నారద తుంబుర గర్వ భంగం

ఒకనాడు హనుమ శ్రీ రాముని పాదాల చెంత చేరి, నారద,తుంబురులను తమ గానాన్ని విన్పించమని కోరాడు. ఇద్దరు వీణెలు సారించారు. గమక యుక్తంగా అలంకారాలు, గీతాలు మధురంగా పలికించారు. స్వర సందర్భం, శ్రుతులు, ఆలాపన, గమకాలూ గీత సరణి, ముక్తాయింపు భలేగా, అమోఘంగా వున్నాయని హనుమ మెచ్చుకున్నాడు. ఇంతటి ఉద్దండ పండితుల గానంలో లోటుపాట్లను విమర్శించటం తనకు సాధ్యం కాదేమో అని సవినయంగా విన్నవించుకున్నాడు. తాను నేర్చిన కొన్ని గీతాలను సీతా రాములకు వినిపిస్తానని, వారిద్దరిని కూడా వినమని హనుమ ప్రార్ధించాడు.

తమ గానాన్ని అంతగా మెచ్చిన హనుమ తన గానాన్ని వినమనటంలో అర్ధమేమిటో నారద, తుంబురలకు అర్ధం కాలేదు. ”కోతులు సంగీత సభ చేస్తే కొండముచ్చు అగ్రాసనం మీద కూర్చున్నట్లు ఉంటుంది హనుమ గానమని”, ఎగతాళి చేశారు. అంత గొప్ప సంగీతాన్ని తాము వినిపిస్తే, ఇంకా హనుమకు ఏం మిగిలింది విని పించాటానికి అని విసుక్కున్నారు. తమ గానం ముందు ఇంకెవరి గానమైనా బలాదూరే అని వారి గర్వం. రామ సన్నిధానంలో ఏమీ చేయడానికి పాలుపోక తమ,తమ వీణలను హనుమకు అందించారు. నారదుని వీణను తీసుకొని హనుమ ఓంకారం పలికించాడు.

ఓంకారం త్రిగునాత్మకము, త్రి మూర్త్యాత్మకము దీనినే ప్రణవం అంటారు. ఇందులో అ, ఉ, మ ఉన్నాయి. ఆకారం రజో గుణాత్మకం -బ్రహ్మ. ఉ కారం సత్వ గుణాత్మకం -విష్ణువు. మ కారం తమో గుణాత్మకం -రుద్రుడు. అ కారం ఎడమ నాసిక పుట -ఇడ. ఉ కారం కుడి నాసా పుట. పింగళ. మ కారం వాటి మధ్య లో వున్న సుషుమ్న. ఈ విధం గా ఓంకారం మూడు నాడుల సమాహారం. ఇడా నాడి-చంద్రుడు. పింగళ నాడి -సూర్యుడు .

సుషుమ్న నాడియే అగ్ని. ఈ విధం గా ఓంకారం త్రయాగ్న మైంది. ఓంకారంలో దశ విధ నాదాలు జన్మించాయి. నాభి, ఉదర, కంత, స్ధానాలు వాటి ఉత్పత్తి స్థానాలు. ఆ నాదాలే వాయు చలనం వల్ల హృదయ, కంత, శిరః స్ధానాల నుండి అభి వ్యక్తమై, మందార, మధ్యమ, తారకం అనే మూడు స్వర భేదాలను పొందాయి.

ఆ స్వరాల నుండి ” స,రి ,గ ,మ ,ప ,ద ,ని ” అనే సప్త స్వరాలు క్రమంగా శివుని యొక్క ”పరమశివ, ఈశ్వర, సద్యోజాత, వామ దేవ, అఘోర, తత్పురుష, ఈశాన” అనే ఏడు ముఖాల నుండి పుట్టి, ”షడ్జ, రిషభ, గాంధార, మధ్యమ, పంచమ, దైవత, నిషాద ”అన బడే పేర్లతో వ్యాప్తి చెందాయి. వాటి జన్మ స్థానాలు క్రమంగా కంత, శిర, నాస, హృదయ, ముఖ, నాలుక, పూర్వాంగాలు. మయూర,రిషభ, అజ, సింహ,కోకిల, అశ్వ, మదగజ ధ్వనులే షడ్జం మొదలైన స్వర ధ్వని భేదాలు.

షడ్జ స్వరం నుంచి నాలుగు శ్రుతులు, రిషభం నుంచి మూడు, గాంధారం నుండి రెండు, మధ్యమ నుంచి నాలుగు, పంచమం నుండి నాలుగు దైవతం నుంచి మూడు, నిషాదం నుంచి రెండు – సప్త స్వరాలనుండి ఇరవై రెండు శృతి భేదాలు ఏర్పడ్డాయి. ఈ శ్రుతులకు ఇరవై రెండు శృతి గమకాలూ, ఏడు దేశీ గమకాలున్నాయి. ఈ స్వర శృతి గమకాలలో ఆరు లక్షణాలు గల గీతాలు, ఆ రాగాలకు గ్రామ త్రయం, దాని వల్ల పదిహేను రాగాలు -వాటికి ఆరు జాతులు, వాటికి ముప్ఫై ఆరు రాగాలు, – వాటికి నాలుగు అంగాలు, వాటికి నూటఆరు రాగాలు పుట్టి అనంత కోటి రాగాలుగా విస్త రించింది. ఇన్నిటిలో ముప్ఫై రెండు రాగాలు మాత్రమే లోకంలో ప్రసిద్ధ మైనవి.

వాద్యాలలో తథా, ఆనద్ధ, సుషిర, ఘన అనే నాలుగు వున్నాయి. కాహల, పటహ, శంఖ, భేరి జయ, ఘంటికలు అనేవి అయిదు మహా వాద్యాలు. వీణా మొదలైనవి ఇరవై రెండు రకాలు. త కారం రుద్రుడు. ల కారం పార్వతి. ఆ రెండిటి సంపుటినే తాళం అంటారు. తాళానికి కాల, మార్గ, క్రియ, అంగ, జాతి, గ్రహ కళ, లయ, యతి, ప్రస్తారం అనేవి పది ప్రాణాలు.

హనుమ భరత శాస్త్రంలో కూడా నిష్ణాతుడు. ప్రవర్త కుడు, దర్శన కారుడు కూడా. భ అంటే భావం. ర అంటే రాగం. త అంటే తాళం. భావ ,రాగ ,తాళాలు అంటే సాహిత్య, సంగీత, నాట్యాల ఉపయోగం ఇందులో వుంది కనుక ”భరతం” అని పేరు వచ్చింది. రసాలు, భావాలు, అభినయాలు, ధర్ములు, వృత్తులు, ప్రవృత్తులు, సిద్ధులు, స్వరాలు, ఆతోద్యమములు, గానాలు, రంగాలు అనే పద కొండు విషయాల స్వరూపమే ”నాట్య వేదం ”. అలాంటినాట్య వేదానికి ప్రవర్తకుడు హనుమయే.

గాన్ధర్వాన్ని సూర్యుని నుంచి హనుమ నేర్చుకొన్నాడు. శ్రీ రాముని కొలువులో తన గాంధర్వ విద్యను మనో ధర్మంగా అమోఘంగా ప్రదర్శించాడు హనుమ. ఆ గానానికి హృదయాలు పద్మాల్లా వికశించాయి. చంద్ర కాంత శిలలు కరిగాయి. మ్రోడులు చిగిర్చాయి. లోకం సమ్మెహ మైంది. అతని వల్లకీ (వీణ) వాద్యానికి రాళ్ళే కరిగి పోయాయి. సభాసదులు పరవశించి పోయారు. బొమ్మల్లా అచేతను లైనారు.

వీణ పై హనుమ” మేఘ రంజని ”రాగాన్ని సమ్మోహనం గా విని పించాడు. అతను ప్రదర్శించిన మెళకువలు, ప్రౌఢిమ, రాగాలాపన, గ్రామ స్ఫూర్తి, తారలో అంతర స్ఫురిత నాద ప్రౌఢి, మీటు, కంపితం, ఆన్దోలితం, మూర్చన, శ్రుతులు, డాలు, అనేక మైన తాళ మానాలు విని జనం మైమరచి పోయారు. ఆకాశం మేఘాలతో నిండి పోయింది. కొంగలు బారులు తీరాయి. చాతక పక్షులు నోళ్ళు తెరిచి ఆకాశం వైపు చూశాయి. నీటి చుక్క కోసం నెమళ్లు పురి విప్పి నాట్యం చేశాయి. పాతాళం లోని పాములు పడగ లెత్తి నర్తించాయి. వర్షం పుష్ప వర్షంగా కురిసింది. సభ్యుల దివ్య ఆభరణాలన్నీ కరిగి పోయాయి. శశి కాంత వేదికలు కరిగి శ్రవించాయి. దంతపు బొమ్మలకు ప్రాణాలు వచ్చాయి. హనుమ గానం చేస్తున్నంత సేపు శ్రీ రాముడు మెచ్చికోలుగా ”ఓహ్, ఔరా, భళా, మజ్జ్హారే, బాపురే ”అని అభినందిస్తూనే వున్నాడు. హనుమ వీణా నాదానికి దగ్గర లో వున్న పెద్ద రాయి కరిగి పోయింది. సభలోని వారంతా ఆశ్చర్యంతో ముక్కున వేలు వేసుకున్నారు.

నారద ,తుంబురుల తాళపు చిప్పలు తీసుకొని హనుమ ”గుండా క్రియ ”రాగాన్నివీణా పై పలికించాడు. మళ్ళీ ఆ రాయి కఠిన శిలగా మారి పోయింది. తన చేతి లోని వీణను నారదునికి ఇచ్చి ఆ రాయిని మళ్ళీ కరిగించ గలవాడే విద్యా ధికుడని, ఈ తాళాలను తీసుకోవాటానికి అర్హుడు అని చెప్పాడు. నారద, తుంబురులిద్దరు విశ్వ ప్రయత్నం చేశారు. రాయి కరగ లేదు. వీణలను నెలపై పెట్టి తలలు వంచుకొని అహంకారం పోగొట్టుకొని సిగ్గుతో నిలబడ్డారు. ”మీలో ఎవరో ఒకరు రాయిని కరిగించక పొతే ఎవరు అధికులో నిర్ణయించ లేము కదా. తాళాలు కూడా నా దగ్గరే విడిచి పెట్టాల్సి వస్తుంది మీరు. అది వాగ్గేయకారులైన మీకు ఆవమానం కదా”, అన్నాడు హనుమ. పాపం వారిద్దరూ మరింత సిగ్గుపడి ”గాయక సార్వభౌమా! హనుమా! మా గర్వం అణగి పోయింది. మేము మా చేష్టలకు సిగ్గు పడుతున్నాము. మీ ముందు మా గానం ఎంత. పద్నాలుగు లోకాల్లో మీ వంటి గాయకుడు లేడు. కఠిన శిలను కరిగించే నేర్పు ఎక్కడా మేము చూడ లేదు. మా తాళాలు మాకు ఇప్పించి మమ్మల్ల్ని కనికరించండ”, ని పశ్చాత్తాపం తో హనుమను వేడుకున్నారు నారద, తుంబురులు.

దయామయుడైన హనుమ వారిద్దరిని శ్రీ రాముని అనుగ్రహంతో క్షమించి, వారివీణలు, తాళాలు తిరిగి ఇచ్చి వేశాడు. హనుమ కీర్తి గానం చేసుకొంటు, వాళ్ళిద్దరూ శలవు తీసుకొని వెళ్లి పోయారు. హనుమ సీతా రాముల వద్ద సెలవు తీసుకొని గంధ మాదనం చేరాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *