రాగ గీతిక 3 మలహరి, సావేరి రాగాలు (15వ మేళకర్త మాయామాళవగౌళ జన్యం )

మలహరి అనగా మలినం పోగొట్టునది అని అర్ధం. శుభప్రదమైన రాగం. ఇది ఔడవ,షాడవ ఉపాంగరాగం. ఈ రాగం స్వర స్థానాలు షడ్జమం, పంచమం కాక శుద్ధ రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, (స,రి,గ.మ,ప,ద,స / S R1 G3 M1 P D1 S). ఆరోహణ, అవరోహణలు: సరిమపదస, సదపమగరిస. దీనిని భక్తిరస ప్రధాన రాగంగా పేర్కొనవచ్చు. ఇది ప్రభాత రాగం. ఇందు మ,ప,దలు జీవ స్వరాలు.

ఈ రాగం గురించిన ప్రస్తావన సంగీతరత్నాకర, సంగీతమార్తాండ, రాగతాళ చింతామణి మొదలైన ప్రాచీన సంగీత పుస్తకాలందు మనకు కన్పిస్తుంది. ఇది పూర్వం వాడుకలో ఉన్నా ఇప్పుడు మరుగున పడిపోయింది. అయితే, ఈ రాగమందు కర్ణాటక సంగీతపితామహుడు పురందరదాసు అభ్యాసగానానికి అనువుగా నాలుగు పిళ్ళారి గీతాలు – శ్రీ గణనాథ, కుందగౌర, కెరయనీరను మరియు పదుమనాభా – రచించారు.

మలహరి రాగంలో ప్రసిద్ధ రచనలు:

1. పంచమాతాంగముఖ – ముత్తుస్వామి దీక్షితార్

2. అనంతపద్మనాభం – ముత్తయ్య భాగవతార్

3. ఇన్నిటిమూలంబీశ్వరుడాతని – అన్నమయ్య

మలహరి స్థానే నేడు సావేరి రాగం ప్రసిద్ధి చెందింది. ఈ రెండు రాగములకు అవరోహణ యందు నిషాదము మాత్రమే భేదము. ఈ రాగ ఆరోహణ, అవరోహణలు: సరిమపదస, సనిదపమగరిస. ఇది ఔడవ, సంపూర్ణరాగం. ఇందు రి,మ,దలు రాగా ఛాయా స్వరాలు. ఈ స్వరాలు సావేరి రాగ లక్షణాన్ని వెలికి తీస్తాయి. ఈ స్వరంలో మధ్యమానికున్న ప్రత్యేకత దృష్ఠ్యా దీనిని ‘సావేరి మధ్యమం’ అని కూడా పిలుస్తారు. ఇది కరుణ, శోకరసాలు పలికించే రాగం. సూర్యోదయ, సూర్యాస్తమయాలలో పాడుకోడానికి అనువైన రాగం.

సంగీత త్రిమూర్తులు ముగ్గురూ మొత్తం 28 రాగాలలో కనీసం ఒక కృతైనా రచించారు. ఆ రాగాలలో ఒకటి సావేరి రాగం. ఈ రాగంలో త్రిమూర్తులు ముగ్గురూ కలిసి 26 రచనలు చేశారు. అందు 19 కేవలం త్యాగరాజే చేశాడు. ఈ రాగాన్ని భాషాంగ రాగంగా సంగీత రత్నాకర పేర్కొంది. ‘‘కావేరి స్నానం, సావేరి రాగం’’గా బహుళ ప్రచారం చెందిన ఈ రాగం కర్ణాటక సంగీతంలోనే ప్రత్యేక స్థానాన్ని ఆపాదించుకుంది. ఎంతో ప్రాచీనమైన ఈ రాగ ప్రస్తావన సంగీత రత్నాకర, సంగీత సమయసారగౌడ మేళానికి జన్యరాగమని బృహధర్మ పురాణం పేర్కొంది. ఈ రాగం సాలంగనాథ మేళ జన్యమని, గౌళ మేళజన్యమని, మల్లారి జన్యమని కూడా ప్రచారంలో ఉంది.

సావేరి రాగంలో ప్రసిద్ధ రచనలు:

1. సరసుడా (వర్ణం) – వెంకటరామ అయ్యర్

2. శంకరి శంకురు, దురుసుగా కృప జూచి, జనని నతజనపరిపాలిని – శ్యామశాస్త్రి

3. ఆంజనేయ, పరిపాహి గణాధిప (నవరాత్రి కృతి) – స్వాతి తిరునాళ్

4. శ్రీ రాజగోపాల, కరికళభ ముఖం – ముత్తుస్వామి దీక్షితార్

5. పరాశక్తి మను, రామబాణ త్రాణ, తులసీ జగజ్జననీ – త్యాగరాజస్వామి

6. ఎంతనేర్చినా – పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్

7. శ్రీ కామకోఠి పీఠ – మైసూర్ సదాశివ బ్రహ్మం

8. మురుగా, మురుగా – పెరియస్వామి తూరన్

9. మెచ్చోనక రాగంబు – అన్నమయ్య

10. మాధవా మధుసూదన, హరియే సర్వోత్తమ – పురందరదాసు

11. సీతారామస్వామి, దినమే సుదినము – రామదాసు


సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *