్ప్రవర్తనా, పవిత్ర జీవినమూ అందరూ ఎరిగినవే. వేరొకచోట స్వామివారు త్యాగరాజప్తునిగా శ్రీరాముణ్ణి పొగడడం నారదమౌని తపస్సుకే ఫలపరమావధి అన్నట్టు చెప్పారు. త్యాగరాజు శబ్దం శివునికి కూడా వర్తించినా కృతులలో అది తన సంతకమే, తను రచించిన విషయాన్ని సూచించే సంకేతమే అవుతుంది. ‘‘త్యాగరాజాప్తయని పొగడ నారదమౌని తపమేమి చేసెనో’’ అని యదుకులకాంభోజిలో అనేసి తనపై తనకున్న ఆత్మ విశ్వాసాన్ని ప్రకటితం చేశారు. కనుక ఈ గౌళరాగకృతిలోని ‘‘దుడుకు మానిసి’’ త్యాగరాజస్వామి మాత్రం కాకూడదు. ఆ పాట నేను పాడుకుంటే ఆ ‘నన్ను’ నాకే చెంది ఆ దుడుకుగల మనిషిని, కొన్ని దుడకులేనా ఉన్న మనిషిని నేనే అవుతాను. అంచేత ఆ పాట పాడుకునే జిజ్ఞాసువులకు ఆ మాట చెందుతుంది. ఇక పాటలోని ప్రతిపాదనా, ప్రశ్నా జనసామాన్యానికి అన్వయించుకుంటే, అంత హైన్యస్థితికి దిగజారిన వారికి మోక్షం ఎలాగా అనే సామాన్య ప్రశ్నా, దానికి జవాబూ దొరుకుతాయి. తానెంత దైన్యస్థితికి దిగజారినా, ఎంతు బరువు బ్రతుకు గడుపుతున్నా, ఎంత నికృష్టుడైనా ఏ మానవుడు నైరాశ్యత చెందరవసరంలేదనీ, బ్రోచి రక్షించే దొరకొడుకు ఎవరు అని వెతుక్కుంటే దొరకుతాడనీ వ్యంగ్యంగా సూచించారు గురూత్తములైన త్యాగరాజస్వామి. ‘జగదానందకారక’ లోని శరణాగత జనపాలకుడూ, ‘కనకన రుచిరా’ లోని పరమదయాకర, కరుణాకరసవరుణాలయుడూ అయిన జానకీ ప్రాణనాయకుడే ఆ దొరకొడుకు! దశరధ దొరకొడుకు – దాశరధి! ‘‘సాధించెనే మనసా’’లో ఆ దొరకొడుకైన దాశరధి, త్యాగరాజనుతుడు. తన భక్తుని చెంతరాకనే, అమరికగా నాతని పూజగొని, సమయానికి తగు మాటలాడి, సౌఖ్యపు బ్రతుకు గడపడానికి ప్రయోజనకారకములయ్యే వ్వహార సూత్రాలు నిర్ధేశిస్తాడు. ఆ భగవంతుడు ముచ్చటగా మూడే సూత్రాలు చెప్పాడు: అలుగవద్దు, అన్నాడు విముఖులతో చేరబోకు, అన్నాడు వెతగలిగితే తాళుకొమ్ము, అన్నాడు రఘుకులేశుడైన రామచంద్రుడు, స్వప్రకాశుడైన శ్రీవేంకటేశుడు వేడుకున్నా తన్నుబ్రోవక, ఈ మూడు సూత్రాలు పలికి తిరిగిపోయినాడన్నారు. పరమభక్తవత్సలుడని, కలబాధల దీర్చువాడని, ఒక అభయహస్తముద్రతో తన్ను తిన్నగా మోక్ష స్థితికే చేర్చివేస్తాడనుకొని వేడుకుంటే, దగ్గరకైన రాకుండానే, దూరాన్నే నిలిచి, ఈ ప్రకారంగా నడచుకొమ్మని ఉపదేశించి చక్కా పోయినట్లు చెప్పి, చమత్కారంతో విశేష ప్రయోజనం సాధించారు. దేశికోత్తములైన త్యాగరాజస్వామి! ఏ ఆచార్యుడైనా జీవిత క్రమానికి సంబంధించిన నిబంధనలు వక్కాణించి చెప్పితే, అవి సామాన్యంగా శిష్యుల మనస్సులకెక్కవు. కాని త్యాగరాజస్వామి వంటి సద్భక్తుడు, తనకు, ఆ పరబ్రహ్మమైన శ్రీవేంకటేశుడే అయీ నిబంధనలని సూచించాడని చెప్పుతూ ఉంటే, ఆ పరదైవాన్ని ప్రత్యక్షదైవంగా ఎంచుకునే కలియుగ మానవులు ఆ మాటలపై నమ్మకమూ, స్వామివారిలో గురుత్వమూ కుదుర్చుకొనకుండా ఎలా ఉండగలరూ? తాను చెప్పదల్చుకున్న పాఠాన్ని పరోక్షంగా, అందులోనూ ఆ పరమాత్మ నోటితోనే చెపన్పించడం త్యాగరాజస్వామి వారి నేర్పరితనం. ‘‘శాంతము లేక సౌఖ్యము లేదు’’ అని వేరొకచోట తానై వితర్కించుకొన్న త్యాగరాజస్వామి ఈ పంచరత్న కృతిలో, ‘అలుగవద్దు’ అని దేవదేవుని చేతనే (మళ్లీ) చెప్పించారు. ఈ పాటలో ఇంకొక చమత్కారం ఏమిటంటే, ఆ చెప్పిన పరమాత్ముడు, సమయానికి తగరుమాటలాడినవాడూ, మామూలుగా తాను పూజించి, మనస్సులో దర్శించి పరవశం చెందే జానకీ ప్రాణనాయకుడుకాదు –రుక్మిణీ ప్రాణేశుడు! రంగేశుడూ, సద్గంగా జనేకుడూ, సంగీత సాంప్రదాయకుడూ అయిన శ్రీ కృష్ణుడు ఆ శ్రీకృష్ణుడైనా, తానూ ఇంకా మిగిలిన భక్తులై ఈ వరలో సందర్శించిన మూర్తి. ‘‘అలివేణువెల్ల దృష్టిచుట్టి వేయుడు, మ్రొక్కే వేణుగానలోలుడు కాడు – రాసక్రీడలాడే యువకుడుకాడు – పెంకెగోపాలుడు. గోపీజన మనోరధ మొసంగలేకనే గేలియజేసెడివాడు, పుట్టిన మరుగడియనుండీ వారికి గాక పరులవాడై దేవకీ వసుదేవుల ‘‘నేచిన’’ వాడు, నిజతనయుడను భ్రాంతితో యశోద ముదంబునను ముద్దుబెట్ట (ఆవిడ మాయామోహత్వానికి) నవ్వుచుండు హరి, వనితల సదా సొక్క చేయుడు, అందులకై తనకు మ్రొక్కించుకునే గడుసిరి, ‘అలుగవద్దు’ అని తనకు బోధించిన సన్మార్గ వచనములను (తానే) బొంకుజేసి తాపట్టిన పట్టు (దూరాన్నుంచి కబుర్లు చెప్పడమేగాని, దగ్గరకొచ్చి, లాలించి ప్రేమించి మోక్షమీయని పెంకెపట్టు – తానే కోపించినాడా అన్నట్టు) అలాంటి పట్టును ‘‘సాధించెనే’’ అంటారు త్యాగరాజస్వామి! ఆ మాటను పల్లవిలోనే అని మళ్లీమళ్లీ అనుకుంటారు! ఇటువంటి విరుద్ధ ప్రవృత్తితో పరమాత్ముడు తనకు ప్రత్యక్షమయ్యాడన్నారు. తాను కోని పూచించుకునే ఇష్టదైవం వేరు – ఉరమున ముత్యపుసరులచయముతో, కరమున శరకోదండకాంతితో, రుక్కలరాయని గేరుమోముగల సుదతి సీతమ్మ, సౌమిత్రి ఇరుప్రక్కల నిలబడి సేవించే ఆ వనజనయనుడు కాడు! ఆ స్థానంలో ఈ గోపాలుని నిలుపుకొనడంలో త్యాగరాజస్వామి వారందించే పాఠం ఏమిటో మనం ఊహించుకోవాలి. ఆశించిన ఫలం అదే రూపంలో అందకపోతే క్రుంగిపోకూడదు అనే పాఠాన్ని అందించారా? కావాలన్నప్పుడూ, అనుకొన్న రూపంలో దేవుడు దొరకకపోవచ్చుననీ, ఇంకో రూపంలో ప్రత్యక్షం కావచ్చుననీ, స్వర్గానికి నిచ్చెనగా దేవతామూర్తి నుపయోగించుకోబోతే, పెంకె గోపాలునిమూర్తిలో ప్రధానోపాధ్యాయుని లాగా, జాగ్రత్తగా మసలుకొమ్మని పాఠాలు చెప్పవచ్చుననీ, అయినా ఆ బోధనే మహా ప్రసాదమని స్వీకరించానీ, అలాంటి సత్ప్రవర్తన వల్లనే విముక్తి దొరుకుతుందనీ చెప్పడమే త్యాగరాజుల వారి తాత్పర్యమేమోననిపిస్తుంది. ఇంకొక ఆలోచన అతుల శౌర్య విభాసియైన పార్ధుని కనిమొనలో సారధ్యమొనరించి, అతడు విషాదయోగగ్రస్తుడై యుండగా, కర్తవ్యము నుపదేశించిన దేశికమూరి, జగత్తుకు గీతామృతమును ప్రసాదించిన జగద్గురువు, ఆ శ్రీకృష్ణుడు గనుక, గీతాబోధను గుర్తులో నుంచుకొని, తన రామునిచే పాఠాలు చెప్పించక, ఆచార్య స్థానంలో ఆ కృష్ణుని నిలబెట్టడం సమంజసమే అనిపిస్తుంది. ఏదిఏమైనా, సుశీలమే ఆవశ్య కర్తవ్యమని, త్రిసూత్రాత్మకమైన గురు బోధను అందించింది ఈ ఆరభి రాగపుటమోఘ కీర్తన! (సేకరణ: యువభారతివారి త్యాగరాజస్వామి కవితా వైభవము నుంచి) తేటగీతి
మునుపు వరాహ సమూహము లనిశము వర్తించుచోట నా హరి కిటియై నెనవుగ నిల్చిన కతమున ననఘ! వరాహాద్రిపేర నా నగమొప్పన్. (శ్రీ వేంకటాచల మహాత్మ్యము) శ్వేతవరాహావతారమెత్తి హిరణ్యాక్షుని సంహరించిన పిదప భూలోకంలో ఈ తిరుమల కొండనే నివాసంగా నేర్పర్చుకుని శ్రీహరి నివసించాడని బ్రహ్మాండపురాణం మనకు తెలుపుతోంది. అందువల్లే ఈ క్షేత్రం ‘ఆదివరాహ క్షేత్రం’ అనీ, ‘శ్వేతవరాహ క్షేత్ర’ మని, భూదేవితో కల్సి ఇక్కడ విహరిస్తున్నందున్న ‘భూవరాహ క్షేత్ర’ మని ప్రసిద్ధికెక్కింది. ఇప్పటికీ స్వామిపుష్కరిణికి వాయువ్యదిశలో లక్ష్మీసమేతుడై శ్వేతవరాహుడు విరాజిల్లుతున్నాడు. వరాహ దర్శనా త్పూర్యం శ్రీనివాసం నమేన్న చ దర్శనా త్ప్రా గ్వరాహస్య శ్రీనివాసూ న తృప్యతి. క్షేత్రసాంప్రదాయం ప్రకారం శ్వేతవరాహస్వామిని దర్శించకుండా వేంకటేశ్వరుని దర్శించరు. కాలక్రమేణా ఈ సాంప్రదాయాన్ని భక్తుల పూర్తిగా విస్మరిస్తున్నారు. శ్రీనివాసుడు ఈ క్షేత్రంలో నివసించగోరి, ఆలయ నిర్మాణానికి 100 అడుగులచోటును వరాహస్వామి వద్ద నుంచి యాచించి పుచ్చుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. అందుకు ప్రతిఫలంగా, ప్రథమ పూజ, ప్రథమ దర్శనం, ప్రథమ నైవేద్యం వరాహస్వామికే దక్కేటట్టు శ్రీనివాసుడు వరాలచ్చినట్టు ప్రతీతి. నేటికి ఈ సాంప్రదాయం ప్రకారమే తొలిపూజ, తొలి నైవేద్యం శ్వేతవరాహస్వామికే జరుపబడతాయి. అంతేకాక, బ్రహ్మోత్సవ చివరిరోజు స్వామివారు భూదేవి, శ్రీదేవిలతో కలసి ఇక్కడకి విచ్చేసి పూజలందుకుంటాడు. ‘మహావరాహో గోవిందః’ అనే విష్ణు సహస్రనామం ఈ పురాణగాథను తెలుపుతుంది. గో అనగా భూమి, వింద అనగా పొందినవాడు. వరాహస్వామి నుండి భూమిని పొందినవాడు వేంకటేశ్వరుడే! అన్న స్మృతి మనకు గోవిందా అన్న నామం స్మరించిన ప్రతిసారీ కలగకమానదు. ఆ వరాహస్వామి ఆలయానికి ఎదురుగా కోనేటికి ఆవలివైపు నమస్కార భంగిమలో ఆంజనేయస్వామి ఆలయం ఉంది. దీనిని వ్యాసరాయలవారు ప్రతిష్టించారని ప్రతీతి. తిరుమల కొండకు నడిచే వెళ్లే మార్గంలో దాదాపు 30 అడుగులు గల ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం భక్తులకు అల్లంత దూరం నుంచే చేరుకున్నారు వేంకటగిరని చాటి చెపుతుంది. అన్నమయ్య మాటలలో చెప్పాలంటే, ఆకాసమంతయ నిండి యవలికిఁదోఁక చాఁచి పైకొని పాతాళానఁ బాదాలు మోపి కైకొని దశదిక్కులు కరములఁ గబళించి సాకారము చూపినాడిచ్చడ హనుమంతుడు గరిమ రవిచంద్రులు కర్ణకుండలములుగా ధరణి మేరు కటితటము గాఁగా ఇరవుగా శ్రీవేంకటేశుని సేవకుఁడై బెరసె నిచ్చట నిదె పెద్ద హనుమంతుడు. ఆంజనేయునికి తిరుమల కొండకు అవినాభావ సంబంధం ఉన్నట్టుగా తోస్తుంది. బ్రహ్మాండ పురాణంలో ఇందుకు తగిన దివ్యగాథ కూడా ఉంది. మతంగముని ఆదేశంతో వేంకటాచలంపై ఆకాశగంగ తీర్ధావరణలో తపస్సుచేసి అంజనాదేవి వాయుపుత్రునికి జన్మనిచ్చింది. అందుకే ఈ గిరి అంజనాద్రిగా పేరొందింది. మాతృశ్రీ తరిగిండ వేంగమాంబ తన వేంకటేశ్వర మాహాత్మ్యంలో ఇదే గాథను అద్భుతంగా వర్ణించింది. అంజనాదేవి తపము మున్నచట జేసి పొసగ హనుమంతుడను వరపుత్రుంగాంచె నపుడు దేవతలెల్ల సహాయు లగుచు నా గిరికి నంజనాద్రి పే రమర నిడిరి. ఈ క్షేత్ర మహిమను అన్నమయ్య తన కీర్తనలో ఈ కిందివిధంగా కొనియాడాడు. సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ వుర్వి దపసులే తరువులై నిలిచిన కొండ పూర్వపు టంజనాద్రి యీ పొడవాడి కొండ. ప్రసన్నాంజనేయుడు, కోనేటి ఆంజనేయునితోపాటు శ్రీవారి ఆలయానికి ఎదురుగా సన్నిధి వీధిలో బేడి ఆంజనేయస్వామి కోవెల ఉంది. చేతికి, కాళ్లకు బేడీలతో స్వామివారికి అంజలి ఘటిస్తుండే ఈ మూర్తి వెనకాల కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. పొదలు సొంపగు నింపుల పూబొదలు వాసన నదులూ మొదలూగల తామర కొలంకులపై మెదలు తుమ్మెదలూ కదలి మలయానిలు వలపుల పస కదళీ వనములనూ మొదలుగా నెల్లప్పుడు నీ సంపదలు గల మా కొండా|| ఎల్లప్పుడు పచ్చని చెట్లతో, పరిమళ ఝరులతో, పూదోటలతో, తుమ్మెదల ఝూంకారాలతో, అరటి తోటలతో శోభిల్లే అంజనాద్రిపై ఆ అంజనాసుతుడు ఊరక ఉండమంటే ఉంటాడా? అల్లరి, చిల్లరగా చిలిపి పనులతో విసిగిస్తున్న హనుమంతుని కాళ్లకు చేతులకు బేడీలు తగిలించి ఆ వేంకటేశ్వరుని ముందు కదలకుండా అంజనాదేవి నిలబెట్టిందట. సార్ధక నామధేయుడై అప్పటినుండి వేంకటేశ్వరుని చేరువలో కొలువై ప్రతి ఆదివారం పంచామృతాభిషేకాలను, పూజా నివేదనాదులను పొందుతూ స్వామివారి కనుసన్నలలో మెదులుతూ భక్తులకు తృప్తిని కల్గిస్తున్నాడు. అందిరిలోనా నెక్కుడు హనుమంతుడు కందువ మతంగగిరికాడి హనుమంతుడు కనకకుండలాలతో కౌపీనముతోడ జనియించినాడు యీ హనుమంతుడు ఘన ప్రతాపముతోడ కఠినహస్తాలతోడ పెనుతోక యెత్తినాడు పెద్దహనుమంతుడు తివిరి జలధిదాటి దీపించి లంకయెల్లా అవలయివల నేసె హనుమంతుడు వివరించి సీతకు విశ్వరూపము చూపుతూ ధ్రువమండలము మోచె దొడ్డ హనుమంతుడు తిరమైన మహిమతో దివ్యతేజముతోడ అరసి దాసులగాచీ హనుమంతుడు పరగ శ్రీ వేంకటేశుబంటై సేవింపుచు వరములిచ్చీ బొడవాటి హనుమంతుడు. అంజనాచలమే నివాసమైన ఏలిక ఒకరు కాగా, అంజలి ఘటిస్తూ మక్కువతో బంటువైన ఘనుండు మరొకడు. ఇదే అభిప్రాయాన్ని అన్నమయ్య మరొక కీర్తనలో వెలిబుచ్చాడు. అంజనాచలము మీద నతండు శ్రీ వేంకటేశుఁ డంజనీ తనయుఁడాయ ననిలజుఁడు కంజాప్తకుల రామఘనుడు దానును దయా పుంజమాయ మంగాంబుధి హనుమంతుఁడు. అందుకేనేమో అన్నమయ్య కూడా ఆ పెద్దహనుమంతునికి తన సంకీర్తనలలో పెద్దపీటవేశారు. మతంగ పర్వతామాడ మాల్యవంతము నీడ అతిశయిల్లిన పెద్ద హనుమంతుడు ఇతడా యీతడా రాముని బంటు యీతడా వాయు సుతుడు ఆతతబలాడ్యూడందు రాతడితడా సీతను వెదకి వచ్చి చెప్పిన యాతడితడా ఘాతల లంకలోని రాక్షస వైరి యితడా ఆంజనాసుతడితడా అక్షమర్ధనుడితడా సంజీవిని కొండ దెచ్చే సారె నితడా భంజిన్‌చె గాలనేమిని పంతమున నితడా రంజితప్రతాప కపిరాజ సఖుడితడా చిరంజీవి యీతడా జితేంద్రియుడితడా సురల కుపకారపుచుట్ట మీతడా నిరతి శ్రీ వేంకటాద్రీని విజనగరములో నరిది వరములిచ్చీ నందరికి నితడా అని ఒక కీర్తనలో కీర్తిస్తే, మరో చోట... పంతగాడు మిక్కిలి నీ పవనజుడు రంతుకెక్కె మతంగ పర్వత పవనజుడు వాలాయమై ఎంత భాగ్యవంతుడో దేవతలచే బాలుడై వరములందె పవనజుడు పాలజలనిధి దాటి పరగ సంజీవి దెచ్చి ఏలిక ముందర బెట్టే ఈ పవనజుడు అట్టి పవనుజుడుని, అదె చూడరయ్య పెద్ద హనుమంతుని గుదిగొని దేవతలు కొనియాడేరయ్య ఉదయాస్త శైలములు ఒక జంగగా చాచె అదివో ధృవమండల మందె శిరసు చదివె సూర్యుని వెంట సారె మొగము ద్రిప్పుచు ఎదుట యీతని మహిమ యేమని చెప్పేమయ్య, అంటూ, అరుదీ కపీంద్రుని యధిక ప్రతాపము, పదియారు వన్నెల బంగారు కాంతులతోడ పొదిలిన కలశాపుర హనుమంతుడు, త్రివిక్రమమూర్తియైన దేవునివలెనున్నాడు భువిసేవించే వారి పాలి పుణ్యఫల మీతడు తేరి మీద నీ రూపు తెచ్చి పెట్టి అర్జునుడు కౌరవుల గెలిచే సంగర భూమిని అని వేర్వేరు కీర్తనలలో కొనియాడాటంతోపాటు, ఆ శ్రీఆంజనేయుని, ప్రసన్నాంజనేయుని పవిత్ర ద్వాదశనామాలను ఈ కింది కీర్తనలో గానం చేసి భక్తులందరిని తరిపంచేశాడు. తలచరో జనులు యీతని పుణ్యనామములు సులభమునే సర్వశుభములు గలుగు హనుమంతుఁడు వాయుజుఁ డంజనాతనయుండు వనధిలంఘనశీలవై భవుఁడు దనుజాంతకుఁడు సంజీవనీశైల సాధకుఁడే ఘనుఁడగు కలశాపురహనుమంతుఁడు లంకాసాధకుఁడు లక్ష్మణప్రబోధకుఁడు శంకలేని సుగ్రీవసచివుఁడు పొంకపు రామునిబంటు భూమిజసంతోషదూత తెంకినేకలశాపురదేవహనుమంతుడు చటులార్జునసఖుఁడు జాతరూపవర్ణుఁడు ఇటమీఁద బ్రహ్మపట్టమేలేటివాఁడు నటన శ్రీ వేంకటేశునమ్మిన సేవకుఁడు పటు కలశాపురప్రాంత హనుమంతుడు. సౌమ్యశ్రీ రాళ్లభండి
శ్రీశేషశైల గరుడాచల వేంకటాద్రి నాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యామ్ ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ అచలం లేక అద్రి అంటే కొండ. శేషాచలం, గరుడాచలం, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి అనే ఏడు పర్వతశ్రేణుల మధ్య, దేవతలు, మునులు, సిద్ధులు, కిన్నర, కింపురుషాదులు విహరించే బంగారు పుడమిపై, ‘గతులన్ని ఖిలమైన కలియుగమందును, గతి యీతడే చూపె ఘనగురుదైవము’ గా ఆ అఖిలాండనాయకుడు సప్తగిరీశుడై వెలుగొందుతున్నాడు. భూలోక వైకుంఠంగా ప్రసిద్ధిపొందిన ఈ తిరుమలగిరి ఒక్కొక్కయుగంలో ఒక్కొక్కపేరుతో ప్రభవించింది కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలమ్ ద్వాపరే శేషశైలతే కలౌ శ్రీ వేంకటాచలమ్ నామాని యుగభేదేన శైలస్యాస్య భవంతి హి. కృతయుగంలో వృషాద్రని, త్రేతాయుగంలో అంజనాద్రని, ద్వాపరయుగంలో శేషాద్రని, కలియుగంలో వేంకటాద్రని ఈ దివ్య క్షేత్రం బాసిల్లుతోంది. ఇక్కడి ప్రతి పర్వతానికి ఒక విశిష్టత, ఒక పురాణగాథ ఉన్నాయి. ‘వేం’ అంటే పాపాలు ‘కటః’ అంటే దహించేది. చూచిన తోడనే మనలోని పాపాలను నశింపచేసే క్షేత్రమే వేంకటాద్రి. ఆదిశేషుడే తన పదివేలతలలపై మోస్తున్న క్రీడాద్రే ఈ శేషాచలము. అటువంటి భూలోక వైకుంఠాన్ని అన్నమయ్య తనివితీరా కీర్తించి గానం చేశాడు. కట్టెదురు వైకుంఠము కాణాచయిన కొండ తెట్టెలాయె మహిమలే తిరుమల కొండ || వేదములే శిలలై వెలసినదీ కొండ ఏదెస పుణ్యరాశులే ఏరులైనదీ కొండ గాదలి బ్రహ్మాదిలో కములకొనల కొండ శ్రీదేవుడుంటేటి శేషాద్రి ఈ కొండ || సర్వ దేవతలు మృగ జాతులై సంచరించే కొండ నిర్వహించే జలధులే నిట్టచఱులైన కొండ ఉర్వితపసులే తరువులై నిలిచిన కొండ పూర్వపుటంజనాద్రి యీ పొడవాటి కొండ || వరములు కొటారులై వక్కాణించి పెంచే కొండ పరగు లక్ష్మీకాంతు సో బనపుకొండ కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ సిరులైన దిదివో శ్రీ వేంకటపు కొండ || అంజనాదేవి తపఫలము వల్ల హనుమంతుడు పుట్టిన ఈ గిరి అంజనాద్రి అయితే, జ్ఞాన సంపదలను పెంపొందించే జ్ఞానాద్రై, వరాహమూర్తి ఆజ్ఞానుసారం గరుడు తీసుకొచ్చిన వేంకటాద్రి కావున గరుడాద్రి అయింది. ఇలా స్వామివారి లీలావిలాసాలకు నెలవై కోరిన కోరికలు తీర్చే చింతామణై వెలుగొందుతున్న హరినివాసాన్ని చూచి తరించమని అన్నమయ్య ఈ దిగువ కీర్తనందించాడు. అదివో అల్లదిగో శ్రీ హరివాసము పదివేల శేషుల పడగలమయము || అదె వెంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్యనివాస మఖిలమునులకు అదె చూడు డదెమ్రొక్కు డానందమయము || చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము || కైవల్య పదము వేం కటనగమదివో శ్రీవేంకటపతికి సిరలైనది భావింప సకల సంపదరూపమదివో పావనముల కెల్ల పావనమయము || మాతృశ్రీ తరిగొండ వేంకమాంబ ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యము’లో ఈ శ్రీనివాస పర్వతనామ ఔనిత్యాన్ని చాటుతూ, శ్రీని నురంబున నిడికొని శ్రీనారాయణుడు ప్రజకు సిరులిచ్చుచు నం దానందింపుచు నుండగ నానందాచల మనంగ నగ్గిరి యొప్పెన్ || అని ఈ పర్వతశ్రేణి ఆనందనియలంగా మారిన వృత్తాంతాన్ని వివరించింది. ‘వేం’ అనగా అమృతం, ‘కట’ అంటే ఐశ్వర్యం అని మరో అర్ధాన్ని కూడా తెలిపే వేంకటాచలం చూచినతోడనే ఇహపర సుఖాలతోపాటు ముక్తిని ప్రసాదిస్తుంది. సర్పాకారంలో అగుపించే ఈ శేషాద్రి శిఖర భాగాన (తల) శ్రీ వేంకటేశ్వరుడు (తిరుమల), మధ్యభాగాన (నడుము) శ్రీ నృసింహుడు (అహోబిలం), చివర భాగాన (తోక) శ్రీమల్లికార్జునుడు (శ్రీశైలం) వెలసి ఉన్నారని పురాణ గాథలు తెలుపుతున్నాయి. అనేక దివ్య తీర్థాలతో వెలుగొందుతున్న ఈ తీర్ధాచలంపై వక్షస్థలంలో వ్యూహాలక్ష్మిగా సాక్షాత్తు మహాలక్ష్మినే నిలుపుకున్న ‘కలౌః వేంకటనాయకుడు’ శరణన్నవారికి శరణిచ్చి రక్షిస్తూ ఆపదమొక్కులవాడని, గోవిందుడని సార్ధకనామధేయుడైయ్యాడు. ఇదే భావనను అన్నమయ్య తన కీర్తనలలో పదే, పదే పేర్కొని మనను చరితార్ధులను చేశాడు. మతంగపర్వతము మాలవంతము నడుమ సతమై శ్రీవేంకటేశ్వరుడున్నవాడు || కొలచినవారికెల్లా కోరినవరములిచ్చి తలచినవారినెల్లా ధన్యులజేసి పొలుపుమిగుల మంచిపువ్వలతోటనీడ విలసిల్లీనదివో శ్రీవేంకటేశ్వరుడు || శరణన్నవారికి చనవిచ్చి రక్షించి గరిమ బూచించువారి గరుణజూచి పరిపూర్ణమగు తుంగభద్రాతటమునందు విరివిగొన్నాడు శ్రీ వేంకటేశ్వరుడు || తను నమ్మినవారికి తగిన సంపదలిచ్చి కని నుతించేవిరికి కామధేనువై కనకమయములైన ఘనమైనమేడలలో వినుతికెక్కెను శ్రీ వేంకటేశ్వరుడు|| సౌమ్యశ్రీ రాళ్లభండి
సంగీతము యొక్క ఔనత్యమును గ్రహించి, పదుగురు సుళువుగా అభ్యసించడానికి మాయామాళవగౌళ రాగంలో స్వరావళులు మొదలు కీర్తనల వరకు రచనలు చేసిన సంగీతనిధి, కర్ణాటక సంగీత పితామహుడు పురందరదాసు. కన్నడ భాషలో విరివిగా రచనలు చేసిన పురందరదాసు నారదాంశమని ప్రతీతి. పురందరదాసు 1484వ సంవత్సరంలో బళ్లారి జిల్లాలోని హంపి దగ్గర గల పురందరగడ్ లో కమలాంబ, వరదప్పనాయక్ దంపతులకు జన్మించాడు. తిరుపతి వేంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల జన్మించిన కారణాన ఆయనకు శ్రీనివాసుడని తల్లితండ్రులు నామకరణం చేశారు. అయితే ముద్దుగా శీను, శీనప్ప, తిమ్మప్ప, తిరుమలయ్య అని కూడా పిలిచేవారు. ఆయనకు 16వ ఏట సరస్వతీబాయితో వివాహం జరిగింది. తండ్రి వజ్రాల వ్యాపారి కావటంతో సహజంగానే ఆ వ్యాపారం పట్ల పురందరదాసుకు ఆసక్తి ఏర్పడింది. అయితే పిన్న వయస్సులోనే పురందరదాసు సంస్కృత, కన్నడ భాషలలో మేటి అన్పించుకోవడమేకాక సంగీతాన్ని కూడా ఔపోసన పట్టాడు. చిన్నతనంలోనే తల్లితండ్రులు మరణించటంతో వ్యాపారంలో రాటుదేలిన పురందరదాసుని సహ వ్యాపారులు నవకోటి నారాయణ అని పిలిచేవారు. ఈ నవకోటి నారాయణ, పురందరదాసుగా పరివర్తన చెందడానికి సంబంధించి చరిత్రకారులు ఒక కథని ఊటంకిస్తారు. ఒకనాడు శీనివాసనాయక్ వద్దకు ఆ వేంకటేశ్వరుడు ఒక పేద బ్రాహ్మణుని రూపంలో వచ్చి తన కుమారుని ఉపనయనం చేయడానికి సహాయాన్ని అర్ధించాడు. ఏ సహాయమూ చేయడానికి యిష్టపడని శ్రీనివాస నాయకడు స్వామిని రేపు, మాపు రమ్మని తిప్పించుకుని ఒక చెల్లని కాసును యిచ్చి వెళ్లమన్నాడు. శ్రీహరి చిద్విలాసంగా నవ్వుకుని శ్రీనివాస నాయకుని భార్య సరస్వతీబాయి దగ్గరికి వెళ్లి తన గోడు చెప్పుకున్నాడు. సహజంగానే జాలి గుండె గల ఆ యిల్లాలు తన ముక్కెర తీసి ఆ బ్రాహ్మణుడికి దానం చేసింది. అదే మహద్భాగ్యమని ఆ బ్రాహ్మణుడు ఆమె ముక్కెరను అమ్మి సోమ్ము చేసుకోవడానికి సరాసరి శ్రీనివాస నాయకుని దగ్గరికే వెళ్ళతాడు. శ్రీనివాస నాయకడు ఆ ముక్కెర తన భార్యదేనని గ్రహించి బ్రాహ్మణుడిని కాస్త ఆగమని చెప్పి యింటికి వెళ్ళి ముక్కెర ఎక్కడని భార్యను నిలదీసి అడిగాడు. సరస్వతీబాయికి ఏమి చేయాలో తోచలేదు. దేవుడి గదిలో పెట్టానని, తీసుకు వస్తానని చెప్పి పూజా మందిరంలోకి వెళ్ళి, చండశాసనుడైన భర్తను ఒప్పించడం, నమ్మించడం సాధ్యం కాదని గ్రహించి శ్రీ వెంకటేశ్వర స్వామిని తలచుకుని విషం త్రాగబోయింది. ఆశ్చర్యకరంగా విషపు గిన్నెలో ఆమెకు ముక్కెర కనపడింది. ఆమె పరమానందంతో ఆ గిన్నెలోని ముక్కెరను తీసి శుభ్రం చేసి తన భర్తకు అందించింది. ఆ ముక్కెరను చూచి శ్రీనివాస నాయకడు ఆశ్చర్యపోయి, భార్యను నిజం చెప్పమని ప్రాధేయపడ్డాడు. ఆమె చెప్పిన కథ విని నిర్ఘాంతపోయాడు. ఆ ఏడుకొండల వాడే తనకు కనువిప్పు కలిగించడానికి మారు వేషంలో వచ్చాడని గ్ర హించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు కోసం వెతకగా అతను కన్పించలేదు. జరిగినది గ్రహించిన నవ కోటి నారాయణుడు తన సర్వస్వం దానం చేసి భక్తిమార్గంలో పడ్డాడు. తనకు జ్ఙానోదయమైన ఆక్షణాన్నే శ్రీనివాసుడు అఠాణ రాగంలో “మోసహోదేనల్లో “అని మొదటి కీర్తన రచించారు. 1525లో వ్యాసరాయులవారు వీరిని హరిదాసులుగా ఆశీర్వదించి పురందరదాసు అనే పేరునిచ్చారు. నాటినుండి ఆయన భక్తిమార్గాన్ని అనుసరిస్తూ దాదాపు 4లక్షల 75వేల కీర్తనలను సంస్కృత, కన్నడ భాషలలో రచించారు. వీటిలో నేడు మనకు కేవలం వెయ్యి మాత్రమే లభ్యమయ్యాయి. కస్తూరి వాసనలతో ఘుమ, ఘుమలాడే కన్నడ భాషలో ఆయన చేసిన రచనలకు“దాసర పదగళు” లేక “దేవర నామగళు” అని పేరు. వీరి ముద్ర “పురందర విఠల”. వీరు సంగీత శిక్షణకు ఆరంభ రాగమైన మాయామాళవగౌళ రాగాన్ని అందించటంతో పాటు, స్వరావళులు, అలంకారాలు, పిళ్ళారి గీతాలు, ఘనరాగ గీతాలు రచించిన ఆది గురువు. పురందరదాసు రచనలలో చక్కని ఉపమానాలు, సామెతలు కల్గి, పురాణ, ఉపనిషత్తులలోని సారమంత నిగూఢమై ఉంటుంది. ఆయన దాదాపు 84 రాగాలను గుర్తించి రచనలు చేశారు. ద్విజావంతి, శ్యామకల్యాణి, మారవి, మధుమాధవి వంటి అపూర్వ రాగాలతో పాటు నేడు బహుళ ప్రాచుర్యంలో ఉన్న కళ్యాణి, వరాళి, తోడి, భైరవి, మరియు సావేరి వంటి రాగాల్లో కూడా ఆయన అనేక కీర్తనలు రచించారు. ఆయన రచనలలో శంకరాభరణ రాగంలో రాసిన జోజో శ్రీ కృష్ణ, తిరుపతి వేంకటేశ్వరునిపై రచించిన సింధుభైరవి రాగంలో వెంకటాచల నిలయం, ముఖారి రాగంలో శారదా స్తోత్రం,, మధ్యమావతి రాగంలో లక్ష్మీ స్తోత్రం, కాపీ రాగంలో జగదోద్ధారణ ఆడిసిదళె యశోద, నాటలో జయ, జయ, కళ్యాణ వసంతంలో ఇనుదయ బారడే, మధ్యమావతి, శ్రీ రాగంలో భాగ్యాదా లక్ష్మి బారమ్మా చాలా ప్రసిద్ధి చెందాయి. వీరికి వరదప్ప, గురురాయ, అభినవ, మధ్యపతి అను నలుగురు కుమారులు, రుక్మిణీబాయి అని ఒక కూతురు. వీరు తమ అవసాన దశలో సన్యసించి, హింపి సమీపంలో ఒక మంటపంలో నివసించారు. ఈ మంటపానికి పురందరదాసు మంటపం అని పేరు. పురందరదాసు తమ 80వ ఏట రక్తాక్షి సంవత్సరం పుష్య అమావాస్యనాడు (1564) పరమపదించారు. తేటగీతి