మహాశివరాత్రి - ద్వాదశ జ్యోతిర్లింగాలు

మాఘ బహుళ చతుర్దశినాడు మనం “మహాశివరాత్రి” పర్వదినం జరుపుకుంటాం. అమావాస్య కలియుగానికి ప్రతీక. కలియుగం అజ్ఞాన అంధకారాలకు నెలవు. ఈ అజ్ఞాన అంధకారాలను ప్రాలదోలుతూ మహేశ్వరుని ఆవిర్భావమే మహా శివరాత్రి. అథర్వణ వేద సంహితలో యుప స్తంభమునకు పూజించుతూ చేసే స్తుతిలో మొట్ట మొదటి సారిగా శివ లింగం గురుంచి చెప్పబడింది అంటారు. ఈ యుప స్తంభం/స్కంభం ఆద్యంతరహితమైనది. పరమాత్మ రూపమైనది. అట్టి లింగోద్భవం జరిగిన రోజు శివ రాత్రి. స్కంద పురాణం ప్రకారం నాలుగు రకాల శివ రాత్రులు. ప్రతీ రోజు నిత్య శివరాత్రి. ప్రతీ నెల కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి, మాస శివరాత్రి. మాఘ మాసంలో ప్రథమ తిథి నుండి చతుర్దశి రాత్రి వరకు పూజలు చేసి, రాత్రి చేసేది మాఘ ప్రధమాది శివరాత్రి. మాఘమాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి చేసేది మహా శివరాత్రి.

శివపద మణిమాలలో ‘శి’ అనగా శివుడనియు ‘వ’ అనగా శక్తి రూపమని చెప్పబడియున్నది. ఈ “శివరాత్రినాడు” విశేషమైన కాలం “లింగోద్భవకాలం” ఈ కాలం రాత్రి 11-30 నుండి ఒక గంట వరకు ఉంటుందట! ఈ సమయంలో నిర్గుణ, నిరాకార పరబ్రహ్మ, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామియైన లింగరూపంలో నుండే మహాశివుని – ఓం నమశ్శివాయః అంటూ శివపంచాక్షరీ స్తోత్రంతో కొలుస్తూ, “పార్థివ లింగానికి” మొదటి జాములో పాలతోను, రెండవజాములో పెరుగుతోను, మూడవ జామునందు నెయ్యితోను, నాల్గవ జామునందు తేనెతోను అభిషేకములొనర్చిన విశేష పుణ్యఫలం సిద్ధిస్తుంది.

లింగోద్భవం గురించిన అనేక ఉదాంతాలను మన పురాణాలు ఊటంకిస్తున్నాయి. అందులో ప్రధానమైనది, ఒకసారి బ్రహ్మ, విష్ణు మూర్తుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు ఎవరెవరు ఎంతటి గొప్పవారో? తేల్చుకోవాలనే స్థితికి చేరుకుంటుంది. వారిని గమనిస్తున్న పరమశివుడు వారికి కలిగిన అహంభావాన్ని అణగదొక్కి వారి ఇరువురికి గుణపాఠం చెప్పాలనే ఉద్దేశ్యముతో “మాఘమాసం చతుర్దశినాడు” వారి ఇరువురకు మధ్య “జ్యోతిర్లింగంగా” రూపుదాల్చుతాడు.

వారు ఇరువురు ఆలింగం యొక్క ఆద్యంతాలను కనుగోనవలెనని విష్ణుమూర్తి వరాహరూపందాల్చి జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని వెతుకుతూవెళ్ళగా, బ్రహ్మదేవుడు హంసరూపందాల్చి ఆకాశం అంతా ఎగిరాడు. చివరకు కనుక్కోలేక ఓడిపోయి పరమేశ్వరుని శరణువేడుకుంటారు. అప్పుడు ఆ పరమశివుడు తన నిజరూపంతో దర్శనమిచ్చి అనుగ్రహించి వారి అహంకారాన్ని పోగొట్టడంతో, బ్రహ్మ విష్ణువులు పరమేశ్వరుని ఆధిక్యతను గుర్తించి విశేష పూజలతో సేవించారు. ఆ పర్వదినమే “మహాశివరాత్రి” అయ్యింది.

పరమశివుని రూపంలో పరమార్ధం:
మెడలో సర్పం, శిరస్సుపై గంగ – కుండలిని జాగృతిని సూచిస్తున్నాయి. శివనామంలోని మూడుగీతలు – జాగృతి, స్వప్న, సుషుప్తి స్థితులను తెలుపుతున్నాయి. మద్యబింధువు తురీయావస్థకు ప్రతీక. అలానే శివుని మూడో నేత్రం ఆజ్ఞాచక్ర స్థానంలో ఉండే ప్రజ్ఞాచక్షువు. అర్ధనారీశ్వర తత్వంలో శివపార్వతులు ఇడా పింగళ నాడులకు సంకేతాలు. పాక్షికంగా మూయబడిన కళ్ళు ధ్యానస్థితిలో అంతర్ముఖస్థితికి దర్పణం. శివుడు ఆదిగురువు. యోగ గురువు. శివుని వృత్తి భిక్షాటన, ఆసనం పులి చర్మం, ధరించేది గజచర్మం, నివసించేది స్మశానం (వైరాగ్యానికి సూచన) ఆయన దగ్ధం చేసింది మదాకారం…. ఇవన్నీ జన్మ బంధ విమోచనలకు మార్గంలకు సూచనలు.

ద్వాదశ జ్యోతిర్లింగాలు: భారతదేశంలో శివుడు 12 జ్యోతిర్లింగాల రూపంలో వెలిశాడు.

” ఓం సౌరాష్ట్రే సోమనాధం చ, శ్రీ శైలే మల్లికార్జునం ||
ఉజ్జయిన్యాం మహాకాళం, ఓంకారే పరమేశ్వరం ||
కేదారం హిమవతః పృష్ఠేః, ఢాకిన్యాం భీమశంకరం ||
వారణాస్యాం తు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీతటే ||
వైద్యనాధం చితాభూమౌ, నాగేశం దారుకావనే ||
సేతుబంధే చ రామేశం, ఘశ్మేశం చ శివాలయే ||”

1. సోమనాధ లింగం (సౌరాష్ట్రం): పన్నెండు జ్యోతిర్లింగాలలోమొదటిది ప్రభాసక్షేత్రంలో ఉన్న సోమనాధ స్వామి. దక్ష ప్రజాపతి తన 27 గురు పుత్రికలను (అశ్వని, భరణి మొదలు 27 నక్షత్రాలు వీరే) చంద్రునకిచ్చి పెళ్లి చేశాడు. కాని చంద్రుడు ఒక్క రోహిణి యందు మాత్రం ఎక్కువ ప్రేమకలిగి, మిగతా వారిని సరిగ్గా చూడకపోగా వారంతా తమ తండ్రితో చెప్పుకున్నారు. అది సహించని దక్షుడు, చంద్రుని క్షయ వ్యాధిగ్రస్తుడై పోవాలని శపించాడు. బ్రహ్మదేవుని సూచనమేరకు, చంద్రుడు ఈ ప్రభాస తీర్థానగల శివలింగాన్ని అర్చించి రోగ విముక్తుడైనాడు. సోముడు అనగా చంద్రుడు. లింగరూపుడై ఇక్కడ వెలసిన శివుని ఆరాధించాడు కనుక దీనికి సోమనాధ క్షేత్రం అని పేరు వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ వున్న సోమనాధ మందిరంలోని గర్భగుడి క్రింద ఉన్న గుహలో – ఆనాటి చంద్రార్చిత శివలింగాన్ని చూడగలం!

2. మల్లికార్జున లింగం (శ్రీశైలం): ఇది మన ఆంధ్రప్రదేశలో ఉండడం విశేషం. శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిగా కొలువై ఉన్న స్వామివారు సాక్షిగణపతి సహితుడు కూడా! క్రౌంచ పర్వతం వీడి అలిగి వెళ్లిపోయిన తమ కుమారుని షణ్ముఖుని వెతుకుతూ ఇక్కడ జ్యోతిర్లింగ రూపుడై శివుడు వెలిశాడు. ‘శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే’, శ్రీశైల శిఖర దర్శనం చేసిన వారికి పునర్జన్మ అనేది ఉండదని నమ్మిక. ఈ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాలలో కూడా ఒకటి. ఇక్కడ అమ్మవారు భ్రమరాంబ.

3. మహాకాళ లింగం (ఉజ్జయిని): శిప్రా నదీ తీరంలోని (మాళవ) ఉజ్జయినీ నగరంలో మహా కాళేశ్వర లింగం మూడవది. ఈ నగరములో 7 సాగర తీర్థములు, 28 తీర్థములు, 84 సిద్ధ లింగములు, 30 శివలింగములు, అష్టభైరవులు, ఏకాదశరుద్రులు, వందలాది దేవతా మందిరములు, జలకుండము

ఉన్నాయి. ఉజ్జయిని రాజు చంద్రసేనుడు శివార్చనపరుడై ఉండడం చూసి, శ్రీకరుడనే గోపబాలకుడు ఆ విధానం శ్రద్ధగా పరికించి ఒకరాతిని (సాలగ్రామం) తెచ్చి తానూ అట్లే పూజించసాగాడు. ఇంట్లో వాళ్లు అతని పూజకు ఆటంకం కల్పిస్తున్న కొద్దీ అతడిలో భక్తి తత్పరత అధికం కాసాగింది. చివరకు స్వామి ఆ రాతిలోనే స్థిరపడ్డాడు. సంధ్యా సమయంలో ఈ కాళేశ్వర లింగాన్ని దర్శించడం విశేష ఫలప్రదం.

4. ఓంకారేశ్వర, అమలేశ్వలింగం (ఓంకారం): మాళవ దేశంలోని నర్మదాతీరంలో ఉన్న ఈ జ్యోతిర్లింగం, ఈ క్రమంలో నాలుగవది. ఇక్కడ ఒకే లింగము రెండు బాగములుగా ఉండి, రెండు పేర్లతో పూజింపబడుతున్నది. పర్వతాలన్నిటిలోకెల్లా తానే గొప్ప పర్వతాన్ననే అహంకారంతో వింధ్యపర్వతం విర్రవీగుతూండగా, అట్టి వింధ్యుడికి – అహంకారం అణచడానికి నారదుడు నడుం కట్టాడు. పర్వతాల్లో కెల్లా మేరువే గొప్పవాడని – అతడికి దైవత్వం ఉందనీ నారదుడు చెప్పడంతో, తానూ దైవత్వం సాధించాలని వింధ్యుడు నర్మదా నదీ తీరాన అమలేశ్వరంలో పార్థివ లింగారాధన చేసి, పరమేశ్వరాను గ్రహానికి పాత్రుడయ్యాడు. దేవతల కోరిక మేరకు జ్యోతిర్లింగ రూపుడై పరమశివుడు ఓంకార మూర్తిగా ఇచ్చట వెలిశాడు. ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణ.

5.కేదారేశ్వర లింగం (కేదారనాథ్): హిమాలయ పర్వత శ్రేణులలో, ఒక కొండ కొనకొమ్ము ఆకృతిలో సదాశివుడు కేదారనాధుడిగా అవతరించడానికి నరనారాయణులనే మునివర్యులే కారకులు. వారి ఉగ్రతపోదీక్షకు మెచ్చిన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపుడైనాడు. మంచు కారణంగా ఈ దేవాలం సంవత్సరానికి ఆరుమాసాలు మాత్రమే దర్శనమునకు తెరిచి ఉంటుందిం.

6. భీమశంకర లింగం (ఢాకిని): సంపూర్ణ శివభక్తులైన సుదక్షిణ – కామరూపుల జంట సంరక్షణార్థం పార్వతీపతి జ్యోతిర్లింగ రూపుడై సహ్యాద్రి కనుమలలో భీమనదీ ఉత్తర దిశాతీరాన భీమశంకర జ్యోతిర్లింగంగా (త్రిపురాసుర సంహారము తర్వత) వెలసిన తావు ఢాకిని, ఇక్కడ విహారానికి వచ్చి, ఈ ప్రాంతపు నైర్మల్యానికి ముచ్చటపడి లింగరూపుడైనాడు. అమ్మవారు కమలజాదేవి. శాకిని, ఢాకిని మందిరములు, మోక్ష కుండము, జ్ఙాన కుండము ఇక్కడ ఉన్నాయి. సర్వసంకటహరుడుగా, భీమేశ్వర లింగానికున్న ఖ్యాతి అనంతం.

7. విశ్వేశ్వర లింగం (వారణాశి): మహా క్షేత్ర తీర్థరాజమై, సర్వ విద్యాధామమై విరాజిల్లే (అవిముక్తం) ముక్తి క్షేత్రమైన వారణాశి లేదా కాశీ సాంబశివునికి అత్యంత ప్రీతి పాత్రమైన ప్రదేశం. ప్రళయకాలంలో కూడా – ఈ క్షేత్రాన్ని విశ్వేశ్వరుడు లయం నుండి మినహాయింపు ఇచ్చినట్లు ప్రతీతి. స్వామి లింగరూపుడై ఇచ్చట వెలసి, సదా సుప్రసన్నంగా సర్వ సేవ్యంగా ఉంటాడు. అన్నఫూర్ణ – ఢుంఢి వినాయక బిందుమాధవ సహితుడైనట్టి ఈ ప్రదేశానికి ‘కాశ్యాంతు మరణాన్ముక్తిః’ అని ఇక్కడ మరణించేవారికి ముక్తి కలుగుతుందని శాస్త్ర వచనం. శ్రీహరి తపస్సు చేసిన విశేషస్థలి కూడా.

8. త్రయంబకేశ్వర లింగం (త్రయంబకం): బ్రహ్మగిరిపై గౌతమ మహర్షి తపస్సుకు అనుగ్రహించి, నాసికవద్ద తన జటాజూటం నుండి గోదావరి నదిని ప్రవహింపజేసి అనుగ్రహించిన పరమేశ్వరుడు ఈ నదీ తీరాన త్రయంబకేశ్వరుడనే జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఇక్కడి లింగము చిన్న గుంటవలె కనిపించును, అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకగా మూడు చిన్న (బొటనవేలివంటి) లింగములున్నవి. అమ్మవారు కొల్హాంబిక. గంగాదేవి మందిరము కూడ ఉన్నది. కుశావర్త తీర్థము, గంగాద్వార తీర్థము, వరాహ తీర్థము ముఖ్యమైనవి. 12 సంవత్సరములకొకమారు జరిగే సింహస్థపర్వము పెద్ద పండుగ.

9. వైద్యనాథ లింగం లేక అమృతేశ్వరుడు ( వైద్యనాదం, దేవఘర్): అమృతమధనానంతరము ధన్వంతరిని, అమృతమును ఈ లింగములో దాచిరనీ, స్పృశించిన భక్తులకు అమృతము లభించుననీ నమ్మకము. రావణాసురుని అనుగ్రహించిన శివుడు, తానే స్వయంగా ప్రసాదించిన లింగం ఎక్కడా క్రిందపెట్టకుండా పూర్తిగా చేతులతో మాత్రమే తీసుకేళ్లాలని ఆంక్షపెట్టి మరీ ఇచ్చాడు. ఎక్కడ దానిని భూమిపై ఉంచితే అక్కడ ప్రతిష్ఠాపన అయిపోగలదన్నాడు. తన లంకానగరిలో ప్రతిష్ఠించాలన్న తాపత్రయంతో దాన్ని పొందాడు రావణుడు. వింధ్య పర్వతాల దగ్గర కొచ్చేసరికి, సాయం సంధ్యాసమయం కావటంతో లింగాన్ని చేతుల్లోంచి దించవలసివచ్చి, సమీపంలోనే ఉన్న ఓ గొల్లపిల్ల వాడిని పిలిచి తాను వచ్చి తీసుకొనేదాకా ఆ లింగం చేతుల్లోనే ఉంచవలసిందని కోరాడు. ఈలోగా దేవతల ప్రేరణచే, ఆ గొల్లవాడు రావణుడు రాకుండానే దాన్ని నేలన పెట్టేశాడు. దాంతో అది అక్కడే ప్రతిష్ఠితం అయిపోయింది. పర్లి అనే ప్రాంతంలో ఈ జ్యోతిర్లింగ ప్రతిష్ఠకు గొల్లని రూపంలో శ్రీకృష్ణుడే కారకుడని ఐతిహ్యం. గొల్లవాని రూపంలో వచ్చింది వినాయకుడని కూడా మరో కథనం. శివుడు ప్రత్యక్షంగా రోగనివారకుడై వైద్యనాధస్వామిగా అనుగ్రహిస్తున్నాడిక్కడ.

10. నాగేశ్వర లింగం (ద్వారక): నాగనాధుడు లేక నాగేశ్వరుడుగా ద్వారకా పట్టణాన విరాజిల్లు తున్న పరమేశ్వర జ్యోతిర్లింగం పదవది. ఈ జ్యోతిర్లింగము ద్వారక, ఔధ్ గ్రామ్, ఆల్మోరా (ఉత్తరప్రదేశ్) అను మూడు స్థానములలో ఉన్నట్లు చెబుతారు. దారుకుడనే రాక్షసుడి బారినుండి సుప్రియుడు అనే మహాశివార్చనాపరుని రక్షించి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు ఇక్కడ. ఈ లింగార్చన వల్ల చక్రవర్తిత్వం సిద్ధిస్తుందని నలచక్రవర్తి నిరూపించాడు.

11. రామనాథ స్వామి లింగం (రామేశ్వరం): త్రేతాయుగంలో రాముడు, రావణవధ అనంతరం, సేతుబంధనం చేసిన ప్రాంతంలో శివార్చన చేసి, జ్యోతిర్లింగ రూపంలో అక్కడే స్థిరుడిగా ఉండమని కోరగా పరమేశ్వరుడు అనుగ్రహించాడు. కాశీ గంగా జలమును రామేశ్వరమునకు తెచ్చి అర్చించిన తరువాత, మరల రామేశ్వరములోని ఇసుకను కాశీలో కలుపుట సంప్రదాయము. ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధినీ దేవి.

12. ఘృష్ణేశ్వర లింగం (దేవగిరి): దక్షిణాదిన దేవగిరి పర్వత సమీపంలో ఘశ్మ అనే మహా భక్తురాలి కోరికపై ఘశ్మేశ్వర లింగరూపుడైనాడా మహేశ్వరుడు.

పైన చెప్పిన ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని స్తోత్ర రూపాన గాని, నామరూపాన గాని పఠిస్తే సర్వ పాపాల నుండి విముక్తులవుతారు.

శ్లో. ద్వాద శైతాని నామాని – ప్రాతరుత్థాయ యః పఠేత్‌
సర్వ పాప వినిర్ముక్తం – సర్వసిద్ధిప్రదం లభేత్‌ ||
యం యం కామ మపేక్ష్యైవ – పఠిష్యంతి నరోత్తమాః
ప్రాష్యంతి కామం తం తం హే – పరత్రేహ మునీశ్వరాః ||
ఏతేషాం పూజనే నైవ – వర్ణానాం దుఃఖనాశనం
ఇహలోకే పరత్రాపి – ముక్తిర్భవతి నిశ్చితం ||

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *