వాగ్గేయకారులు 2 పురందరదాసు

సంగీతము యొక్క ఔనత్యమును గ్రహించి, పదుగురు సుళువుగా అభ్యసించడానికి మాయామాళవగౌళ రాగంలో స్వరావళులు మొదలు కీర్తనల వరకు రచనలు చేసిన సంగీతనిధి, కర్ణాటక సంగీత పితామహుడు పురందరదాసు. కన్నడ భాషలో విరివిగా రచనలు చేసిన పురందరదాసు నారదాంశమని ప్రతీతి. పురందరదాసు 1484వ సంవత్సరంలో బళ్లారి జిల్లాలోని హంపి దగ్గర గల పురందరగడ్ లో కమలాంబ, వరదప్పనాయక్ దంపతులకు జన్మించాడు. తిరుపతి వేంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల జన్మించిన కారణాన ఆయనకు శ్రీనివాసుడని తల్లితండ్రులు నామకరణం చేశారు. అయితే ముద్దుగా శీను, శీనప్ప, తిమ్మప్ప, తిరుమలయ్య అని కూడా పిలిచేవారు. ఆయనకు 16వ ఏట సరస్వతీబాయితో వివాహం జరిగింది.

తండ్రి వజ్రాల వ్యాపారి కావటంతో సహజంగానే ఆ వ్యాపారం పట్ల పురందరదాసుకు ఆసక్తి ఏర్పడింది. అయితే పిన్న వయస్సులోనే పురందరదాసు సంస్కృత, కన్నడ భాషలలో మేటి అన్పించుకోవడమేకాక సంగీతాన్ని కూడా ఔపోసన పట్టాడు. చిన్నతనంలోనే తల్లితండ్రులు మరణించటంతో వ్యాపారంలో రాటుదేలిన పురందరదాసుని సహ వ్యాపారులు నవకోటి నారాయణ అని పిలిచేవారు. ఈ నవకోటి నారాయణ, పురందరదాసుగా పరివర్తన చెందడానికి సంబంధించి చరిత్రకారులు ఒక కథని ఊటంకిస్తారు.

ఒకనాడు శీనివాసనాయక్ వద్దకు ఆ వేంకటేశ్వరుడు ఒక పేద బ్రాహ్మణుని రూపంలో వచ్చి తన కుమారుని ఉపనయనం చేయడానికి సహాయాన్ని అర్ధించాడు. ఏ సహాయమూ చేయడానికి యిష్టపడని శ్రీనివాస నాయకడు స్వామిని రేపు, మాపు రమ్మని తిప్పించుకుని ఒక చెల్లని కాసును యిచ్చి వెళ్లమన్నాడు. శ్రీహరి చిద్విలాసంగా నవ్వుకుని శ్రీనివాస నాయకుని భార్య సరస్వతీబాయి దగ్గరికి వెళ్లి తన గోడు చెప్పుకున్నాడు. సహజంగానే జాలి గుండె గల ఆ యిల్లాలు తన ముక్కెర తీసి ఆ బ్రాహ్మణుడికి దానం చేసింది. అదే మహద్భాగ్యమని ఆ బ్రాహ్మణుడు ఆమె ముక్కెరను అమ్మి సోమ్ము చేసుకోవడానికి సరాసరి శ్రీనివాస నాయకుని దగ్గరికే వెళ్ళతాడు. శ్రీనివాస నాయకడు ఆ ముక్కెర తన భార్యదేనని గ్రహించి బ్రాహ్మణుడిని కాస్త ఆగమని చెప్పి యింటికి వెళ్ళి ముక్కెర ఎక్కడని భార్యను నిలదీసి అడిగాడు. సరస్వతీబాయికి ఏమి చేయాలో తోచలేదు. దేవుడి గదిలో పెట్టానని, తీసుకు వస్తానని చెప్పి పూజా మందిరంలోకి వెళ్ళి, చండశాసనుడైన భర్తను ఒప్పించడం, నమ్మించడం సాధ్యం కాదని గ్రహించి శ్రీ వెంకటేశ్వర స్వామిని తలచుకుని విషం త్రాగబోయింది. ఆశ్చర్యకరంగా విషపు గిన్నెలో ఆమెకు ముక్కెర కనపడింది. ఆమె పరమానందంతో ఆ గిన్నెలోని ముక్కెరను తీసి శుభ్రం చేసి తన భర్తకు అందించింది. ఆ ముక్కెరను చూచి శ్రీనివాస నాయకడు ఆశ్చర్యపోయి, భార్యను నిజం చెప్పమని ప్రాధేయపడ్డాడు. ఆమె చెప్పిన కథ విని నిర్ఘాంతపోయాడు. ఆ ఏడుకొండల వాడే తనకు కనువిప్పు కలిగించడానికి మారు వేషంలో వచ్చాడని గ్ర హించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు కోసం వెతకగా అతను కన్పించలేదు. జరిగినది గ్రహించిన నవ కోటి నారాయణుడు తన సర్వస్వం దానం చేసి భక్తిమార్గంలో పడ్డాడు.

తనకు జ్ఙానోదయమైన ఆక్షణాన్నే శ్రీనివాసుడు అఠాణ రాగంలో “మోసహోదేనల్లో “అని మొదటి కీర్తన రచించారు. 1525లో వ్యాసరాయులవారు వీరిని హరిదాసులుగా ఆశీర్వదించి పురందరదాసు అనే పేరునిచ్చారు. నాటినుండి ఆయన భక్తిమార్గాన్ని అనుసరిస్తూ దాదాపు 4లక్షల 75వేల కీర్తనలను సంస్కృత, కన్నడ భాషలలో రచించారు. వీటిలో నేడు మనకు కేవలం వెయ్యి మాత్రమే లభ్యమయ్యాయి. కస్తూరి వాసనలతో ఘుమ, ఘుమలాడే కన్నడ భాషలో ఆయన చేసిన రచనలకు“దాసర పదగళు” లేక “దేవర నామగళు” అని పేరు. వీరి ముద్ర “పురందర విఠల”. వీరు సంగీత శిక్షణకు ఆరంభ రాగమైన మాయామాళవగౌళ రాగాన్ని అందించటంతో పాటు, స్వరావళులు, అలంకారాలు, పిళ్ళారి గీతాలు, ఘనరాగ గీతాలు రచించిన ఆది గురువు. పురందరదాసు రచనలలో చక్కని ఉపమానాలు, సామెతలు కల్గి, పురాణ, ఉపనిషత్తులలోని సారమంత నిగూఢమై ఉంటుంది. ఆయన దాదాపు 84 రాగాలను గుర్తించి రచనలు చేశారు. ద్విజావంతి, శ్యామకల్యాణి, మారవి, మధుమాధవి వంటి అపూర్వ రాగాలతో పాటు నేడు బహుళ ప్రాచుర్యంలో ఉన్న కళ్యాణి, వరాళి, తోడి, భైరవి, మరియు సావేరి వంటి రాగాల్లో కూడా ఆయన అనేక కీర్తనలు రచించారు. ఆయన రచనలలో శంకరాభరణ రాగంలో రాసిన జోజో శ్రీ కృష్ణ, తిరుపతి వేంకటేశ్వరునిపై రచించిన సింధుభైరవి రాగంలో వెంకటాచల నిలయం, ముఖారి రాగంలో శారదా స్తోత్రం,, మధ్యమావతి రాగంలో లక్ష్మీ స్తోత్రం, కాపీ రాగంలో జగదోద్ధారణ ఆడిసిదళె యశోద, నాటలో జయ, జయ, కళ్యాణ వసంతంలో ఇనుదయ బారడే, మధ్యమావతి, శ్రీ రాగంలో భాగ్యాదా లక్ష్మి బారమ్మా చాలా ప్రసిద్ధి చెందాయి.

వీరికి వరదప్ప, గురురాయ, అభినవ, మధ్యపతి అను నలుగురు కుమారులు, రుక్మిణీబాయి అని ఒక కూతురు. వీరు తమ అవసాన దశలో సన్యసించి, హింపి సమీపంలో ఒక మంటపంలో నివసించారు. ఈ మంటపానికి పురందరదాసు మంటపం అని పేరు. పురందరదాసు తమ 80వ ఏట రక్తాక్షి సంవత్సరం పుష్య అమావాస్యనాడు (1564) పరమపదించారు.

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *