
అమరావతీ నగర అపురూప శిల్పాలకు అక్షర రూపం, కృష్ణానదీ తరంగాలలో కొట్టికొని పోతున్న వేలాది ఊసులకు సజీవ రూపం శంకరమంచి సత్యంగారి 100 కథల సంపుటి ‘అమరావతి కథలు.’ ‘‘అమరావతిలో పూచిన పూలు, రాలిన పూలు, వీచిన గాలి, ప్రవహించే నీరు, మట్టి, పిట్టలు, మనుషులు, రంగులూ, రుచులు అన్నీ ఈయనకు అణువణువునా అమరిపోయాయి. ఆయన సైద్ధాంతికుడు కాదు. మాంత్రికుడు. కథకుడు. శిల్పి’’ అని ముళ్లపూడి వెంకటరమణ గారు తాను రాసిన ముందుమాటలో సత్యంగారిని కొనియాడారు. అందుకు తగ్గట్టుగానే అమరావతి కథలు ప్రేమతో, భక్తితో, ఆవేశంతో సత్యంగారి హృదయంలోంచి కృష్ణవేణిలా ఉప్పొంగి, ఆస్తికులని, నాస్తికులని, దొంగలని, దొరలని, దాతలని, లోభులని, జాతి, మత విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరినీ స్పృశిస్తాయి. ‘ఎన్ని వరదలొచ్చినా మనసు మాలిన్యాన్ని కడగ లేక పోతోంది,’ అన్న భావనని అమరావతి కథలు ప్రతి అక్షరంలోనూ మనకు కన్పిస్తుంది. 1975 నుంచి 1977 వరకు రెండు సంవత్సరాలపాటు ఆంధ్రజ్యోతిలో ప్రచురించబడ్డ ఈ కథలు సరళమైన భాషలో అమరావతి గ్రామీణ వాతావరణాన్నిప్రతిబింబిస్తాయి. ‘చేదు తెలిసిన నోటికే తీపి రుచి తెలుస్తుందని’, సత్యంగారు ఒక కథలో చెప్పినట్టు, భోజన చక్రవర్తి అప్పంభొట్లు, నావ నడిపే రంగయ్య, దర్జీకోట్లో పనివాడు, పూజారి, సాంబడు, పూల సుల్తాన్, బాకా ఊదే సాయిబు, బడిపంతులు, భోగం పిల్ల, కాటి కాపరి ఇలా సత్యంగారు చెక్కిన ప్రతి పాత్ర దండలో పూలల్లా వేటికి, వాటికే వేరైనా మానవతా విలువలనే దారంతో ఏకమై పాఠకుల హృదయ పీఠంపై పీట వేసుకుని కూర్చొంటాయి. అమరావతి కథలు ప్రపంచ సాహితీ అంబరంలో ఎన్నటికీ ఆరని అఖండ జ్యోతి. అటువంటి అపురూప కథా సంపుటి నుంచి మానవత్వపు విలువల లోతులను సునిశితంగా వివరించే వరద కథ మీ కోసం….
అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం. ఆ వెనక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తున్న బంగారు పూత అమరేశ్వ రాలయ శిఖరం. ఎత్తయిన ఆ శిఖరానికి చుట్టూతా ఎన్నో ఆలయాలు. ఎన్నెన్నో శిఖరాలు. తూర్పున వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుబడ్డ బౌద్ధ స్తూపాలు, పడమట ఈనాడు దిబ్బగా మారిన అల్లప్పటి శాతవాహనుల రాజధాని ధాన్యకటకం, ఉత్తరాన ఆ స్తూపాల్ని, ఆ దిబ్బల్ని వాటి మధ్య ఉండే ప్రజల్ని, ఆ ఊర్ని వడ్డాణంలా చుట్టి గలగల పారుతున్న కృష్ణానది, అద్గదీ అమరావతి.
ఒకనాడు గుర్రాలు, రథాలు తిరుగుతూండగా సైనిక విన్యాసాలు జరిగిన ఆ రాజవీధిలో ఇవ్వాళ కుక్కలూ, గాడిదలూ, మేత దండగని ఊరు మీద తోలేసిన సాంబయ్యగారి ముసలి ఎద్దూ నీరసంగా తిరుగుతున్నాయి. రత్నాల రాసులూ, ముత్యాల మూటలూ బళ్ళకెత్తుకు నడిపించిన ఆ వీధిలో ఇవ్వాళ పొట్టు బస్తాలు లాగుడు బండిమీద తొయ్యలేక తొయ్యలేక తోస్తున్నారు. అంత పెద్ద వీధి ఎవరు ఊడ్చి శుభ్రం చేస్తారు? ఎవరిళ్ళ ముందు వాళ్లు ఊడ్చుకుని కళ్ళాపు జల్లుకొని కసువంతా నడిబజార్లో పోస్తారు. ఆ కసువు కుప్పల మీద కుక్కలు ముడుచుకు పడుకుంటే, ఇంకో పక్క కోళ్లు, కోడిపిల్లలు ముక్కుల్తో కెలుకుతుంటాయి. ఒకనాడు భేరీలు మోగించే ఉత్తర గాలి గోపురంలో పిచ్చి సూరిగాడు పీలికలు కాళ్ళనిండా చుట్టుకొని గంజాయి దమ్ము లాగుతున్నాడు. ఆ విశాల వటవృక్షాల కింద, ఒకనాడు శ్రవణ పర్వంగా వేదగానం విన్పిస్తే, ఇవ్వాళ ‘‘నా కొడుకా, నా ముక్కకే అడ్డొచ్చావు గదరా’’ అంటూ పేకాట జోరుగా సాగుతోంది.
బౌద్ద విశ్వవిద్యాలయంలో కొన్ని వేల మంది దేశ,విదేశీ విద్యార్ధులకు జ్ఞానోపదేశం చేసినచోట – దిబ్బలు, వొట్టి దిబ్బలు కన్పిస్తున్నాయి. దిగులుగా ఉన్న ఆ దిబ్బలమీద పందులు తిరుగుతున్నాయి. వాటిని అదిలిస్తున్నవడ్డిరోళ్ల పోరగాళ్లు కన్పిస్తున్నారు.
కృష్ణకి నీళ్ళకెళ్తున్న ఓ పడచుపిల్ల ముత్యాల కాలిపట్టీ జారిపోతే ‘‘కంగారెందుకులే’’ అనుకుని ఆ పిల్ల కృష్ణలో నీళ్ళు ముంచుకుని ఆ బిందె ఇంట్లో పెట్టి తిరిగివస్తే, ఆ ముత్యాలపట్టీ అక్కడే భద్రంగా ఉండగా కాలికి తగిలించుకొని గునగున వెళ్ళపోయిందట. ఇవ్వాళ కృష్ణకి నీళ్ళకెళ్తున్న చాలామంది ఆడపిల్లలకి కాలి పట్టీలు లేవు. అయినా గునగున నడచిపోతూనే ఉన్నారు. ముఖాలు నవ్వుతూనే ఉన్నాయి, గుండెల్లో ఎంత దిగులున్నా.
అప్పటికీ ఇప్పటికీ సాక్షి ఆ కృష్ణవేణి. గతాన్ని కడుపులో దాచుకుని ఏమీ తెలియనట్టు నిండుగా ప్రవహిస్తోంది. కృష్ణమ్మ అమరేశ్వరుడి గుడి గోడబొరసి పారుతోంది.
పరమేశ్వరుడికి పాదాభిషేచనం చేస్తూ ముందు కెళ్తోంది. అల్లంత దూరాన, సూరీడు రాతిరేళ పడుకునే చోటు నుంచి బయలుదేరి పరుగు పరుగున అమరావతి వైపుకొస్తున్నాడు. కన్ను సారించి చూస్తే రెండు కొండ కొమ్ముల మధ్య నుంచి వచ్చే కృష్ణ కావలసిన చుట్టం ఊరు నుంచి వస్తున్నట్టుంది. తుళ్ళితుళ్ళి పారుతోంది. తలంటుపోసుకొని విప్పుకున్న జుట్టులా పాయలు పాయలుగా పారుతోంది.
ఇంకా తెల్లవారలేదు. దొడ్లల్లో హోరు, ఊళ్ళో హోరు. ఉన్నట్టుండి కృష్ణ పొంగింది. రాత్రికి రాత్రి వరదొచ్చింది. ప్రయళంగా పొంగింది. ఆ మసగ వెల్తుర్లో కృష్ణ గర్జిస్తూ ఇంకా పొంగుతోంది. దొడ్లల్లో నడుమెత్తు నీళ్ళు వచ్చేశాయి. జనంగోల, హడావుడి, తోసుకోటాలు, మట్టిగోడలు విరిగి పడిపోతున్నాయి. గుడిపక్క వీధిలో ఉన్న ఇళ్ళు ఎత్తుమీద ఉన్నా దొడ్లో సామానంతా రాత్రికి రాత్రే కృష్ణలో కలిసి పోయింది.
పల్లవీధి మూడొంతులు మునిగిపోయింది.
మిట్టి మీదికి నీళ్ళెక్కెతున్నాయి.
యానాదుల గుడిసెలు ఎగిరిపోయాయి.
కొట్టాల్లో పశువులు కట్టుగొయ్యర్తో సహా కృష్ణలో కలిసిపోయాయి.
రేవులో పడవల గల్లంతు
లాంచీలు లంగర్లు లాగేసుకుని ఎటో పడిపోయాయి.
తెలతెలవారుతుంటే కృష్ణమ్మ ప్రళయరూపం కన్పించింది. ఈ భూమిని మింగేద్దామన్నంత కోపంతో పొంగుతోంది. అవతలొడ్డు కానటంలేదు. ఎదురుగా జల సముద్రం, ఎగిరెగిరి పడ్తున్న అలలు. ఆ మహా ప్రవాహం మధ్యలో కొట్టుకుపోతున్న ఇళ్ల కప్పులు, క్షణంలో ఆ కప్పు నీళ్ళలో కలిసిపోయింది. మోరలెత్తి అంబా అని అరుస్తున్న పశువులు కొట్టుకుపోతున్నాయి. మోరలు మునిగిపోతున్నాయి. ఆ వడిలో కొమ్ములు మునిగిపోతున్నాయి. కొట్టుకొస్తున్న దుంగలు, కలప. ఓ దుంగ మీద ఊరు కుక్కొకటి దీనంగా మొరుగుతోంది రక్షించమని. ఆ వేగానికి దుంగ మెలికలు తిరుగుతుంటే తనూ గిరగిర తిరుగుతూ కాళ్ళ నిలదొక్కుకుంటోంది ప్రాణభయంతో ఉన్న కుక్క.
అంతలో ప్రవాహం మధ్య నుంచి ఓ మనిషి కేక. ‘‘ దేవుడోయ్ రచ్చించండో’’ అని గుండెలు చీల్చుకుపోయే కేక. క్షణంలో ఆ కేక దూరమైంది. మనిషి కన్పించడంలేదు. ఎవరూ ఏం చేయ్యలేదు. సాయానికి ఎవరైనా వెళ్తే ఆ వడికి తిరిగి రాలేరు. నిస్సహాయంగా ఆ భీభీత్స భయానక దృశ్యాల్ని చూస్తున్నారు ఒడ్డున నుంచున్న జనమంతా. అందరి గుండెల్లో భయం.
ఇళ్ళ ముందుకు నీళ్ళు రావడంతో పిల్లలంతా కాగితం పడవలాట లాడుకుంటున్నారు. పడవలు చేసిపెట్టమని పెద్దల్ని వేధిస్తున్నారు. స్కూలు పిల్లలు గోడమీద బొగ్గుగీతలు గీసి క్షణక్షణం పెరుగుతున్న నీటిమట్టాన్ని కొలుస్తున్నారు.
‘‘పల్లవీధిలో అర్థరాత్రేళ సంగయింట్లో పసిపిల్లకి తడితగిలి అదేడిస్తే లేచాడంటయ్య. అప్పటికి గోడబిరిగె. నీళ్ళు తోసుకొచ్చె. పెళ్ళాం పిల్లలూ సూస్తా బయట కొచ్చారంట.’’
‘‘మిట్టమీది ఎంకటసామి మేకల మందంతా కొట్టుకు పోతుంటే ఏం చెయ్యలేక సూస్తా నుంచున్నాట్టయ్య’’
‘‘సాలెపేటలో వరదలో కొట్టుకొచ్చిన పాము ఇంట్లోదూరి సుబ్బయ్యని కరిచిందట.’’
‘‘లంకల్లో మేతకెళ్ళిన గుడ్లు, పాలేళ్లు ఏవయినారో.’’
ఇలా భయంకరమైన కథలు చెప్పుకుంటున్నారు. కొందరు ఇల్లాళ్ళు కృష్ణమ్మని శాంతించమని పసుపు, కుంకుమ అర్చించి కొబ్బరి కాయలు కొడ్తున్నారు. పిల్లలు కొబ్బరిముక్కల కోసం ఎగబడుతున్నారు. ఊరు సగం మునిగిపోయింది. దొరికిన సామాన్లతో జనమంతా ఊరి మధ్యనున్న మాలక్షమ్మవారి చెట్టు దగ్గర చేరారు. చంటి పిల్లలకి చెట్లకే ఉయ్యాలలు వేశారు. పది గంటల వేళ వరద తగ్గుముఖం పట్టింది.
ఊళ్ళో పెద్దలు వెంకటస్వామి, వీరాస్వామి, అవధాన్లు అంతా మాలక్షమ్మ వారి చెట్టు దగ్గర కుచ్చారు.
‘‘ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం?’’ అని తలపట్లు పట్టుకున్నారు.
‘‘చేసే దేముందయ్యా, ముందీ జనానికి తిండీ తిప్పలు చూడండి,‘’ అన్నారెవరో.
అంతే, పదిమంది కుర్రాళ్ళు గడ్డపారలు తీసుకుని గాడిపొయ్యి తవ్వేశారు. ఇంకో పదిమంది గోతాలు తీసుకుని ఇంటింటికి వెళ్ళి బియ్యం వసూలు చేశారు. కోటలు వంటసామగ్రి తెచ్చారు. పప్పూ, ఉప్పూ, నెయ్యి, నూనె వాటంతట అవే వచ్చాయి. ఎసట్లో బియ్యం పోశారు. వంట నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు, శోభనాద్రి ‘‘ఇహ కూరలే ఆలస్యం’’ అన్నారు. అవధాన్లగారి భార్య, కోమటి సూరమ్మ, తెలగ వెంకమ్మ, గొల్ల సుబ్బమ్మ కత్తిపీటలు ముందేసుకుని చకచక కూరలు తరిగేశారు. పన్నెండు గంటలకల్లా దోసకాయ పప్పు, పులుసు అన్నం తయారయి పోయాయి.
సెట్టిగారు విస్తళ్ళ కట్టలిస్తే నడిబజారులో బారులుగా విస్తళ్లు వేశారు. శాస్త్రిగారు సంధ్యావందనం ముగించుకుని తనూ ఓ విస్తట్లో కూర్చున్నాడు. ఇటుప్రక్క చూస్తే తెలగ సుబ్బరాయుడున్నాడు. ఇంకోపక్క గొల్ల రాముడున్నాడు. ఎవరిపక్క ఎవరున్నారో ఎవరికీ పట్టలేదు. భగవన్నామ స్మరణలు సాగుతున్నాయి. వడ్డనలయిపోయాయి. శాస్త్రిగారు అవుపోసనపట్టి, నెయ్యికోసం చెయ్యి జాస్తే వడ్డించాటినికి వచ్చిన నేతి జాడీ చెంగున వెనక్కి వెళ్ళింది. వడ్డిస్తున్న మాల రంగడు శాస్త్రిగారికి వడ్డించడం ఇష్టంలేక పారిపోతున్నాడు. శాస్త్రిగారు ‘‘ఓరే సంగా,’’ అని పెద్ద కేకపెట్టే, భయం భయంగా వచ్చిన సంగణ్ణి చూసి ‘‘ఒరే సంగా, నీకు ఆకలేస్తుంది. నాకు ఆకలేస్తుంది. ఇంకొకళ్ళు వేసే నెయ్యి, నువ్వు వేస్తే నెయ్యి కాకపోదురా… వెయ్యరా అన్నాడు,’’ చెయ్యి ముందుకు చాపి, సంగడు ఆనందంగా వడ్డించాడు. ‘‘నమః పార్వతీ పతయే’’ అన్న కేకలు దేవాలయ శిఖరాల్నాంటాయి.
వరదొచ్చి మనుషుల మనసులు కడిగేసిందనుకుందామా? అబ్బే! నాకు నమ్మకం లేదు. స్నానం చేసిన ఒంటికి తెల్లారేటప్పటకి మళ్ళీ మట్టి పట్టినట్లు మనసుల్లో మళ్ళీ మలినం పేరుకుంటోంది. ఎన్ని వరదలొచ్చినా మనిషి మసను కడగలేకపోతోంది.
తేటగీతి